అమ్మను అమ్మేననే నిశ్చితాభిప్రాయానికి నేనెందుకు వచ్చానో చెప్పాలి కదా !
నా చిన్నతనంలో దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణపరమ హంసగారు ప్రతి నిత్యం పూజించుకునే కాళీమాతను నేను దర్శించుకున్నాను. అమ్మ వారిని జగత్తారిణి అనేవారు. విగ్రహంలోని విచిత్రం ఏమంటే నాలుక చాలా క్రిందికి జారిపడుతున్నట్లుంటుంది. అమ్మవారు కరుణామూర్తి కదా, అలా ఎందుకుంటుంది? విగ్రహాన్ని చెక్కి శిల్పి తన బుద్ధికి తోచినట్లు నిర్మించియుండవచ్చును. అని సరిపెట్టు కున్నాను. మనస్సులో ఆ రూపం నిల్చిపోయింది. ఎవ్వరితోను ఎన్నడూ ఈ విషయాన్ని ప్రస్తావించలేదు.
కాలక్రమాన నాకు శ్రీశాంతి ఆశ్రమ వ్యవస్థాపకులైన శ్రీస్వామి ఓంకారీతో ప్రసంగభాగ్యము, కొన్ని నాళ్లు ఆ యాశ్రమంలో ఉండగలిగే అవకాశము నాకు కలిగినది. వారు నా అర్హతను అంచనా వేసుకున్నారో, లేక మరేమైనా కారణమో నాకు తెలియదు కాని నన్ను జిల్లెళ్ళమూడి అమ్మ దర్శనం చేసుకోమని ఆదేశించారు. అది వారి కృప అమ్మ అనుగ్రహం.
ఒకనాడు జిల్లెళ్ళమూడి నుండి యింటికి తిరిగివస్తూ అమ్మ వద్దకు పటికబెల్లం నివేదనకు తీసుకువెళ్లాను. అది దీర్ఘచతురస్రాకారంలో ఉన్నది. ఆరు అంగుళాల పొడవు, మూడు అంగుళాల వెడల్పు కలిగి ఉన్నది. కొనేటప్పుడే అలా ఉన్నది. నివేదనకు తీసుకువెళ్లిన పండ్లు వగైరాల నుండి అమ్మ యీ పటికబెల్లం చేతిలోనికి తీసికొని నాతో “నీవు శాంతి ఆశ్రమానికి వెడతావా నాన్నా” అని అడిగింది. అవును అన్నాను. విచిత్రం జరిగింది. అమ్మ నోటి నుండి, నాలుక బయటకు జారింది. ఆరు అంగుళాల పొడవున్న పటికబెల్లం ముక్కను పూర్తిగా తన నాలుకతో రెండుసార్లు తాకించి “స్వామీజీకి ప్రసాదంగా యివ్వమన్నది. వెంటనే నాకు దక్షిణేశ్వరం కాళీమాత విగ్రహంలోని నాలుక స్ఫురణకు వచ్చినది. ఆ నాలుక, ఈ నాలుక ఒకటేనా అనిపించినది. అమ్మవైపు ప్రశ్నార్థకంగా చూశాను. “అవును. వాడే వీడు” అన్నది. ఈ సంఘటన జరిగినప్పుడు వసుంధర అక్కయ్య కూడా లేదు.
అమ్మ అమ్మే నన్న నిశ్చితాభిప్రాయానికి నేను ఆనాడే వచ్చాను. అప్పారావు అన్నయ్య గారి గ్రంధం నాకు ప్రేరణ యిచ్చి ఇన్నాళ్లుగా నేను మనస్సులో దాచుకున్న ఈ విషయాన్ని ఇప్పుడు అక్షరబద్ధం చేయటం జరిగింది.