15-8-58 తేదీన అమ్మ తన అమృత హస్తాలతో అన్నపూర్ణాలయాన్ని స్థాపించింది. అది నేటికి కోట్లాది మందికి అమ్మ ప్రసాదాన్ని అన్నప్రసాదాన్ని అందించింది. ఆ మహిమాన్విత ఆలయ భవనాన్ని బహుళార్ధసాధకంగా పటిష్టంగా మరింత సౌకర్యవంతంగా ఉండేట్లు పునర్నిమించాలని శ్రీ విశ్వజననీ పరిషత్ తీర్మానిసించింది. పనులు ప్రారంభించి వేగవంతంగా నడుపుతోంది. ఈ సంగతి సోదరీ సోదరులందరికీ సువిదితమే.
కాగా లక్షల రూపాలయ వ్యయం అని వేసిన అంచాన నేడు కోట్ల వ్యయంగా పరిణమించింది. వస్తువుల ధరవరలు రోజురోజుకి పెరుగుతూండటం వలన.
ఈ సందర్భంగా మన తక్షణ కర్తవ్యం రెండు విధాలని భావిస్తున్నాం.
- బంధుమిత్రులు, ధార్మిక కార్యానురక్తుల సహాయ సహకారాన్ని పొందటం.
- ఈ బృహత్తర కార్యక్రమం నిర్విఘ్నంగా అనతికాలంలో పూర్తి కావలెనని సర్యార్థదాయిని అమ్మనే వేడుకోవటం. సత్వరకార్యసిద్ధికి అమ్మనామ (మంత్ర) జప / స్తోత్రాలను మండల దీక్షగా చేయటం.
అమ్మ – అంటే – అంతులేనిది, అడ్డులేనిది, అంతా తానైనది’ – అని అమ్మే నిర్వచించింది. కనిపించని దైవాన్ని కనిపించే (కని, పెంచే) – కరుణించే – తరింపజేసే తల్లిగా మనం దర్శించాం; విశ్వసిస్తున్నాం.
కాగా “ఏ పాదాలకి నమస్కరించినా తన పాదాలకే చెందుతాయ”ని అమ్మ స్పష్టంచేసింది, కావున వారి వారి అభిరుచి మేరకు అమ్మ, హైమ, నాన్నగారు, గాయత్రి… (నామ) మంత్ర జపాన్నీ, శ్రీ అంబికా సహస్రనామావళి / శ్రీ లలితాసహస్ర నామావళి… స్తోత్ర పరాయణని… ఇంకా ప్రదక్షిణలు. పూజాదికములను జిల్లెళ్ళమూడిలోను, ఆయా ప్రాంతాల్లోనూ సామూహికం గాను మరియు ఎవరి ఇళ్ళలో వారి వారి హృదయ పూజామందిరాల్లో వ్యక్తిగతంగాను మండల దీక్షగా నిర్వహించాలని శ్రీ విశ్వజననీపరిషత్ పిలుపునిస్తోంది. దీక్షాకాలం – అమ్మ జన్మదినోత్సవం నాడు ప్రారంభించి అమ్మ అనంతోత్సవం వరకు.
ఈ కార్యక్రమ రూపకల్పనలో ఒక ఆసక్తికరమైన సత్యం అంతర్లీనంగ ప్రకాశిస్తోంది. మన చేనులో పండిన పంట, మన పెరట్లో కాసిన కాయగూరలు తింటూంటే కలిగే ఆనందం వర్ణనాతీతం. అలాగే అమ్మ మనది, అందరిల్లు అన్నపూర్ణాలయం మనవి. మన కృషి, తపన ఫలితంగా సుందరభవనం ఏర్పడింది అనే మధురభావన మున్ముందు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. భవనాన్ని శ్రీ విశ్వజననీ పరిషత్ నిర్మిస్తోంది. అని అంటే అమ్మ నిర్మిస్తోంది; అమ్మ విరాడ్రూప అవయవాలైన మనం నిర్మిస్తున్నాం. పదిమంది కోసం, పదిమంది కలిసి ముక్తకంఠంతో అభ్యర్థిస్తే ఆ ఆవేదననే నివేదనగా అమ్మ తప్పక స్వీకరిస్తుంది. అశేష సంతాన మనోవాంఛా ఫలసిద్ధిని అనుగ్రహిస్తుంది. అమ్మ క్షిప్ర ప్రసాదినికదా ! ‘మాతర్భవాని ! మమదేహి కరావలంబమ్’ అని అంజలి ఘటిస్తే తన ఆపన్నహస్తాన్ని తప్పక అందిస్తుంది.