మహనీయులను ఎక్కువమంది సమస్యలు పరిష్కారం కోసం మాత్రమే దర్శిస్తారు. మహిమలని ఆశిస్తారు. కానీ, అమ్మలాంటి ప్రేమ మూర్తులు మనకు కనపడేటట్లు మహిమలు చెయ్యకపోవచ్చు. అమ్మ దర్శనమే “ఒక గొప్ప మహిమ” అని ఎంతమంది గుర్తించారు!. ఎన్నో సంవత్సరాలు అమ్మ దర్శన, స్పర్శన సంభాషణా భాగ్యాలు పొందిన వాళ్ళు ఉన్నారు. గుర్తించినా, గుర్తించకపోయినా అమ్మ సన్నిధిలో ఎన్నో మహిమలు జరిగాయి. జరుగుతున్నాయి. అవన్నీ ఎందరికో జ్ఞాపకాల పొరలలో దాగి ఉన్నాయి. అవి వెలికి తీసి అందరికీ అందించడం కూడా అమ్మ పట్ల కృతజ్ఞతార్చనే!. అమ్మ శుష్క వేదాంతం చెప్పలేదు. అనుక్షణం ప్రేమను పంచి, జగత్తే దైవంగా ఎలా చూడాలో నేర్పారు.
ఇది ఒకనాటి మాట. అమ్మ సన్నిధి!. యదా లాపంగా అమ్మ నాతో ఇలా అన్నారు. ” నాన్నా! చిక్కి పోతున్నావు”. అప్పటికి నా ఆరోగ్యం చాలా బావుంది. “అమ్మ ఇలా అంటున్నారేమిటి! గుండులా ఉన్నాను కదా” అని మనసులో అనుకున్నాను. కొద్ది నెలలలో నేను పనిచేస్తున్న తణుకులో నీళ్లు పడక “ఎమీబియాసిస్’ ఒంట్లో ప్రవేశించి, బాగా చిక్కిపోయాను. అమ్మ మాట సత్యస్య సత్యం. అమ్మకి అన్నీ వర్తమానమే!. అమ్మ జరగబోయే దాన్ని చెప్పారని అనుకోవడం కంటే, తల్లిగా జరగబోయేది తెలిసి మాతృహృదయం ఎంతగా స్పందించిందో కదా అని అనిపించింది.
అందరూ తాము పొందిన అనుభవాలు ఇంకా ఎక్కువ ఉత్సాహంతో పంచుకోవడం మొదలుపెడితే, అమ్మ సన్నిధిని ఇంకా బాగా అందరూ అనుభూతి పొందగలరని అనిపిస్తూ ఉంటుంది. ఏమైనా… ఆ తరం వాళ్ళు అదృష్టవంతులు. వాళ్ళ పూర్వ పుణ్యం ఎంత గొప్పదో! అమ్మతో ఉన్నారు! ఆ పుణ్యాత్ములందరికీ మనసా నమస్కరిస్తూ….. జయహో మాతా..