మాతృశ్రీ సంస్కృత కళాశాల అభివృద్ధికి విశేషమైన కృషి చేసినవారిలో శ్రీ బొడ్డుపల్లి సీతారామ స్వామి శాస్త్రిగారొకరు. వీరు కళాశాల ప్రథమ ప్రిన్సిపాల్ అయిన శ్రీ పన్నాల రాధాకృష్ణశర్మగారికి బావగారు. శ్రీ సీతారామస్వామిగారు, శ్రీరాధాకృష్ణశర్మ గారు కూడా జిల్లెళ్ళమూడి అమ్మవద్దకు రావటానికి కారకురాలు శ్రీమతి బొడ్డుపల్లి హనుమాయమ్మగారు, బుల్లెమ్మ అని పిలిచేవారు ఆమెను. ఆమె రాధాకృష్ణశర్మగారికి అక్కగారూ, ‘సీతారామస్వామిగారికి వదినగారు. రాధాకృష్ణశర్మగారూ, సీతారామస్వామిగారు కృష్ణార్జునుల వలె సంస్కృత కళాశాల నిర్వహణకై తిరుగుతుండేవారు.
సీతారామస్వామి గారు 1971లో మాతృశ్రీ ఓరియంటల్ కాలేజి స్థాపనకు కృషి చేశారు. అమ్మ వారి యెడల ఎంతో ప్రేమతో ఉండేది. కాలేజీ పాఠశాలల కార్యదర్శిగా చిరకాలం పనిచేసి శ్రీ అధరాపురపు శేషగిరిరావుగారు చూపిన మార్గంలో కళాశాలను చక్కదిద్దారు. కళాశాల, పాఠశాలల ఉపాధ్యాయులకు, గ్రాంటు సమయానికి రాక ఆలస్యమై బాధపడుతున్న రోజులలో వారే అడ్వాన్సు చేసి సహాయపడుతుండేవారు. కళాశాల స్థాపనలోనే కాక పాఠశాల స్థాపించటానికి కూడా ఆర్థికంగా సహాయపడ్డారు.
సాధుస్వభావుడు, ఆధ్యాత్మిక సంపన్నుడు అయిన సీతారామస్వామిశాస్త్రి గారు జిల్లెళ్ళమూడి కార్యక్రమాలలో స్వర్ణోత్సవాలలో సైతం ఎంతో కృషి చేశారు. ధాన్యం పోగు చేయడమేగాక లక్షమందికి భోజనం ఏర్పాటు చేసే కార్యక్రమానికి ముందు జిల్లెళ్ళమూడికి తరలించబడ్డ పొలాలలోని డేరాల వద్ద బియ్యం బస్తాలన్నింటికి శాస్త్రిగారే కాపలాదారు. అక్కడే రాత్రిళ్ళు సైతం పడుకుని బాధ్యతలను అత్యంత శ్రద్ధాభక్తులతో చేశారు. ఒక జిల్లెళ్ళమూడిలోనే కాక ఎక్కడ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలున్నా ముందుండే వారు. 1960 నుండి 1992 దాకా బాపట్లలోని అనుభవానందస్వామి వారిచే నిర్వహింపబడే రామకృష్ణభక్తసమాజమునకు మేనేజరుగా, కార్యదర్శిగా అకుంఠిత సేవలు అందించారు.
స్వగ్రామమైన కర్లపాలెంలో శ్రీ గంగా గౌరీ సమేత కేదారేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేసి ప్రతిసంవత్సరం వసంత నవరాత్రులు, దేవీనవరాత్రులు చాల కాలం నిర్వహించిన వరమభాగవతోత్తములు. ఏకాదశీవ్రతానుష్ఠానపరులు. పెద్దల యెడ విధేయత, సమవయస్కుల యెడ సౌభ్రాతృత్వము, పిన్నల యెడ అనురాగము, ఆప్యాయత సీతారామస్వామిశాస్త్రి గారి సహజ లక్షణాలు.
అటు స్వగ్రామంలో ఇటు బాపట్లలోనే కాక జిల్లెళ్ళమూడిలోని ప్రతి కార్యక్రమానికి హాజరవుతూ సేవచేస్తుండేవారు. 1992 ఆశ్వయుజ బహుళ ఏకాదశీ వ్రతం జరిపి ద్వాదశి పారణం కావించి ఆప్తులను దుఃఖ జలధిలో ముంచి అమ్మలో ఐక్యమైనారు. శాస్త్రిగారు భేషజం లేని, పటాటోపం చూపని కర్మయోగిగా జీవించిన ధన్యజీవి.