అమ్మ పాదపద్మాలకు నమస్కారములు. కీ.శే. అధరాపురపు శేషగిరిరావు అన్నయ్యగారికి నమస్కారం.
శ్రీ శేషగిరిరావు అన్నయ్యగారితో మాకు మంచి అనుబంధం ఉంది. 1970 మే నెలలో మా పెద్దబ్బాయి మొదటి పుట్టినరోజు బాపట్లలో జరుపుకోవాలని హైదరాబాదు నుంచి బయలుదేరాము. అప్పుడు పెద్ద తుఫాను వచ్చింది. వర్షం కారణంగా మా ప్రయాణం చాల ఆలస్యం అయింది. ఎలాగో విజయవాడ చేరి, బస్సులో గుంటూరు మీదుగా బాపట్లకు బయలుదేరాము. గాలి, వాన బాగా పెరిగింది. “బుడంపాడు” దగ్గర బస్సు ఆగిపోయింది. తుఫాను ధాటికి రోడ్డు కోసుకుపోయింది. అక్కడ బస్సు దిగి, అటువైపుకి వెళ్ళి, మరోబస్సులో బాపట్ల చేరాలి. మనుషులు ఎగిరిపోతారేమో నన్నంత హోరు గాలి, సామానుతో, పిల్లవాడితో నేను, మా వారు ఆ రోడ్డు దాటి, కొంతదూరం నడిచి, అక్కడ బాపట్ల బస్సు ఎక్క బోతున్నాము.
ఇంతలో శేషగిరిరావు అన్నయ్య కన్పించారు. “ఎక్కడికమ్మా ! వెళ్ళేది ? ఈ తుఫానులో ప్రయాణం వద్దు – మనింటికి వెళదాం రండి. వర్షం తగ్గిన తర్వాత బాపట్ల వెళ్ళవచ్చు” అని, తమ యింటికి తీసుకు వెళ్ళారు. రాత్రి 10 గంటల సమయం అయింది. అప్పుడు ఆ కుటుంబం మా పట్ల చూపిన ఆత్మీయత మేము మరచిపోలేము. వేడి అన్నం, కూర, కందిసున్ని, పచ్చడి, పెరుగుతో మాకు ఎంతో ప్రేమగా భోజనం పెట్టారు. ఆ రాత్రి ఆ యింటిల్లపాదీ మా పట్ల చూపిన వాత్సల్యానికి మాకు కళ్ళు చెమ్మగిల్లాయి.
ఆ మరునాడే మా బాబు పుట్టినరోజు. వర్షం ఉధృతి కొంచెం తగ్గింది. పుట్టినరోజు సంగతి అన్నయ్యకు చెప్పకుండా బాపట్లకు బయలుదేరి వెళ్ళాము.
ఆ తరువాత వారం రోజులకు జిల్లెళ్ళమూడిలో కలుసుకున్నప్పుడు “ఏమ్మా ! ఈ అన్నయ్య ఇంట్లో పిల్లవాడి పుట్టినరోజు జరుపకూడదనుకున్నావా! నా మేనల్లుడి పుట్టిన రోజు నేను చెయ్యకూడదా ? ఎందుకమ్మా ! అట్లాచేశావు?” అని అన్నయ్య అడుగుతుంటే, ఆ ప్రేమకు మా దంపతులకు కన్నీళ్ళు ఆగలేదు. ఇప్పటికీ ఆ సంఘటన తలుచుకుంటే, వారి ఆప్యాయత మదిలో మెదిలి, మా కళ్ళు అశ్రుపూరితమవుతాయి. అమ్మ సన్నిధిలో ఉన్నందుకు అన్నయ్య అంతటి ప్రేమను పుణికి పుచ్చుకున్నారని నేను, మావారు ఎప్పుడూ అనుకుంటూ ఉంటాము. ఆ అన్నయ్య శతజయంతి మహోత్సవం జిల్లెళ్ళమూడిలో జరుగు తున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది.