ప్రపంచంలో నున్న అన్ని దేవాలయాలలో శ్రేష్ఠమైనది మన దేహమనే దేవాలయమే. ఆ దేవాలయంలోనే ప్రతిష్ఠితమై వున్నాడు దేవుడు. దేవులాడినా దొరకనివాడే దేవుడు అన్నది అమ్మ. మరి దేవుడనే వాడే వుంటే అసలు వాడు ఎందుకు దొరకడు ? వాడు ఎక్కడో లేడు కాబట్టి మరి ఎక్కడ వున్నట్లు? వాడు మన హృదయ కుహరంలోనే వున్నాడు. వాడిని అంతఃకరణతో చూడవలసిందే కాని బైట ఎక్కడో వెదికినా దొరకడు. మరి మనము పుణ్యక్షేత్రాలన్నింటిలోనూ చూస్తూనే వున్నాము. గంటలు గంటలు దైవదర్శనానికి పడికాపులు పడుతున్నాము. మరి మనం చూచేది దైవాన్ని కాదా? ఎక్కడైనా ఎవరినైనా, దేన్నైనా భగవంతునిగా భావించి నమ్మకముతో అంతర్నేత్రముతో చూస్తే కనబడతాడు. యద్భావం తద్భవతి అన్నారు. మనము ఎట్లా భావిస్తే అట్లాగే కనబడతాడు. కాని మనకు కనబడేది. ఎవరో కాదు నేనే. నేను నేనైన నేను అన్ని నేనులు నేనైన నేను ఏదైతే వున్నదో ఆ నేనై ఏకమవా అద్వితీయం బ్రహ్మ ఇంకా రెండోది లేనే లేదు.
“ఆ ఒక్క క్షణమైన చాలు
జన్మజన్మల పుణ్యఫలమిదే కాబోలు
ఈ చరాచర జీవులెల్ల – వ్యష్టిగా సమిష్టిగా
ఉచ్ఛ్వాసమున – ధూమకణములై నిను చేరి
నిశ్శ్వాసమున – కాంతికణములై మరలుటను
నా చెంతనే ఉన్న – నాలోన నే వున్న నను
“నేను నేనైన నేను” గా చూచేటి
ఆ ఒక్క క్షణమైన చాలు”
అన్నారు రాజుబావ గారు తన అనుభవసారంలో