నేను 1975 సంవత్సరంలో మాకు సమీపములో యున్న ఏలూరు టౌనుకి వెళ్ళినప్పుడు కొన్ని సరుకులు కొనడం జరిగినది.ఏ షాపుకు వెళ్ళినా సరుకు కొనడమేతప్ప ఎన్నడూ క్యాలెండరు అడగని నేను అక్కడ ఆనించి ఉన్న క్యాలెండర్ చూచి షాపు యజమానిని క్యాలెండరు యివ్వమని అడుగగా క్యాలెండరు యిచ్చారు. జిల్లెళ్ళమూడి అమ్మ గురించి నాకు ఏమీ తెలియదు. ఆ మాతృమూర్తి ఫోటో చూచి నా మనస్సు ఎంతో సంతృప్తి అనిపించింది. ఎలాగయినా చూడాలి అనుకుని క్యాలెండరు నా భార్యపిల్లలకు చూపించాను. అప్పుడు నేను కరణీకం చేసేవాడిని. మా పిల్లలతో అమ్మాయి శుభశ్రీ, అబ్బాయిలు మురళీ, శ్రీధర్ కు చిన్న వయస్సు. రెండు సంవత్సరాల తర్వాత అమ్మ దయవలన నాకుటుంబ సభ్యులతో జిల్లెళ్ళమూడి వెళ్ళి అమ్మను దర్శనం చేసుకోగలిగాను. మేము అమ్మను చూచిన కొద్దీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉన్నది. అమ్మను ఎన్నటికీ మరువలేను. ప్రతిసంవత్సరం అమ్మ దర్శనం చేసుకొనేవాడిని. అమ్మ దయవలన అమ్మాయి పెళ్ళి. అబ్బాయిల పెళ్ళిళ్ళు జరిగినవి. మేము ఆనందముగా ఉన్న ఆ సమయంలో కాలం ఎప్పుడూ ఒకేరీతిగా ఉండదన్నట్లు ప్రభుత్వం 1984 జనవరి 6న మా జీవనాధారము అయిన కరణీకాన్ని రద్దు చేసి మమ్మల్ని వీధిపాలు చేసింది. ఎంత ప్రయత్నం చేసినా తిరిగి ఉద్యోగాన్ని సంపాదించలేని నేను అమ్మను నా ఉద్యోగం నాకు యిప్పించమని ప్రార్థించాను. అమ్మ సంకల్పం మనకు తెలియదు గదా ! అమ్మ మీద కోపం వచ్చింది. ఎందుకు యిలా చేసింది అని రెండు సంవత్సరాలు జిల్లెళ్ళమూడి వెళ్ళలేదు. అయితే అమ్మ ఊరుకోలేదు. నాతో పోలాసిగూడెం అనే చిన్న గ్రామంలో మాతృశ్రీ ప్రైవేట్ పాఠశాల 1984 డిసెంబరు 6న ప్రారంభిచేటట్లు చేసి అచ్చటనుంచి రంగాపురం, నర్సన్నపాలెం గ్రామాలలో ప్రైవేటు ఉపాధ్యాయునిగా 25 సంవత్సరాల సర్వీసు ప్రసాదించింది.
2010లో మా పెద్దబాబు మురళీకృష్ణకు, 2009లో మా చిన్నబ్బాయి శ్రీధర్కు అనారోగ్యం చేసిన సమయాలలో మేము పడ్డ మానసిక వ్యధ నుండి అమ్మ అనుగ్రహంతో బయటపడ్డాము. కానీ 2002లో పరమభక్తురాలు యోగ్యురాలు అయిన డూ కుమార్తె శుభశ్రీ అకాలమరణం మా మనస్సుకు పెద్దగాయం చేసింది.
కాలస్వరూపిణి అయిన అమ్మ చూపించిన ప్రేమ ఇచ్చిన ధైర్యము మమ్ములను ఈ మాత్రంగా నైనా నిలబెట్టిందని ఎప్పుడూ అనుకుంటుంటాము.