జిల్లెళ్ళమూడి అమ్మ లక్షలాది మందికి అన్నం పెట్టింది. చాలామందికి తానే కలిపి నోటికి అందించింది ఎవరికి వారు, అమ్మ తమకి మాత్రమే అలాంటి అదృష్టాన్ని ప్రసాదించిందని తృప్తిని సంతోషాన్ని పొందారు.
ప్రాతఃస్మరణీయులు మా గురువుగారు కీ.శే. కొల్లూరు లక్ష్మణమూర్తి శర్మగారు న్యాయమీమాంసా సాహిత్యవిశారదులు. నన్ను తమ ఇంటిలో సభ్యునిగా ఆదరించి విద్యాబుద్ధులు నేర్పిన మాన్యులు. నేను జిల్లెళ్ళబూడిలో ఉపన్యాసకునిగా ఉన్నప్పుడు, తరచు ఆయనను కలసి, ప్రతిసారి వారి దగ్గర అమ్మను గూర్చి ప్రస్తావించి రమ్మని పిలిచేవాడిని.
1980 ప్రాంతంలో ఒకసారి వారు తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో ఉండగా కలిసి, గురువుగారు! మీరు వయస్సులో పెద్దవారు అవుతున్నారు కనుక వెంటనే నాతో వచ్చి, జిల్లెళ్ళమూడి అమ్మను దర్శించండి – అని గట్టిగా వత్తిడి చేసాను. అమ్మ కదిలించిందేమో ! ఆయన ఒంటరిగా నాతో పాటు జిల్లెళ్ళమూడి వచ్చారు.
మాటల మధ్యలో బాలవ్యాకరణానికి “రమణీయం” వ్యాఖ్య వ్రాసిన దువ్వూరు వేంకటరమణశాస్త్రి గారికి, “అమ్మ” స్వయంగా తన చేతితో అన్నం ముద్దలు తినిపించిందని, ఆయనే చెప్పి పరమానందం పొందారని తెలియచేశారు. ఆయన రాకలో నా పిలుపే కాక, చాలా కారణాలున్నాయని అనుభవానికి వచ్చింది.
ఆయన షుమారు ఒక నెలరోజులు జిల్లెళ్ళమూడిలో ఉన్నారు. ఆయన నివాసం ఏర్పడింది. ఆ నెలరోజులు మా ఇంటిలో విడిగా మడిగా భోజనం వండడం వడ్డించడం జరిగింది. ప్రతిరోజు అమ్మను దర్శించడం మాట్లాడడం సాగుతూ వచ్చింది. ఒకరోజు “రేపు ఇక్కడ భోజనం చెయ్యి. నేను మడిగా వండిపెడుతాను. నీకు అభ్యంతరం లేదుగా” అంది మా గురువుగారితో “అమ్మ”. ఆయన పరమానందం పొందారు. మహాప్రసాదం అన్నారు. ప్రణామం చేశారు.
ఆ రోజు గురువుగారు నేను, వాత్సల్యాలయంలోని అమ్మ గదిలోకి వెళ్ళాము. పెద్ద జనం లేరు. అమ్మ పట్టు చీర కట్టుకుంది. గురువుగారు వంగపండు రంగు మడిబట్ట కట్టుకున్నారు. పైన ఉత్తరీయం మాత్రమే ఉంది. “అమ్మ” చిరునవ్వుతో ప్రేమగా పలుకరిస్తూ, కొసరి కొసరి పాయసం పెరుగన్నం వగైరా గురువుగారి నోట్లో పెట్టి తినిపించింది. ఎంతో రసవత్తరంగా సాగుతున్న మహాద్భుత కార్యక్రమానికి నేను సాక్షి మాత్రంగా ఉండిపోయాను. ఎవరి మనసులో ఏముందో ఎవరికీ తెలుసు? అది మరపురాని గొప్ప సన్నివేశం. ఎవరైనా ఒక ఫోటో తీస్తే బాగుండునని పించింది. మా గురువుగారిని, వారి అబ్బాయికి గుంటూరులో అప్పగించగా ఆయన స్వస్థలం చేరుకున్నారు. ఒక నెలరోజులు గడిచాయి ఒక రోజు అమ్మ నన్ను పిలించి రెండు ఫోటోలు నాకిచ్చి మీ గురువుగార్కి పంపించు అన్నది. ఆశ్చర్యం, ఆనందం తట్టుకోలేకోయాను. ఇది ఎలా జరిగింది? అప్పుడు ఫోటో ఎవరూ తీసినట్టు గుర్తు లేదు. నా ఆర్తికి అమ్మ సమాధానమేమో అనిపించింది.
జిల్లెళ్ళమూడి నుండి వెళ్లేటప్పుడు, ఆ తరువాత మా గురువుగారు ఆ అనుభవాన్ని పదే పదే నెమరువేసుకునే వారు. నలుగురితో చెప్పేవారు ఈ అదృష్టం నాదా గురువు గారిదా అందరిదీనా? ఆ తరువాత మా గురుపుత్రులు డాక్టర్ కొల్లూరు అవతారశర్మగారు పలుమార్లు జిల్లెళ్ళమూడి రావడం ప్రసంగించడం మనచే సత్కారాలు పొందడం చాలామందికి తెలుసు. ఆయన మంచివక్తగా, శక్తి ఉపాసకునిగా, శ్రీపీ పత్రిక సంపాదకునిగా, బహుగ్రంధరచయితగా, కాకినాడ వాసులతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ సుపరిచితులు.
1985 జూన్ నెలలో అమ్మ అవతార పరిసమాప్తి సందర్భంగా జరిగిన ఒక సమావేశంలో ప్రసంగిస్తూ నేను “లక్షలమంది సోదరులు అమ్మను దర్శించుకున్నారు. ఎవరి అనుభవాలు వారికున్నాయి. ప్రతి ఒక్కరూ అమ్మ తమపై చూపిన అనుగ్రహం, అద్భుతం ప్రత్యేకం తమకు మాత్రమే కలిగింది” అనుకుంటారు అన్నాను.
అది విని మాన్య సోదరులు శ్రీ ఎమ్. యస్. ఆర్. ఆంజనేయులుగారు అందరి మనస్సులలోను ఇలాగే అన్పిస్తుంది మాష్టారు ! బాగా చెప్పారు అంటూ అభినందించారు.
ముగ్గురు నలుగురు మాత్రమే సభ్యులున్న కుటుంబాలలోనే తల్లిదండ్రులపట్ల స్వంత బిడ్డలకు కూడా ఇలాంటి ఆదరాభిమానాలను నేర్పించలేకపోతున్న సామాన్యులం, అమ్మను చూసి ఆశ్చర్యపడడం నమస్కరించడం తప్ప మరేం చెయ్యగలం?