మా గ్రామంలో అమ్మ సత్సంగం కేవలం ఒక గంటే. అందులో అనసూయా మంత్రము 20 నిమిషాలు, హైమమంత్రం 10 నిమిషాలు. ఒక్కొక్కరు 10 సార్లు చెప్పాలి. అందరూ పలకాలి. ఇలా అందరూ చెప్పేవారే! అందరూ పలికేవారే! ప్రతివారి ఇన్వాల్వెమెంట్ వుంది !
ఒకరు – నా జబ్బు నయమైంది. వర్షం పడితే శనగ విత్తనం వేసి, జిల్లెళ్ళమూడికి వెళ్ళాలను కోవడం, 2, `3 రోజులలో వర్షం పడడం, శనగ విత్తనం వేయడం, జిల్లెళ్ళమూడి దారిపట్టటటం, అంతా 2 నెలల్లోనే. పంటరాగానే 2 బస్తాలు (200 కేజీలు) శనగలు పంపడమే కాదు. తాము అమ్మ చెంతకు వెళ్ళినపుడు సేవించుకోవడం, పూజించుకోవడం, అక్కడ వేల రూపాయిలు అన్న వితరణకు అర్పించడం, ఇప్పుడు వారికి అమ్మ మరువరాని కులదేవతగా మారడం – ఇదంతా 10 నిమిషాల భాషణము, 2 చిన్న ఫోటోలు, 2 కుంకుమపొట్లాలు – వారికి అమ్మ దయ అపారంగా వుంది గాబట్టి, అయాచితంగా కరుణారసపు జల్లులు కురిపించిందేగాని, నా ప్రయత్నం ఏమీ లేదు. వారి నమ్మకం, వారి ఆరాధనము మాత్రమే.
మొన్నకు మొన్న హైదరాబాద్లో మా గ్రామస్తురాలు హైదరాబాద్ లో మా యింటికి వచ్చి, “స్వామి మేము అమ్మ దగ్గరకు మా వారందరితో సహా వెళ్ళినాము. అబ్బా! రాఘవయ్య ఎంతమూలలో ఉన్న అమ్మను పట్టినాదో అనుకున్నాము; పూజించుకున్నాము; నీ పేరు చెప్పినాము; మాకు గది, అన్నీ యిచ్చారు” అన్నారు. దానికి నేను ‘లేదమ్మా ఎవ్వరు వెళ్ళిన వసతి గది యిస్తారు. భోజనం పెడ్తారు. అమ్మను సేవించుకోమంటారు, ఎలాంటి ఆంక్షలు వుండవు, కానీ మీకు ఎలా తెల్సింది అమ్మ జిల్లెళ్ళమూడిలో వుందని అడిగాను. ‘నీవేగదా స్వామీ ! తొగర్చేడులో 2, 3 సంవత్సరాల క్రిందట అమ్మ ఫోటోలు, అమ్మ కుంకుమ ఇచ్చి, అమ్మ కధ చెప్పావు, నా పిల్ల (కూతురు) ఇంటర్ ప్యాసై ఇంజనీరింగ్ సీటు వచ్చింది. అందరము జిల్లెళ్ళమూడికి వెళ్ళి వచ్చాము” అని నా భార్య సత్యమ్మకు అనారోగ్యంగా వుందని, చూడనువచ్చి, ఈ కథ చెప్పారు. అంటే వారి మనస్సులో అమ్మ 2, 3 సంవత్సరాల నుండి ఉంది, స్థిరంగా వుంది. తిష్ట వేసుకొని, పాదుకొని పోయి వుండబట్టే వాళ్ళనాడు జిల్లెళ్ళమూడికి వెళ్ళి, చాల ఆనందంతో తిరిగి వచ్చి, మాకు చెప్తూ వుంటే, ‘అమ్మ నీవు ఎంత స్థిరస్థితిని వారిలో కలిగించావమ్మా! వారి విశ్వాసం చెదరక స్థిరచిత్తం కలిగించి, గట్టి పునాది వేశావు కదమ్మా నీకు శతకోటి నమస్కారాలు. నాలోను నీపై భక్తి భావము సడలనీక, నీలో ఐక్యం చేసుకో తల్లీ” అని ప్రార్ధించటం ఒక్కటేనాకు శరణ్యం!
కానీ మనం చేసే పని మనం చేస్తే, ఆమె చూసుకుంటుంది, చేసుకుంటూపోతుంది. చిరు దివ్వె దేదీప్యమానమైన మహాకాంతిపుంజం కాగలదు.