1. Home
  2. Articles
  3. Mother of All
  4. ధన్యజీవులు (డాక్టర్ పన్నాల రాధాకృష్ణశర్మ)

ధన్యజీవులు (డాక్టర్ పన్నాల రాధాకృష్ణశర్మ)

P S R Anjaneya Prasad
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 22
Month : January
Issue Number : 1
Year : 2023

“మట్టి బొమ్మలను మహారణానికి – గట్టు నడిపిన శాలివాహనుడు” అని పాతాళ భైరవిలో అనుకుంటాను ఒక పాటవిన్నాను. చిన్నపుడు. అలాగే ‘శాలివాహన శకం’ ‘విరకం’ అని కూడా పంచాంగంలో చూస్తుంటాం. నిజానికి అమ్మ చేసిన పని గానీ, అమ్మ ప్రతిపాదించిన విశాల విశ్వకుటుంబ తత్వం గాని ఇంతవరకప్రపంచంలో ఎవరూ వెదజల్లలేదనే నా విశ్వాసం. నిజానికి జిల్లెళ్ళమూడి అమ్మశకం మొదలు కావాలి.

అమ్మతో శ్రీ పన్నాల రాధాకృష్ణ శర్మ ఉరియు శ్రీమతి కాత్యాయని

అమ్మ కొంతమందిని కొన్ని పనులకు ఎన్నుకున్నది. వారి శక్తిసామర్థ్యాలతో పనిలేదు. అమ్మే ప్రసాదిస్తుంది కావలిసినప్పుడు శక్తిని. ఇది ఎన్నో విషయాలలో, సందర్భాలలో రూఢియైన సంగతి.

ప్రస్తుతానికి వద్దాం. శ్రీ పన్నాల రాధాకృష్ణశర్మ గారు జిల్లెళ్ళమూడికి 1960లో మొదటిసారి వచ్చారు. కృష్ణాజిల్లా నర్సాపురం గ్రామంలో సామాన్య మధ్యతరగతి కుటుంబంలో 22.3.1932న కానాదిభట్ల సూర్యనారాయణ, కోటమ్మలకు జన్మించినవారు పన్నాల వెంకటసుబ్బయ్య వున్నమ్మలకు దత్తత బోయారు. రెండుచోట్లా అంతంతమాత్రపు కుటుంబాలే. చేతికి నోటికి అడ్డం లేకపోతే అదే గొప్ప. ఇక బయట ప్రదేశాలకు పంపి విద్య నేర్పించటం సాధ్యమయ్యేపనేనా-

శ్రీ పన్నాల వారు కృష్ణాజిల్లా గూడవల్లిలోనూ, పైడిమణ్ణి చంద్రశేఖర శాస్త్రిగారి వద్ద నేలకొండపల్లిలోనూ సంస్కృతవిద్య చదువుకున్నారు. ప్రైవేట్ గానే విద్యాప్రవీణ పాపై గుంటూరు జిల్లా పరిషత్ పాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేసేవారు.

వారిని అమ్మ జిల్లెళ్ళమూడిలో సంస్కృత విద్యావ్యాప్తికి ఎన్నుకున్నది. జిల్లా పరిషత్లో పనిచేస్తున్న రోజులలో ధర్మపురి కాలేజిలో సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్గా వెళ్ళారు. ఆ కాలేజికి బిల్డింగ్ లేదు. దేవాలయంలోనే కాలేజి జరిగేది. అప్పుడే జిల్లెళ్ళమూడిలో ఇన్ని వసతులున్నవి కదా! ఇక్కడెందుకు కాలేజి పెట్టకూడదు అని అమ్మను అడిగారు. పరిషత్లో పనిచేస్తున్న రోజులలోనే అమ్మ అడిగింది ఇక్కడ కాలేజి పెడితే ప్రిన్సిపాల్ గా వస్తావా? అని అప్పటికి శర్మగారు యం.ఎ. కూడా పాస్ కాలేదు. పైగా పల్లెటూరు. ఇక్కడ కాలేజి ఏమిటి? అనుకున్నవారు వారే ఇక్కడ కాలేజి పెట్టితే బాగుంటుందని అమ్మను అడిగే పరిస్థితులు కల్పించింది. “అలాగే పెట్టు నాన్నా” అన్నది అమ్మ.

1972లో జిల్లెళ్ళమూడి కాలేజికి Grant-in-aid లేకుండా పర్మిషన్ వచ్చింది. అమ్మ కబురు చేసింది. ఆశ్చర్యం! అదే సమయంలో అలహాబాద్ యూనివర్శిటీలో ప్రొఫెసర్గా ఉద్యోగం వచ్చింది. శర్మగారి భక్తికి పరీక్ష! శర్మగారు జిల్లెళ్ళమూడిలోనే పనిచేయటానికి మొగ్గు చూపారు. ఒక సంవత్సరం 6 నెలలు నానాయాతనలు పడ్డ తర్వాత అమ్మ కరుణతో మొదటి నుండి జీతాలు వచ్చాయి. 1973లో జరిగిన సంఘటన.

శర్మగారు జిల్లెళ్ళమూడి వచ్చిన క్రొత్తలోనే ప్రసాదరాయ కులపతిగారు వ్రాసిన అంబికాసాహస్ర, ఐంద్రీ సాహస్రి, శివసాహస్ర కావ్యాలు అమ్మ వారికి ఇచ్చింది. అవి చదివిన వారు ఇలా మనం కూడా వ్రాస్తే బాగుండే అనుకున్నారు. కానీ అప్పటికి “చంద్రశేఖర శతకము”, “శివార్చన” అనే చిన్న గ్రంథాలు తప్ప పెద్ద గ్రంథాలు వ్రాయలేదు. అవి అమ్మ చేతిలో పెట్టారు. ఆ తర్వాతనే “శృంగారలహరి’ ‘అశ్రులహరి, ‘పావకప్రభ’ ‘పొగడపూలు’ మొదలైన గ్రంథాలు వ్రాశారు. ఒక్కొక్క గ్రంథం వ్రాయటానికీ ఒక్కొక్క విశిష్టమైన నేపథ్యం ఉన్నది.

వారు అప్పికట్లలో హైస్కూలులో పనిచేసే రోజులలో అమ్మవద్దకు తరచుగా వచ్చేవారు. అమ్మవద్దనే ఎక్కువ కాలం గడపాలనే తపనతో రాలేకపోతున్నానే బాధతో కళ్ళవెంట నీళ్లు వచ్చేవి. ఆ కన్నీళ్లలో ప్రభవించిన పద్యాలే అశ్రులహరి. అలాగే ఎవరో గుంటూరు నుండి వస్తే ఆ రోజు అమ్మ వారిని ‘సౌందర్యలహరి’ దొరికితే తెచ్చి వీడికివ్వండి అని చెప్పింది. వారు తెచ్చి ఇచ్చారు. అది చదివిం తర్వాత ఇలా వ్రాస్తే బాగుంటుంది అనిపించింది. రోజూ కొన్ని శ్లోకాలు వ్రాసి అమ్మకు వినిపిస్తుండేవారు. ఈ శ్లోకాల అల్లరి చూచి అమ్మ ‘శృంగారలహరి’ అన్నది.

నిజానికి ఆ గ్రంథానికి అమ్మే అలా నామకరణం చేసింది. ఇలాగే మిగతా గ్రంథాలు కూడా. వారు వాల్మీకి రామాయణంలో “శ్రీరామ శీలానుశీలనం” అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ డిగ్రీ తీసుకొన్నారు.

అంతకుముందే యార్లగడ్డ రాఘవయ్యగారు మాటల సందర్భంలో “మీరు అమ్మ సుప్రభాతం వ్రాయవచ్చు గదా” అన్నారు పన్నాలవారితో. ఆ రోజే హరిదాసు గారి పాకలో కూర్చొని కొన్ని శ్లోకాలు వ్రాసి అమ్మ వద్ద చదివితే సుప్రభాతమే కాదు, ప్రపత్తి, మంగళశాసనం కూడా వ్రాయాలంది. అలా వ్రాశారు వాటిని. అలాగే సాయంకాలం చదవటానికి సంధ్యావందనం ఉంటే బాగుంటుంది అన్నది అమ్మ. అదీ వ్రాశారు. ఇలా జిల్లెళ్ళమూడి చరిత్రలో పన్నాలవారికి శాశ్వత స్థానాన్ని సంపాదించి పెట్టే రచనలు చేయించింది అమ్మ, ఒక అన్నమయ్య, ఒక త్యాగయ్యలాగా, నేనందుకే చెప్పాను రాజుబావా, పన్నాలవారూ అమ్మ జీవితంతో శాశ్వతంగా ముడిపడ్డవారు. ఈనాడు కలియుగ వైకుంఠంగా భావించే తిరుపతిని మించి వెలుగులు విరజిమ్మే సమయం జిల్లెళ్ళమూడికి వచ్చే మాట నిజం. ఆనాడు వీరిని లోకమంతా స్మరిస్తుంది.

అమ్మే చెప్పింది పన్నాలవారితో “ప్రతిదానికీ టైముంది. అది వచ్చినప్పుడు అన్నీ అనుకూలంగా ఉంటాయి” అని. అలాగే జిల్లెళ్ళమూడికీ ఒక సమయం వస్తుంది. అప్పుడు చరిత్రలో నిలిచే వారెవరో లోకానికి తెలుస్తుంది. టి.టి.డిలో భాగవత ప్రాజెక్టు చేసినా, పాండిచేరీలో వేరే ప్రాజెక్టు చేసినా, కావ్య కంఠవాసిష్ఠ గణపతిముని ఉమాసహస్రానికి ప్రతిపదార్థ తాత్పర్యాలు వ్రాసినా, అది ‘ఆర్షవిద్యానిధి’గా వారి స్వయం ప్రతిభా ప్రకాశానికి మచ్చుతునకలు. అంతేకాదు. రమణ మహర్షులను గూర్చిన కొన్ని ఆంగ్ల గ్రంథాలను అనువాదం చేశారు. అలాగే స్వామి రామదాసు గ్రంథాలు అనువాదం చేశారు. అయితే అమ్మ చెప్పిన పదాలలో క్లుప్తత ఎక్కువ. సనాతన సంప్రదాయ భావాలకు, ముఖ్యంగా శంకరాచార్యుల అద్వైత భావాలకు దగ్గరగా ఉంటుందనే వారి ఆలోచన. ముప్పై వేల శ్లోకాలు గల “యోగవాసిష్టాన్ని” తెలుగులోకి అనువదించారు.

నిజానికి వారు వ్రాసిన గ్రంథాల మీద సమీక్షను వ్రాయించి ఒక బృహద్గ్రంథాన్ని ప్రత్యేక సంచికగా తేవాలి. వారి పి.హెచ్.డి థీసిస్ను సంస్కృతంలో వ్రాసిన దాన్ని తెలుగులోనికి అనువదించి ప్రచురించాలి. వారి పిల్లలు ఆ పనికి పూనుకుంటే బాగుంటుంది. మన పత్రిక పరిధిలో మనం యీ సంచిక తేగలుగుతున్నాం.

“ఎన్ని కష్టాలు వచ్చినా నీ మీద విశ్వాసం సడలకుండా చూడమని” అమ్మను కోరుకున్నారు. అమ్మ అనుగ్రహించింది. వారు ప్రథమ ప్రధానా చార్యులుగా చేసిన కాలేజి మూడుపూలు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నది. రాష్ట్ర రాష్టేతర ప్రాంతాలలో ఇక్కడ చదివిన పిల్లలు వక్తృత్వ పోటీలలో, వ్యాసరచన పోటీలలో ప్రథమ బహుమతులు పొందుతూ పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టారు కాలేజికి. 

రాధాకృష్ణశర్మగారి సతీమణి శ్రీమతి కాత్యాయనక్కయ్య అందరితో కలిసి మెలిసి పోయేది. అమ్మకు స్నానం చేయించేది. అమ్మ ఎక్కడకు వెళ్ళితే అక్కడకు వెళ్ళి అమ్మకు సన్నిహితంగా సేవాకార్యక్రమాలలో ఉండేది. జిల్లెళ్ళమూడిలో అమ్మ స్నానానికి చెరువు నుండి నీళ్ళు తెచ్చేది. అందరు సోదర సోదరీమణులతో కలిసి సున్నంగానుగకు వెళ్ళేది, కుప్పనూర్పిళ్ళకు వెళ్ళేది, వరినాట్లకు వెళ్ళేది. అమ్మకే కాదు రవి అన్నయ్యకీ సేవలు చేసిన సందర్భాలున్నాయి.

వారి పిల్లలు శైలజ, శేఖర్ లు కూడా జిల్లెళ్ళమూడి సోదరీ సోదరులతో అనుబంధం కలిగినవారే – శ్రీ రాధాకృష్ణశర్మగారి అశీతిజన్మదినోత్సం సమయంలో శ్రీ విశ్వజననీ పరిషత్ ఒక ప్రత్యేక సంచికను ప్రచురించింది. మనం ప్రతిరోజు ప్రతి సభలో పఠించే ప్రార్ధనా శ్లోకం “యయాశక్త్యా బ్రహ్మా” శ్లోకం వారు వ్రాసిందే. జిల్లెళ్ళమూడి చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖింపదగిన వ్యక్తి. శ్రీ రాధాకృష్ణశర్మగారు. 14.4.2020న హైదరాబాద్లో అమ్మలో లీనమైనారు ధన్యాత్ములు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!