బూదరాజు దుర్గాప్రసాదరావు రామకృష్ణ అన్నయ్య రెండవ మేనల్లుడు. పెద్ద అక్కయ్య వసుమతి గారి రెండవ సంతానం. దుర్గాప్రసాద్ వినయానికి నిలువెత్తు రూపం. NFC, Hyderabad లో ఉద్యోగ విరమణ చేశాడు. తన చిన్ననాటి అనుభవాన్ని ఇలా వివరించాడు.
చిన్ననాటి నుండి దుర్గాప్రసాద్ జిల్లెళ్ళమూడి వస్తూ పోతూ ఉండేవాడు. మామయ్య రామకృష్ణఅన్నయ్య జిల్లెళ్ళమూడిలో ఉన్నాడు కనుక తను వస్తూ ఉండేవాడే కాని పెద్దగా ‘అమ్మ’ మీద నమ్మకం లేదు. అమ్మ మానవతా వాదం మీద గురి ఉంది గాని అమ్మే దేవత అన్న విషయం మీద విశ్వాసం లేదు. దేవత అంటే నాలుగు చేతులు, శిరస్సున కిరీటం, చేతిలో త్రిశూలం, ఉండాలని భావన.
అలాంటి దుర్గాప్రసాద్కు అమ్మదగ్గర ఉపనయనం జరిగింది. అమ్మ మంత్రోపదేశం చేసింది. గాయత్రిమాత అవతారం అమ్మ చేతే ఉపదేశం పొందిన భాగ్యశాలి దుర్గాప్రసాద్. రామకృష్ణ బంధువర్గం మొత్తాన్ని ‘అమ్మ’ అనుగ్రహించింది అనటానికి ఇదీ ఒక ఉదాహరణ.
దుర్గాప్రసాద్ ఉపనయనం పూర్తి అయింది. మరుసటి రోజు తిరిగి హైద్రాబాద్ వెళ్ళాలని అమ్మని దర్శించుకొన్నాడు. ప్రక్కనే ఉన్న రామకృష్ణ అన్నయ్య కుంకం పొట్లాలు ప్రసాదంగా ఇచ్చాడు. అమ్మ దుర్గాప్రసాద్ తో “దుర్గామంత్రం గుర్తున్నదా ? రోజు మంత్రం జపించుకో” అని అన్నది. గుర్తున్నది అని దుర్గాప్రసాద్ తలూపాడు.అమ్మ పదే పదే ఇదే ప్రశ్నవేసింది. దుర్గాప్రసాద్ అన్ని సార్లు తలూపాడు.
దుర్గాప్రసాద్ అమ్మ మరో మాట చెప్పింది “నాన్నా! దుర్గా దేవత అంటే నాలుగు చేతులు, తలపై కిరీటం ఉండాల్సిన అవసరం లేదు. మనుషులలోనే దేవతలున్నారు నాన్నా ! వారిని గుర్తించు” దుర్గాప్రసాద్ మనస్సులోని సందేహాన్ని దుర్గాప్రసాద్ బయటకు చెప్పకుండానే పటాపంచలు చేసింది. ఇది ఒక్క దుర్గాప్రసాద్క కాదు సమస్త మానవాళికి అమ్మ ఇచ్చిన సందేశం “నాన్నా! దుర్గా! మామయ్య కుంకం పొట్లాలు ఇచ్చాడు కదా ! నీకు కడుపులో నొప్పి వస్తే మంచినీళ్ళల్లో ఈ కుంకం కలుపుకొని తాగు. నొప్పి తగ్గుతుంది” అని దుర్గాప్రసాద్కు అమ్మ “అభయం” ఇచ్చింది. దుర్గాప్రసాద్కు ఎలాంటి నొప్పి లేకపోవటంతో నవ్వుకొని సరేనమ్మా అన్నాడు. అమ్మ దగ్గర, రామకృష్ణ అన్నయ్య దగ్గర శెలవు తీసికొని హైద్రాబాద్ చేరాడు.
తెల్లవారి ఆఫీసుకు వెళ్ళటానికి సిద్ధమైనాడు. అంతే విపరీతంగా కడుపునొప్పి వచ్చింది. తట్టుకోలేనంత నొప్పి, మంచినీళ్ళు తాగుదామని బ్యాగ్ లోంచి వాటర్ బాటిల్ తీసికొన్నాడు. ప్రక్కనే కుంకంపొట్లాలు కనిపించినాయి. వెంటనే ‘అమ్మ’ ఇచ్చిన అభయం గుర్తుకు వచ్చింది. కుంకుమ కలిపిన మంచినీళ్ళు తాగాడు. అంతే నొప్పి తగ్గిపోయింది. తనకెలా నొప్పి వస్తుందని అమ్మకెలా తెలుసో అభయ ప్రదాయిని అమ్మకు కాక మరెవరికి తెలుస్తుంది.