1. Home
  2. Articles
  3. Viswajanani
  4. సంపాదకీయము.. (అందరికీ సమానమైన ఆనందాన్నిచ్చేదే పండుగ)

సంపాదకీయము.. (అందరికీ సమానమైన ఆనందాన్నిచ్చేదే పండుగ)

P S R Anjaneya Prasad
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 21
Month : April
Issue Number : 9
Year : 2021

అమ్మతో చిదంబరరావు తాతగారు ఈరోజు నరక చతుర్దశి తలంటి పోసుకోమ్మా! అన్నారు. పండుగ అంటే ఏమిటో చెప్పి పండుగ ఉద్దేశ్యమేమిటో చెప్పి తలంటి పొయ్యండి అన్నది. పండుగంటే వేడుక. పండుగనాడు తల మురికి, శరీరం మురికి వదిలించుకొని క్రొత్త గుడ్డలు కట్టుకొని ఉన్నంతలో పిండివంటలతో తృప్తిగా భోజనం చేయటం. అందరికీ సమానంగా ఆనందాన్నిచ్చేదే పండుగ అన్నారు. సరే పండుగ అర్థం చెప్పారు. ఈ పండుగ ఉద్దేశం చెప్పండి అన్నది. కృష్ణపరమాత్మ దుర్మార్గుడైన రాక్షసుని వధించిన రోజమ్మా! అన్నారు. కృష్ణుడు పరమాత్మ అన్నారు గదా! పరమాత్మకు కూడా దుర్మార్గులున్నారా? అన్నీ అందరూ ఆయనలోనుండి వచ్చినవే కదా! ఇప్పటిదాకా వచ్చిన అవతారాలలో ద్వంద్వం లేనివారున్నారా? ఒకరిని చంపినా పదిమంది ప్రాణాలు రక్షింపబడ్డవనేగా? అన్నది. కృష్ణుడు చంపితే వాడికి జన్మరాహిత్యమైంది. నీకు తెలియందేముందమ్మా! అన్నారు తాతగారు. నాకు తెలియంది లేదని మీకు తెలిసింది కదా! అని అమ్మ అంటే – సరేలేమ్మా! తొందరగా తలంటుకో అన్నారు తాతగారు. ఆముదం అంటుకొనే వచ్చాను తాతగారూ! ఆముదమంటే చమురు. చమురు జిడ్డుకలది. ఆ జిడ్డే సంస్కారం. సంస్కారాలకు ఆస్కారమైనా ఆ భగవంతుడు సంస్కారాన్నే పెట్టుకురావాలి. సంకల్పరహితుడూ; సంకల్పసహితుడూ కాకపోతే వాడిది సంకల్పరహితమైన సంకల్పం అంటూ తలంటి పోసుకున్నది.

అమ్మ జన్మదినోత్సవం చైత్ర శుద్ధ ఏకాదశి. పుట్టినప్పుడు ఏలా ఉన్నానో ఇప్పుడూ ఎప్పుడూ అ లాగే ఉన్నానన్నది. శరీరంలో మార్పురావచ్చు గాని స్థితిలో మార్పు లేదు. పుట్టినప్పుడు ఎంతమందిని తరింపచేసిందో ఎప్పుడూ అందరినీ అ లా తరింప చేస్తూనే ఉన్నది. తన లీలా విశేషాలతో సృష్టిని సమ్మోహ పరుస్తూనే ఉన్నది. శ్రీరాముడు, శ్రీకృష్ణుని జన్మదినోత్సవాలు లోకం ఎందుకు చేసుకుంటున్నారో అమ్మ జన్మదినోత్సవం అందుకే జేసుకుంటున్నాం. కాకపోతే ఆ అవతారాలన్నీ దుష్ట శిక్షణ – శిష్ట రక్షణ చేసినట్లుగా కనిపిస్తున్నది. అమ్మ మాత్రం దుష్టత్వాన్ని మాన్పిస్తాను గాని దుష్టసంహారం లేదన్నది. అసలు తల్లికి తప్పే కనిపించదన్నది. ఇంక దుష్టులు దుష్టశిక్షణ ఎక్కడ నుండి వస్తుంది? పురాణాల అవతారాలలో పురుషావతారాలే కాదు స్త్రీ అవతారాలు కూడా దుష్ట శిక్షణ చేసినట్టే తెలుస్తున్నది. ఒక్క అమ్మ అవతారంలోనే ఈ ప్రత్యేకత కనిపిస్తున్నది. రాగరహిత మైన అమ్మలో రాగసహితమైన సంకల్పంతో మనం అదృష్ట వంతులమైనాం. ద్వంద్వరహితమైన అమ్మలో ద్వంద్వసహితమైన మాతృత్వ మమకారాన్ని జుట్టు కున్నాం.

అయితే దుష్టులు శిక్షింపబడలేదా! అంటే శిక్షింపబడ్డారు. జిల్లెళ్ళమూడి ఆవరణలో భీభత్సం సృష్టించిన అందరూ శిక్షింపబడ్డారు. అయితే శిక్ష కూడా రక్షణే అన్నది అమ్మ. శంకరాచార్యుల వారు “కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా నభవతి” అన్నారు. వారి వాక్కు అమ్మ విషయంలో స్పష్టంగా సరిపోతున్నది.

బాగున్నదండీ! అందరికి సమానమైన ఆనందాన్ని ఇచ్చేదే పండుగ అన్నారు. మరి, ఆనందం అందరికీ సమానంగా ఉంటున్నదా? అని అడుగవచ్చు. ముందర అసలు ఆనందం అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఆనందం వేరు సంతోషం వేరు. శరీరానికి సంబంధించింది సుఖం, భౌతికమైన సంతోషం. ఆనందం మనస్సుకు సంబంధించినది. పారమార్థికమైనది. లోకంలో ఏదైనా తను అనుకున్న దాని కన్నా ఊహించనంత జరిగితే బ్రహ్మానందంగా ఉన్నది అంటారు. అ లాంటివన్నీ ఆనందపు ఛాయలు మాత్రమే. సర్వకాలంలో సర్వులకూ సమానమైన ఆనందాన్నిచ్చేదే నిజమైన ఆనందం. ఎండలో పోయేవాడికి చెట్టునీడ దొరికితే ఆనందం. దాహమైనవాడికి మంచి నీళ్ళు దొరికితే ఆనందం. ఆకలైనవాడికి అన్నం దొరికితే ఆనందం. లక్ష్యం పెట్టుకొన్నవాడికి అది సాధిస్తే ఆనందం. ఈ సాదా ఆనందాలు అనుభవించేవాడు ఈ ఆనందం నాచే అనుభవింప చేస్తున్న భగవంతుడిచ్చినది. వాడిస్తే నేను అనుభవిస్తున్నాను అనుకున్నవాడిది నిజమైన ఆనందం.

ఇలా వాడిచ్చిన ఆనందాన్ని అందరూ తెలిసి సమానంగా పొందుతుంటే అదీ పండుగ. అమ్మ అన్నట్లు పండగంటే ఏమిటి? ఆనాటి విశిష్టత యేమిటి? విశిష్టతను తెలుసుకొని పండుగచేసుకుంటున్నామా? లేక అప్పచ్చులు తింటానికి క్రొత్త బట్టలు కట్టుకోవటానికి చేసుకుంటున్నామా? గమనించాలి. ఒకసారి నేను ఒక పండుగనాడు జిల్లెళ్ళమూడిలో ఈనాడు పండుగ ప్రత్యేకత ఏమి చేస్తున్నా రన్నాను. పండుగంటే ఏముందండీ ఒక కూర అదనంగా చేయటం, ఒక తీపి పదార్థం చేయటమే గదా! అన్నారొక కార్యకర్త. ఓహో ! నిజమే కాబోలు అని మరొకసారి కూరచేయకపోతే ఏమండీ ఈ రోజు కూరలేదే. అన్నాను. పప్పులో దోసకాయవేశాం కదండీ! అన్నాడు. మరొక కార్యకర్త. అమ్మకు కూడ యిలాగే నివేదన పెడుతున్నారా? అన్నాను. ఒక చిరునవ్వు నవ్వాడు. మరొకసారి ఈ రోజు నాన్నగారి ఆరాధనోత్సవం కదా! నాన్నగారి విశిష్టత ఏమన్నా చెపుతున్నారా? అన్నాను. మీరు చెప్పండి; అక్కడ డబ్బు లిచ్చిన వారి పేర్లు ప్రకటిస్తున్నారు కదా! అన్నారు. అది నిజమైన సమాధానం కాదు. ఒక చక్కని ప్రణాళికతో కూడిన వ్యవస్థ కావాలి.

అమ్మ శారీరకంగా ఉన్న రోజులలో ఎవరి పుట్టినరోజు వచ్చినా, ఎవరి కళ్యాణదినోత్సవం వచ్చినా స్వయంగా తలపై చమురు పెట్టి, తలంటి పోయించి, క్రొత్త బట్టలు పెట్టి తీపి పెట్టేది. సంస్కరణ, సంస్కారం ఆరకంగా మనకు నేర్పింది. నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టుకో” అన్నది తాను. అ పెట్టి చూపించి తాను ఆచరించనిది ఏదీ అమ్మ చెప్పలేదు. జిల్లెళ్ళమూడితో మొదలు పెట్టి దేశంలో ఎక్కడా ఆకలితో ఎవరూ ఉండరాదని భావించింది. అమ్మ సంకల్ప బలం వల్ల ఈనాడు దేశంలో ఆకలి చావులు కనిపించటం లేదు. ప్రసిద్ధ దేవాలయాలన్నీ అన్నవితరణ కార్యక్రమాలు చేస్తున్నాయి. పాలకులు కూడా బీద వారి కొరకు చౌకగా అన్నం దొరికే ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకప్పుడు ఈ దేశంలో ఇళ్లకు తలుపులుండేవి కావట. అతిధిని, అభ్యాగతుని భగవంతునితో- సమానంగా పూజించి గౌరవించి ఆదరించేవారు.

అమ్మదృష్టిలో భగవంతుడు కాని వాడే లేడు. అమ్మ మాటలలోని సారాన్ని గ్రహించాలంటే అమ్మ అనుగ్రహం కావాల్సిందే. అందుకే అమ్మ అంటుంది. నేననుకోక పోతే నేను ప్రక్కన పోతున్నా నన్ను గుర్తించలేరని. అడుగడుగునా అమ్మ లీలాలాస్యాలు అనుభవించిన చిదంబర రావుగారు, మరిడమ్మ తాతమ్మే ఒకప్పుడున్న భావం మరొకప్పుడుండటం లేదని బాధపడ్డారు.

ఇప్పుడు మనం అమ్మ జన్మదినోత్సవం చేసుకుంటున్నాం. పండుగంటే అర్థం చేసుకున్నాం, అందరికీ సమానమైన ఆనందాన్ని అమ్మ ఏలా కలిగించిందో తెలుసుకున్నాం. ఆకర్షణీయమైన అమ్మ రూపమే కాక అమ్మ మాటలు అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాం. పదిమందికి యీ ఆనందాన్ని పంచి పెట్టటానికి ప్రయత్నిస్తున్నాం. తోటివాడి కష్టాన్ని చూచి స్పందించటమే ఆదరించటమే, నిజమైన మానవత్వమని తెలుసుకుంటున్నాం. తుఫాసులప్పుడు, వరదలప్పుడు అమ్మ ఎలా స్పందించి ఆదరించిందో, ఎక్కడకు వెళ్ళినా తాడిత, పీడిత, అనాథలను, కుంటి గుడ్డి వారిని ఎలా అక్కున చేర్చుకున్నదో చూచాం. నిజంగా మాతృత్వం యొక్క మాధుర్యాన్ని, అమ్మ వాత్సల్యామృత వర్షాన్ని చవి చూచాం. అ లా కులమత వర్గ వర్ణరహితంగా సర్వులనూ సర్వజీవులనూ ప్రేమించటం చూచాం. అదిగో అందుకు చేసుకుంటున్నాం. అమ్మ పుట్టినరోజు పండుగను.

ఈ రోజు పూర్వ విద్యార్థులు తాము అనుభవించిన వాత్సల్య మాధుర్యాన్ని నేలనాలుగు చెరగులా వెదజల్లటానికి ప్రయత్నిస్తున్నారు. అది నిజమైన పండుగ తాత్పర్యం. ఇంతవరకు ఇలాంటి అవతారం రాలేదు. ఉత్తర దేశంలో పురోహితులను “పండా” లంటారు. మనవైపు బ్రాహ్మణుడు అంటారు. అంటే బ్రహ్మ జ్ఞానం కలిగినవారని అర్థం. వండా అంటే పండిపోయినవాడని అర్థం. దేనిలో వండిపోయిన వాడని? తనను తను తెలిసికోవటంలో. తెలుసుకుంటే ఏమిటి? తను తరించటమే కాక ఇతరులను తరింప చేయగలడు అని. పురోహితుడు అంటే పురమునకు హితము కోరువాడు అని. అ లా పురమునకు హితము కోరిన వారు మన పురాణాలలో ఇద్దరు కనిపిస్తున్నారు. ఒకడు చిరుతొండనంబి. కంచిలోని అందరికీ మోక్షాన్నిమ్మని పరమేశ్వరుని అర్థించి అనుగ్రహాన్ని పొందాడు. కుచేలుడుకు శ్రీకృష్ణుని అర్థించి తన ఊరివారందరికి మోక్షాన్ని కలిగించాడంటారు. అమ్మ మాత్రం అందరికీ సుగతే సన్నది. సృష్టి స్థితి లయకారిణి అయిన అంతి మనందరిని తరింప చేయడంలో ఆశ్చర్యం లేదు కనుకనే అమ్మ జన్మదినం మనందరికీ పండుగ.

సూర్యుడు, చంద్రుడు అందరిమీద సమానంగానే తమకాంతిని ప్రసరింప చేస్తుంటారు. అ లాగే అమ్మ తన మాతృ వాత్సల్యాన్ని సమానంగా చేతన అచేతన సర్వజీవాళి మీద ప్రసరింప చేస్తున్నది. అమ్మ అసలు అచేతనాలు లేవన్నది. అంతా చైతన్యమే. ఈ ఆనంద చైతన్యాన్ని అందరం సమానంగా అందుకోవటమే నిజమైన పండుగ. అమ్మ చిదంబరరావు తాతగారు చెప్పిన తలమురికి, శారీరిక మురికితో పాటు మానసిక మురికిని కూడా వదిలించి నిజమైన పండుగ చేసుకొనే అవకాశాన్ని కల్గించింది. జయహోమాతా!

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!