అమ్మ దైవాంశ సంభూతురాలని అందరికీ తెలిసిన విషయమే. కొందరికి రాజరాజేశ్వరిగా అనిపిస్తే కొందరికి దుర్గా, లక్ష్మి, సరస్వతీ దేవేరులుగా కనిపించ వచ్చు. కొందరికి వారి ఇష్టదైవంగా కన్పించ వచ్చు. చాలా మందికి కేవలం మానవమాత్రురాలిగా కనిపించ వచ్చు. ఇల్లా అనుకునే వాళ్ళంతా అమ్మ దృష్టిలో రకరకాల మనస్తత్వాలుగల బిడ్డలు. ఆమె ఏమిటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాము. “నేను ప్రత్యేకించి ఏ ధర్మం కోసమూ రాలేదు. తల్లి ధర్మం కోసం వచ్చాననుకుంటున్నా. ఈ రూపం అది. ఈ స్థానం అట్లాంటిది. కనుక నాకు ఎవరైనా ఎట్లాంటి వారైనా బిడ్డే. మీరు నన్ను వెతకటం కాదు. నేనే మిమ్మల్ని వెతుక్కోవాలి. నా బాధ్యత అట్లాంటిది. అందరికీ సుగతే అన్నానంటే మీదేమీ లేదు కనుక మీరు బురద పూసుకున్నా ఏం పూసుకున్నా దాన్ని కడిగి శుభ్రపరచవలసిన బాధ్యతనాది. దానికి మాతృత్వం కావాల్సి వచ్చింది, వచ్చాను” . అని అమ్మ స్వయంగా తన గురించి చెప్పిన మాటలు. (‘శ్రీవారి చరణ సన్నిధి’ అనే అమ్మ డైరీ గ్రంధంలో బ్రహ్మాండం వసుంధర రాసినది).
అనసూయ అంటే అసూయ లేనిది. ఈ అసూయ అనే విషబీజం, గొప్పగా భావించ పడుతున్న ఆధ్యాత్మిక రంగంలోనే వున్నప్పుడు ఇక లౌకికుల విషయం వేరే చెప్పాలా? సాక్షాత్తూ త్రిదౌరులే ఆనాటి పతివ్రత అనసూయా దేవి మహిమకు అసూయచెంది తమ భర్తలను ఆమెను పరీక్షించి ఓడించాలని పంపారు.
ఆమె త్రిమూర్తులను పసిబిడ్డలుగా చేసి ఊయలలో కట్టి పడేసింది. మన అమ్మ కూడా అనేక మంది ఆధ్యాత్మిక మహామహులను సిద్ధ పురుషులను తన మాతృత్వపు ఒడిలో చేర్చుకుంది. ఎవ్వరిపైనా బేధభావంలేని అమ్మ అనసూయగా సార్థక నామధేయురాలైంది. “రాగంబు పోనాడి ద్వేషంబు విడనాడి అనసూయ వైనావు అమ్మా? నా మనసంత నిండున్న బ్రహ్మ” అని బుచ్చి రాజుశర్మగారు చాలా చక్కగా పాడారు.
ఆమె నిర్హేతుకమైన కరుణ, ప్రేమలు ఆమెను ద్వేషించిన వారి మీద కూడా ప్రసరింప చేసింది. ఎవరో “అమ్మా నిన్ను నిందించే వారికి నీ సమాధానం ఏమిటంటే, “వాళ్ళలో కూడా నా నిరంతర స్మరణ జరుగుతోంది కాబట్టి వాళ్ళకీ సుగతే” అని సమాధాన మిచ్చింది. ముఖ్యంగా గమనించ వలసిన అంశం ఏమిటంటే “కర్తృత్వ భావన లేకుండా ఉండడం”. వేలాది మందికి భోజనాలు పెడుతున్నా అమ్మ ‘నేను పెడుతున్నాను’ అనే భావం ఏనాడూ వ్యక్తపరచలేదు. పెట్టేది తాను కాదని వాళ్ళ అన్నం వాళ్ళు తిని పోతున్నారని పదే పదే చెప్పేది. అక్కడ అన్నం లేక నీళ్ళు తాగినా తన బాధ్యత ఏమీ లేదని చెప్పింది. నేను చేస్తున్నాననే కర్తృత్వ భావం లేకపోవటం మంచికీ, చెడుకీ, దేనికీ అంటకుండా వుండటం భగవదవతార లక్షణం. ఆనాడు ద్వాపర యుగంలో బాలకృష్ణుడు తనకు స్తన్యపానమిచ్చి చంపజూచిన పూతనను సంహరించి యశోదకిచ్చిన సుగతే ఇచ్చాడని భాగవతంలో చెప్పారు. క్షణకాలం మాతృత్వం వహించి స్తన్యాన్ని ఇచ్చిన కారణంగా ఆమెకు యశోదతో సమానమైన సద్గతి నిచ్చాడు. ద్వేషంతోకాని ప్రేమతోకాని తనను దర్శించి స్పృశించి, స్మరించిన, ప్రతి జీవికీ భగవంతుడు అకర్తృత్వ భావంతో సద్గతి నిస్తాడని, అమ్మ కూడా అంతే. తన దర్శన మాత్రంచేత, స్మరణ మాత్రం చేత వారికి – సుగతి నిస్తానని హామీ ఇచ్చింది. ఆమె మహిమలు చూపి జనాన్ని ఆకర్షించాలనుకోలేదు. వాళ్ళ కష్టాలన్నీ తీర్చి, సుఖాలను ప్రసాదించి వాళ్ళు కోరిన కోర్కెలన్నీ తీరుస్తానని కూడా ఎవ్వరికీ హామీ ఇవ్వలేదు. పైగా ప్రారబ్ధకర్మ అనుల్లంఘనీయమైనదని ఖచ్చితంగా చెప్పి తాను కూడా అనుభవించింది. కర్మ సూత్రాలకు భంగం కలగ కూడదనే నియమ నిబంధనలకు ఆమె కూడా బద్ధురాలైన అటువంటి ఆమె వద్దకు ఇన్ని వేల మంది ఎందుకు వస్తున్నట్లు? కేవలం ఆమె ప్రేమ పాశంతోనే అందర్నీ తన వద్దకు లాక్కుంది. “నా దర్శనం చాలు” అని అంతగా ఎందుకు నమ్మబల్కింది! నాకొకటే తోస్తున్నది. అమ్మ ఒక ఆధ్యాత్మిక అయస్కాంతం. అయస్కాంతం రాపిడితో ఇనుప ముక్క కూడా కొంత సేపటికి అయస్కాంతమై పోతుంది. ఒక్క భౌతిక పదార్థమైన అయిస్కాంతానికే అంత శక్తి వుంటే అమ్మ వంటి ఆత్మ అయస్కాంతానికి, ఎంత శక్తి వుండాలి?
ఆమె తన సన్నిధి అనే అయస్కాంత క్షేత్రంలో ఆమెను దర్శించిన వారిని, స్మరించిన వారిని కూడా అయస్కాంతీకరణం చేస్తూ వచ్చింది. ఈనాటికీ ఆమె భౌతిక రూపం మాయమైనా ఆమెను స్మరించిన వారికి తన ఆధ్యాత్మిక అయస్కాంత శక్తిని ప్రసాదిస్తున్నది. ఇది ఒక “ఆధ్యాత్మిక అయస్కాంతీకరణమ”ని ఒక అద్భుతమైన ప్రక్రియగా భావించ వచ్చును.
అమ్మ ఒక విధంగా ఆధ్యాత్మిక రంగంలో ఒక సంస్కర్తగా పని చేసిందని కూడా చెప్ప వచ్చును. ఈ రంగంలో అనేక వివాదాలకు, సందేహాలకూ, భయాలకూ, మూఢ నమ్మకాలకూ, అమ్మ స్వస్తి చెప్పింది. తన వివేకమనే ఖడ్గంతో అజ్ఞానపుటడవిని ఖండించి సరైన బాట వేసిందని చెప్ప వచ్చును.
“శుష్క వేదాంత గాఢాంధ కారమ్ములో, నిష్క్రియా రూపమౌ బ్రతుకు సమరమ్ములో చూపావు వెన్నెల్ల బాట! నోట చెప్పావు ముత్యాలమాట” || ర్మాగారు రాశారు. ఈ విషయంలో అందరి మనోభారాల్ని. తగ్గించిందని చెప్పవచ్చు. ఈ మూఢ నమ్మకాలు సంఘంలో ఎంతగా పేరుకు పోయాయి అంటే ఆఖరికి ఆధ్యాత్మికరంగంలో కూడా ఒక అడుగు ముందుకు వెయ్యాలంటే భయం. తొంభైతొమ్మిది సందేహాలూ, అనుమానాలతో సతమత మవుతూ వుంటారు. ఆ మంత్రం మంచిదా, ఈ మంత్రం మేలా, ఈ పూజ చేస్తే నెత్తి అణుస్తుందేమో, లేక బెడిసికొడ్తుందేమో ఈ టైము మంచిది ఆ టైము మంచిది కాదు అని ఊగిసలాడే బలహీన మనస్కులకు అమ్మ చాలా ఖచ్చితంగా నమ్మబల్కింది. భగవంతుని విషయంలో చెడు అనేది లేనే లేదని భగవంతుడే కాలస్వరూపమైనపుడు అన్ని సమయాలూ మంచివేననీ, పరమాత్మ శక్తి అంతటా ఒకటే కాబట్టి ఆ దేవుడు మంచి ఈ దేవత మంచి కాదు అనే ప్రసక్తి లేదని శబ్ద స్వరూపమే పరమాత్మ ఉనికి అయినపుడు ఏమంత్రమైనా భగవంతుడిదేనని అందరికీ ఆమోదయోగ్యంగా బోధించింది. మనిషి కర్మని బట్టే అన్నీ జరుగుతాయని జరిగిందిమార్చలేము జరగబోయేది తెలియదు. జరుగుతున్న కాలం జారిపోయేలోగా మేల్కొనాలి. ముల్లుని ముల్లుతోనే తీసినట్లు మనసుతోనే మనసును నియంత్రించాలి “గురుతుతో గుర్తును గుర్తించి గురుతును చెరిపెయ్యాలని చెప్పింది. ఏ సాధనలోనైనా ఈ సూక్ష్మ రహస్యమే దాగి వుంది. చెప్పటానికి సూక్ష్మమైనా చెయ్యటానికి ఉతృష్టం, దానికి ఎంతో పుణ్యముతోబాటు తరుణము రావాలి.
అశుభం జరిగినవారి గాలి సోకితే శుభం జరిగే వారికి ఎటువంటి రాదు. ఎవరి కర్మానుసారం వారికి కష్టసుఖాలు కల్గుతాయి. దుష్కర్మల బాధలు పడేవారు అంటువ్యాధిగ్రస్తులుకారు, మిగతావారికి అశుభం అంటించడానికి. ఆమె ఆశ్రమ ఆవరణలో సాగరుగారి అబ్బాయి రవి మరణం జరిగిన రోజునే మరో ప్రక్క వఝూ ప్రసాద్ అనే భక్తుని వివాహం జరిపించింది. రెండు కార్యక్రమాలు ఆమె చేతి మీదుగానే జరిగాయి దేని దారి దానిదే అంది.
– (సశేషం)