అమ్మ అద్భుతమైన అమృతదర్శనం ప్రసాదిస్తున్న తొలిరోజుల్లో తన వద్దకు వచ్చేవారికి ప్రసాదంగా ఏదో ఒకటి ఇచ్చేది. ఒక్కొక్కప్పుడు మట్టికూడ ఇచ్చిన సందర్భాలు వుండేవి. అయితే అది మామూలు మట్టి కాదు. అమ్మ అమృతకరస్పర్శ తగలగానే ఆ మట్టి అద్భుతమైన, అపూర్వమైన రుచి, సువాసన సంతరించు కునేది. ఎన్ని రోజులైనా ఆ సువాసన, రుచిలో మార్పు వుండేది కాదు. అమ్మ పసితనంలోనే ఒకసారి పావు లూరు ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రదక్షిణలు చేసి, మట్టిగడ్డలు నివేదన చేసి, అవే ప్రసాదంగా ఇస్తే ఆ మట్టిగడ్డలనుండి ప్రసరితమైన పరిమళానికి, రుచికి సమ్ముగ్ధులై పోయారు ఆ ప్రసాదం అందుకున్న అదృష్టవంతులు!
అలాగే అమ్మ పాదతీర్థం. మహామహిమాన్విత మైనది ఆ పాదతీర్థం. అది కేవలం మామూలు మంచినీళ్ళే అయినా, అమ్మ పావన పాదస్పర్శతో శ్రీమహావిష్ణు పాదోద్భవ పవిత్ర భాగీరథీ సదృశమై, సర్వరోగ నివారకమై, సర్వరక్షాకరమై, భక్తుల భేదమోదములలో తోడు నీడగా వుంటుంది.
ఇక అన్నప్రసాదమైతే సరేసరి. సాక్షాత్తూ అన్నపూర్ణేశ్వరి అయిన అమ్మ చేతి ముద్దలు తిన్నవారికి ఇక జన్మపరంపర అన్న ప్రశ్న ఎలా ఉత్పన్నమవుతుంది? అందుకే అమ్మ “అందరికీ సుగతే” అని ప్రకటించిందేమో!
అన్నపూర్ణాలయంలో మనం తినే అన్నప్రసాదంలో ఒక్కొక్క మెతుకు, మన జన్మ పరంపరలోని కర్మక్షయానికి కారణమవుతుందని, సిద్ధ యోగీశ్వరులైన సద్గురు శ్రీ శివానందమూర్తిగారు ఎప్పుడో వివరించారు! కడుపులో అల్సర్ వున్నవారు అమ్మ చేతి మీదుగా ఆవకాయ ముద్దలు తిని చిత్రంగా ఆ వ్యాధినుంచి బయటపడినవారు వున్నారు. అనేక దీర్ఘవ్యాధుల బారినపడినవారు కూడా అన్నపూర్ణాలయ ప్రసాదంతో వ్యాధివిముక్తులైనవారూ. ఎందరో వున్నారు.
ఇక అనేకమందికి, అమ్మ కొత్తగుడ్డలు పెట్టి ఆశీర్వదించటం మామూలు. కొత్తగా పెళ్ళిచేసుకుని అమ్మ దర్శనార్ధమై వచ్చిన నూతన దంపతులకైతేనేమి, పుట్టెడు దుఃఖంతో ఆత్మస్థైర్యం కోల్పోయినవారికైతేనేమి, అమ్మ ఇచ్చే ఈ వస్త్రప్రసాదంలో ఎంతో పరమార్థం వుంది. జిల్లెళ్ళమూడి తరచూ వచ్చేవారిలో ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక సందర్భంలో ఈ వస్త్ర ప్రసాదం అందుకోలేక పోయిన వారు ఎవరూ వుండరంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. అమ్మ ప్రసాదం – మట్టి కానివ్వండి, మరోటి కానివ్వండి, అమ్మ ప్రసాదం అందుకోవటమే ఒక యోగం. అది అత్యంత మహా మహిమాన్వితమైన దనటంలో ఏ విధమైన సందేహమూ లేదు. ఆ ఎరుకే జ్ఞానహేతువు.
ఇప్పటికీ శ్రీవిశ్వజననీ పరిషత్ ఆ సంప్ర దాయాన్ని అమ్మ ప్రేరణగా, పవిత్ర బాధ్యతగా, నిరహంకారంగా, నిష్కామంగా కొనసాగిస్తూనే వున్నది.
అన్నపూర్ణాలయంలో అన్నప్రసాదం నిత్యం వందలాది మంది స్వీకరిస్తూనే వున్నారు. ఇంకా ఎంతోమందికి అమ్మ శేషవస్త్ర ప్రధానం కూడా నిరంతరంగా జరుగుతున్నది.
ఇంత శ్రద్ధగా, ఇంత నిబద్ధతతో, అరుదైన ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న సంస్థ శ్రీవిశ్వజననీ పరిషత్ ఒక్కటేనంటే అది అభిమానం వాక్యం కావచ్చునేమో కాని అతిశయోక్తి మాత్రం కాదు.
పదార్థదృష్టితో గాక ప్రసాదదృష్టితో స్వీకరించిన వారికి అవి అమృతప్రాయం, కల్పవృక్ష సదృశం, ఆధి వ్యాధులకు దివ్యౌషధం ఐహిక అముష్మిక ఫలప్రదం.