అమ్మ అత్తగారు వాళ్లు మా నాన్నగారు వాళ్లు అమ్మ చిన్నప్పుడు రైల్వేస్టేషన్ దగ్గర చంద్రమౌళి చిదంబరరావు తాతగారింట్లో పక్క పక్క భాగాలలో ఉండేవారుట. అమ్మ చిన్నప్పుడు తల్లి చనిపోయి దిగులుగా ఉంటే మా నాన్నగారు, మా పెదనాన్నగారు వాళ్ళంతా ఎత్తుకొని ఆడిస్తూ ఉండేవాళ్లట. అమ్మ కొంచెం పెద్దదైనాక అన్నవరపు వారి స్కూల్లో, మా పెదనాన్నగారి కూతుళ్ళతో పాటు స్కూలుకు వెళ్లుతూ ఉండేది. ఆ పరిచయం మీద నేను జిల్లెళ్ళమూడి వెళ్ళినప్పుడు అమ్మ మా పెదనాన్నగారి కూతుళ్లను గురించి మంగమ్మ ఎలా ఉంది ? కామేశ్వరి ఎలా ఉంది ? వాళ్లు ఎక్కడ ఉన్నారు ? అని అడుగుతూ ఉండేది. వాళ్ళు ఎలా తెలుసునని మా నాన్నగార్ని అడిగితే మా నాన్నగారు ఈ సంగతులన్నీ చెప్పేవారు.
ఇక అమ్మతో నా అనుభవాలు : నేను 4,5 సార్లు జిల్లెళ్ళమూడి వెళ్లాను. అమ్మ ఉండగానే, నేను వెళ్ళినప్పుడు అమ్మ నన్ను తన దగ్గరే కూచోపెట్టుకొని కాఫీ తెప్పించి ఇచ్చేది. కబుర్లన్నీ అడిగేది, పాటలు పాడించుకునేది, అన్నం కూడా కంచంలో పెట్టి తెమ్మని అన్నపూర్ణాలయంలోకి ఎక్కువైంది. కాకుండా లోపల్నించి తెప్పించి తన దగ్గరే కూచో పెట్టి తినమనేది. నేను అక్కడ ఉన్నప్పుడు ఆమెకు ఎవరైనా పూలదండ వేస్తే ఆ దండ తన మెడలోంచి తీసి నాకు ఇచ్చేది.
ఒకసారి నా కాలుకి ఆపరేషన్ అయినాక ఎన్ని రోజులైనా ఆ పుండు మానక రోజూ బ్లెడ్ అదీ వచ్చేది. మా బంధువులు ఎవరో కారులో జిల్లెళ్ళమూడి వెళుతుంటే మా అమ్మ నన్ను కూడా వాళ్లతో పంపింది. నీ కాలు సంగతి అమ్మకి చెప్పు అని. నాకు భయం వేసి నేను అమ్మతో చెప్పలేదు. కాని అమ్మే నన్ను తన పక్కలో కూచోపెట్టుకొని నా తొడమీద చెయ్యిపెట్టి రాస్తూనే ఉంది. నన్ను ఆరోజుకి అక్కడే ఉండమని మరీ మరీ చెప్పింది. కాని నా కాలు నొప్పితో అక్కడ ఉండలేక వచ్చేశాను. అంతకుముందు 150 పెన్సిలిన్ ఇంజక్షన్లు ఇచ్చినా తగ్గని పుండు జిల్లెళ్ళమూడి వెళ్లి వచ్చిన తర్వాత మళ్లీ బ్లెడ్ రాలేదు. పుండు త్వరలో మానిపోయింది. నేను నా పుండు సంగతి అమ్మకు చెప్పనేలేదు. మరి అమ్మకు ఎలా తెలిసిందో నాకు అక్కడ పుండు ఉందని దాని మీద చెయ్యిపెట్టి నిమరటం వల్ల ఆ పుండు తగ్గినా నాకు చాలా ఆశ్చర్యం కలిగింది.
మరి ఒక సంఘటన : ఒకసారి అమ్మ పుట్టినరోజున నన్ను వీణ తీసుకొని రమ్మని బాపట్ల నుండి వెళ్ళే ఒక ఇంజనీరు గారి భార్యకు చెప్పినదట. ఇంకా ఆమెతో అనసూయా ఇదివరకు ఇక్కడ కాలుజారిపడినది. జాగ్రత్తగా తీసుకొని రమ్మని అమ్మ మరీ మరీ చెప్పినదని ఇంజనీరుగారి భార్య చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. నే పడిన సంగతి నాకే జ్ఞాపకం లేదు. రోజుకి వందలమందికి దర్శనం ఇచ్చే అమ్మకి ఈ సంగతి ఎలా జ్ఞాపకం ఉందా అని చాలా ఆశ్చర్యం కలిగినది.
అమ్మ ఇష్టప్రకారం అమ్మ పుట్టినరోజుకి వీణ తీసుకొని వెళ్లాను. అమ్మ తన కుర్చీ పక్కనే నన్ను కూచో పెట్టుకొని అన్నీ అమ్మవారి మీద కృతులనే వాయించమని చెప్పింది.
అందరూ అమ్మ మీద పసుపు, కుంకుమ, పూలు చల్లుతూ ఉంటే అవన్నీ నా మీద కూడ పడి నేకట్టుకున్న తెల్ల చీరె అంతా పసుపు, కుంకుమలతో నిండిపోయింది. చిన్నతనం వల్ల చీరెంతా పాడై పోతుందనీ భయంతో చీర అంతా దులుపుకుంటూ ఉంటే “అమ్మ” ఫరవాలేదు లేరా నా పేరు, నీ పేరు ఒకటే కదా ? నా మీద పడితే ఏం? నీ మీద పడితే ఏం అంది. అప్పటి నుండి అమ్మ మీద భక్తి భావం ఎక్కువైంది.
మరొకసారి నేను మళ్ళీ జిల్లెళ్ళమూడి వెళ్లినపుడు అమ్మ మేడ మీద ఉంటోంది. ఎట్లాగో కష్టపడి మెట్లన్నీ ఎక్కి వరండాలో నుంచున్నాను. అప్పటికి అమ్మ ఇంకా దర్శనం ఇవ్వటం మొదలు పెట్టలేదు. నా కాలికి పైదాకా ఇనుపరాడ్స్లో తయారు చేసిన (కాలీబార్) బూటు వేసుకొన్నాను. అవన్నీ ఇప్పితే అసల నడవలేనని దానితోనే పిట్టగోడని అనుకొని నుంచునే ఉన్నాను.
ఇంతలో ఒకాయన ఎవరో వచ్చి బూటు కాలితో లోపలికి వెళ్లకూడదని మరీ మరీ గట్టిగా హెచ్చరించి, నేనెక్కడ లోపలికి వెళతానో అని ఆయన అక్కడే తిరుగుతూ ఉన్నాడు. ఇంతలో అమ్మ తనకు అమర్చిన కుర్చీలో వచ్చి కూచుంది. నేను మాత్రం అమ్మకి ఎదురుగుండా వరండాలోనే నుంచుని ఉన్నాను. అమ్మ ప్రతిసారి నా వంక చూచి ఎందుకు అక్కడే నుంచున్నావు? లోపలికి రా అని పిలుస్తునే ఉంది. ఆయనెవరో అక్కడే ఉన్నారని నేను వెళ్లలేదు. అమ్మ ఎవర్నో పంపి దాన్ని లోపలికి తీసుకుని రమ్మని పంపింది. అమ్మ మాట ప్రకారం ఆమె నన్ను లోపలికి తీసుకొని వెళ్లింది. నన్ను అడ్డగించి నాయన నాకు మళ్లీ ఆ ప్రాంతంలో కనపడలేదు. అది అమ్మ నా పట్ల చూపించిన అభిమానం, అనురాగం. ఇలాంటి సంఘటనలెన్నో మనసులో మెదులుతూనే ఉంటాయి.