సులభమైన, అందరికీ ఆచరణ యోగ్యమైన ఆధ్యాత్మిక మార్గాన్ని సాధకులకు అమ్మ చూపించిందని, తల్లిగా, గురువుగా, దైవంతో సాక్షాత్కరించిన అమ్మ వైభవం సాటి లేనిదని “అమ్మ తత్త్వ ప్రచార సమితి” అధ్యక్షులు శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి వివరించారు. జులై 22వ తేదీ సోమవారం సాయంత్రం బాపట్లలో “సద్గురు రామనాధయోగ సత్సంగమండలి” ఆధ్వర్యంలో జరిగిన గురుపూజోత్సవంలో ముఖ్యఅతిధిగా పాల్గొని, “అమ్మ చూపిన ఆధ్యాత్మిక మార్గం” అనే అంశాన్ని వివరిస్తూ శ్రీ మల్లాప్రగడ ప్రసంగించారు. “అరుణశ్రీ” బొడ్డుపల్లి రామకృష్ణ సభాప్రారంభకులుగా వ్యవహరించారు. శ్రీమతి బొడ్డుపల్లి సత్యకామాదేవి సౌజన్య సహకారాలతో ఏర్పాటైన ఈ సభ అమ్మను గురుమూర్తిగా భావిస్తోందని, అమ్మలోని సద్గురుతత్త్వాన్ని తెలుసుకునే ప్రయత్నమే ఈ సమావేశం లక్ష్యమని ‘అరుణశ్రీ’ పేర్కొన్నారు. “అమ్మ జీవిత సన్నివేశాలు, అమ్మ ప్రబోధం పరిశీలిస్తే అమ్మ చూపిన ఆధ్యాత్మిక మార్గం ఎంత సమున్నతమో తెలుస్తుంద”ని శ్రీ మల్లాప్రగడ అన్నారు. ‘సాధన, తపస్సు, ఆరాధన; విగ్రహం, ఇష్టదైవం, దైవీశక్తి, సాధకుని కర్తవ్యం మొదలగు అంశాలకు అమ్మ ఇచ్చిన వివరణలు ఆధ్యాత్మిక సాధకులకు కరదీపికలని, “సత్య సందర్శనానికి రాచబాటల”ని శ్రీ శ్రీమన్నారాయణమూర్తి ఉద్ఘాటించారు.
అమ్మ తత్త్వ ప్రచారసమితి సభ్యురాలు డాక్టర్ ఎం.బి.డి. శ్యామల అమ్మను సరస్వతీస్వరూపిణిగా అభివర్ణించారు. ‘శ్రీరస్తని, శుభమస్తని, దీర్ఘాయురస్తని దీవించుమమ్మా!” “వెలలేని దేవతవు కద తల్లీ!” అంటూ మధురగీతాలు ఆలపించారు. ప్రసాదవితరణతో సభ ముగిసింది.