అమ్మ చేతి గోరుముద్దలు తినే అదృష్టవంతులు, అనంతరం అమ్మనామంలో పరవశిస్తూ ఆనందాన్ని అనుభవించే అమ్మబిడ్డలు, జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల పూర్వవిద్యార్థులు, (ముఖ్యంగా పార్వతీపురవాసులు మరియు పరిసర ప్రాంతాల విద్యార్థులు) కలిసి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల స్వర్ణోత్సవాల సందర్భంగా, తేదీ 06-08-21న పార్వతీపురంలో అత్యంత వైభవంగా స్వర్ణోత్సవ సభ జరుపుకోవడం జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ సభలో అమ్మతత్వాన్ని సమాజానికి తెలియజేయాలనే తీర్మానంతో పాటు “నీకున్నది తృప్తిగా తిని, యితరులకు ఆదరంగా పెట్టుకో” అన్న అమ్మ సూక్తిని మనస్ఫూర్తిగా పాటించాలనే ఉద్దేశ్యంతో అదే రోజు పార్వతీపురంలోని జిల్లా ఆసుపత్రి ఆవరణలో జిల్లెళ్ళమూడి అమ్మ సేవాసమితి – పార్వతీపురం పేరుతో అమ్మ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించు కోవడం జరిగింది. సుమారు 8 మండలాల నుండి గర్భిణీ స్త్రీలు, రోగులు, వారి సహాయకులు, వైద్యం కోసం రోజూ కొన్ని వందల మంది వస్తుంటారు. వారిలో పేదవారే ఎక్కువ. గిరిజన ప్రాంతాల నుండి వచ్చే రోగులకు, గర్భిణీస్త్రీలకు, పేదలకు కొంతమందికైనా ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో మొదటి 20 మంది పూర్వ విద్యార్థులు (ప్రస్తుత విశ్రాంత ఉపాధ్యాయులందు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నవారు) ఉత్సాహంగా, అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని రోజుకు 50 మందికి ఎలాగైనా ఆకలితీర్చాలనే ప్రయత్నంతో ప్రారంభించడం జరిగింది. ఆశ్చర్యం అద్భుతం ఏమిటంటే – పరమపవిత్రమైన అమ్మ నామంతో – తలపెట్టిన నాటి అమ్మ అన్నప్రసాద వితరణ మహాయజ్ఞం ఇంతింతై వటడింతయై అన్నట్లుగా – 50 నుండి రోజుకి 100 వందమందికి తక్కువ లేకుండా 150-200-300 మందికి కూడా అమ్మ భోజనం అందించేలా కార్యక్రమం కొనసాగుతోంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆగకుండా, నిర్విఘ్నంగా అమ్మ అన్నప్రసాద వితరణ కొనసాగుతూ 13-11-21 నాటికి 100 రోజులు దిగ్విజయంగా పూర్తిచేసుకుంది. 20 మంది సభ్యులతో ప్రారంభమైన పార్వతీపురం అమ్మ కుటుంబం, పూర్వవిద్యార్థులు మరింత మంది కలవడం, పార్వతీపురం స్థానిక ప్రజలు కూడా కలసి రావడం, చేయీ చేయీ కలపడంతో నేడు 60 మంది సభ్యుల కుటుంబంగా మారిపోవడమే గాక, త్వరలోనే 100 మంది సభ్యుల అమ్మకుటుంబం, పార్వతీపురంగా రూపుదిద్దుకోబోతోంది. ఇదంతా అమ్మ మాకు కల్పించిన సదవకాశంగా భావిస్తూ జిల్లెళ్ళమూడి అమ్మసేవాసమితి పార్వతీపురం సభ్యులు, ఒక్క అమ్మ అన్నప్రసాద వితరణతోనే ఆగిపోకుండా, వృద్ధులకు, పేదలకు, విద్యార్థులకు కూడా చేయూతనందించాలనే ప్రయత్నాలు చేస్తూ దానికి కావలసిన ఆర్థిక వనరులు ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్లడం జరుగుతోంది. అదే క్రమంలో తేది. 15-11-2021న పార్వతీపురం పట్టణంలోని అతిపేద వృద్ధులను గుర్తించి, వారి యింటికే స్వయంగా వెళ్లి, దుప్పట్లు పంచిపెట్టడం జరిగింది. ఇంకా ముందు ముందు అనేక సేవాకార్యక్రమాలు చేపట్టాలని, అమ్మ, బాటలో నడవాలని అమ్మబిడ్డల ఆకాంక్ష. అమ్మ శత జయంతి ఉత్సవాల సమయానికి కనీసం పార్వతీపురం చుట్టుప్రక్కల 100 గ్రామాల్లో అమ్మను గురించి చర్చ జరగాలని, అమ్మ ప్రేమ సందేశాన్ని చేరవేయాలని, మా ప్రయత్నం. ఈ సందర్భంగా విశ్వజనని జిల్లెళ్ళమూడి అమ్మను మనస్ఫూర్తిగా కోరుతున్న కోరిక అమ్మ అన్నప్రసాద వితరణలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొంటూ, అన్నివేళలా సహాయసహకారాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరినీ ఆశీర్వదించమని, ఆయురారోగ్యాలు ప్రసాదించమని, చల్లగా కాపాడమని.
ఈ సదవకాశాన్ని కల్పించిన అమ్మ పాదపద్మాలకు మరోసారి శతసహస్రకోటి వందనాలు సమర్పించు కుంటూ నిరంతరం అమ్మ అన్నప్రసాదవితరణను కొనసాగించే శక్తియుక్తులు ప్రసాదించమని వేడు కుంటున్నాను.