అవతారమూర్తి అమ్మ అందరినీ తన బిడ్డలుగా చూడటంలో ఆంతర్యం “మనమందరం ఒక తల్లిబిడ్డలమే” అన్న భావం పాదుకొల్పడమే కదా ! అది మనం అర్థం చేసుకుని ఆచరించగలిగితే – ఆభావం మన రక్తగతమైతే – అప్పుడు మనందరం అమ్మకు నిజమైన వారసులు మవుతాం. అప్పుడు ఈ లోకం నాకమే కాదూ ? రామకృష్ణ అన్నయ్య.
ఆది పరాశక్తి ‘అమ్మ’ సంధించిన అస్త్రం ఏమిటి? అది తప్పకుండా ‘విశ్వకుటుంబ భావన’యే.
అమ్మాస్త్రం బ్రహ్మాస్త్రం కన్న మిన్న.
ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు వివరిస్తాను. మాతమ్ముడి కొడుకుకు జ్వరం తీవ్రంగా ఉండటంతో విజయవాడలో ఒక ప్రముఖ ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయించాము. డాక్టర్స్ చికిత్స రోజులతరబడి చేస్తున్నా పిల్లవాడిలో సుగుణం కనబడకపోవటంతో మేమందరం చాలా ఆందోళనగా ఉన్నాము. ఆస్పత్రి ప్రముఖమైనది కావటంతో జబ్బు వివరాలు మాదాకారావటం లేదు. వివరాలన్నీ తెలిస్తే కాస్త ఉపశమనంగా ఉంటుందన్న భావనకు వచ్చాము. వివరాలు ఎలా తెలుస్తాయి? ఆసుపత్రివారు మమ్మల్ని లక్ష్యపెట్టటం లేదు. మెడికల్ టెర్మినాలజీ మీకేం తెలుస్తుంది ? అని దబాయిస్తున్నారు. కాబట్టి ఎవరైనా మెడికల్ ఫీల్డులోని వ్యక్తి హాస్పిటల్కు వస్తే వివరాలు తెలుస్తాయి అని మా ఆలోచన. అలాంటి వ్యక్తి మాబంధువర్గంలో ఉంటే వారికోసం కబురుచేసి ఎదురుచూస్తున్నాం. అయితే అది కార్యరూపం దాల్చటం లేదు. ఈ లోపు మా ఆందోళన అధికం అవుతున్నది. దీని కారణంగానే మా మరో తమ్ముడు ప్రేమకుమార్కు రక్తపోటు పెరిగి చూపించుకోవటానికి జిల్లెళ్ళమూడి లోని మాతృశ్రీ . మెడికల్ సెంటర్కు వెళ్ళాడు. అక్కడ ‘మతకుమల్లిరాముడు’ వాడి రక్తపోటు చూస్తూ దానికి కారణం ఆరా తీశాడు. వీడు మా తమ్ముడి కొడుకు అనారోగ్యం విషయం ప్రస్తావించాడు. ఆ వివరాలు అన్నీ విన్న వెంటనే ‘రాముడు’ మా తమ్ముడి కొడుకు ఉన్న ఆస్పత్రి దగ్గరే వాళ్ళ వాళ్ళకు ‘లాబ్’ ఉన్నదని వాళ్ళతో మాట్లాడి డాక్టర్ గారితో మాట్లాడిస్తానని చెప్పాడు. చెప్పటమే కాదు వెంటనే కార్యరూపం ఇచ్చాడు. వాళ్ళు వెంటనే డాక్టర్గారితో మాట్లాడి ఆ విషయాలు రాముడికి చేరవేశారు. రాముడు వెంటనే ఆవివరాలు మా తమ్ముడికి, వాడు వెంటనే మాకు ఆ విషయాలు చేరవేశాడు. అవి విన్న తరువాత మాకు కొండంత ధైర్యం వచ్చింది. అది డెంగీజ్వరం అని, అయినా భయపడవల్సిన అవసరం లేదని జబ్బు తగ్గుముఖం పట్టిందని డాక్టరు చెప్పాడని తెలిసి ఊపిరి పీల్చుకున్నాము. డాక్టర్ గారు కూడా ఆ తరువాత మరింత శ్రద్ధగా చికిత్స చేశారు. ఈ వ్యవహారంలో ‘రాముడు’ ప్రవర్తించిన తీరు బహుధా ప్రశంసనీయం. ‘మనమంతా ఒకటే’ అన్నట్లుగా వాడు ప్రవర్తించిన తీరుకు ముగ్ధులమైనాము. దీనికి మూలం అమ్మ కల్గించిన “విశ్వకుటుంబభావన”యే కదా ! ఇలాంటిదే మరో సంఘటన. ఒకరోజు మేము హాస్పిటల్కు వెళ్ళేసరికి మా తమ్ముడి మరో కొడుకు అంటే patient తమ్ముడు, మా మరదలు మహాసంతోషంగా ఉన్నారు. ఎందుకూ? ఏమిటి ? అని విచారిస్తే మా మరదలు చెప్పింది.
“అక్కయ్యా ! ఈ రోజు పెద్ద విశేషం జరిగింది. మిత్రా (తమ్ముడి రెండవ కొడుకు) ఆస్పత్రిలో దేని కోసమో వెళ్తుంటే ఒక పెద్దవయస్సు ఆవిడ వాడిని దగ్గరకు పిలిచి “నాన్నా! మీ అన్నయ్యకు తప్పకుండా తగ్గిపోతుంది. తగ్గిన వెంటనే జిల్లెళ్ళమూడి వెళ్ళి హైమక్కయ్యకు పూజ చేసుకోండి అని చెప్పింది. ఆ క్షణం నుండి పెద్దవాడికి జబ్బు తగ్గుముఖం పట్టింది. ఆ చెప్పిన ఆవిడ తప్పకుండా ‘అమ్మే’. అమ్మే ఈ రూపంలో వచ్చి చెప్పింది ఇదీ ! మా సంతోషానికి కారణం”.
జరిగిన దానికి, జబ్బు తగ్గు ముఖం పట్టిన దానికి మా ఆవిడ కూడా బాగా సంతోషించి ఆ చెప్పిన ఆవిడ” గురించి ఇలా చెప్పింది.
ఆమె డాక్టర్ గారింట్లో వంట చేస్తుంది. గతంలో ‘అమ్మ! ను సేవించింది. ఆమెకు జిల్లెళ్ళమూడి రామకృష్ణ అన్నయ్య మనవడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు అని తెలిసింది. అంతే అందరింటి విశ్వకుటుంబ భావన ఆమెలో ప్రదీప్తమయింది. ఆమె ఇంటి నుండి ఆస్పత్రిలోకి వచ్చి అక్కడ ఉన్న నర్సులు, కాంపౌండెన్సీతో మాట్లాడి “మా అబ్బాయి, మా అన్నయ్య మనవడు ఇక్కడ చికిత్స పొందుతున్నాడు. అతనిని జాగ్రత్తగా చూడండి” అని వారిని ప్రాధేయపడి మరలా ఇంట్లోకి వెళ్ళిపోతూ చిన్నవాడితో అలా మాట్లాడింది. నిజంగా ఎంత అద్భుతంగా ఉందీ సంఘటన. ఇది అమ్మ కల్గించిన ‘విశ్వకుటుంబ భావన’కు సాక్షీభూతమే కదా !