అమ్మ సన్నిధిలో ఆంగ్లసంవత్సరాది ప్రత్యేక పూజలు 1963 వ సంవత్సరం నుండి జరుగుతున్నాయి. ఆంగ్ల సంవత్సరానికి కూడ అమ్మ ప్రేమతో పిలుపునందిస్తోంది.
అమ్మ ఎవరికి ఎప్పుడు ఎందుకు ప్రేరణ కల్పిస్తుందో అదెలా మలుపు తిరుగుతుందో తెలియదు. అమ్మ పెద్ద బిడ్డ అయిన బ్రహ్మాండం సుబ్బారావన్నయ్యకు ఆ ప్రేరణ నిచ్చింది. 1962 సంవత్సరము అన్నయ్య అమ్మకు కొత్తచీర,బిస్కట్లు తెచ్చాడు. అప్పుడు వేదికలు లేవు. అలంకారాలు లేవు. ఇంత జనమూ లేరు. ప్రస్తుతం నామసంకీర్తన జరిగే ఆలయంలో హాల్లో మంచం మీదనే. అమ్మ అన్నయ్య పెట్టినచీర కట్టుకుని వచ్చి కూర్చున్నది. సుబ్బారావన్నయ్య అమ్మమెడలో దండవేసి పూలు పాదాలపై వుంచి నమస్కరించి బిస్కెట్లు నివేదన చేశాడు. టీ పెట్టించి ఇచ్చాడు. అక్కడున్నఅందరికీ అమ్మ స్వయంగా ప్రసాదం పెట్టింది. ఇలాఆరంభమైన న్యూఇయర్ ఫంక్షన్ మంచం మీద నుంచి కుర్చీ ఆ తర్వాత ప్రస్తుతం అన్నపూర్ణాలయం దగ్గర వున్న వేదికపైన అలంకృతమైన సింహాసనాసీన అయి చిద్విలాసంగా కరెక్టుగా 12 గంటలకు నూతన సంవత్సరానికి శుభారంభం పలికింది. 12 గంటలకు వేదికపైకి వచ్చిన అమ్మ తెల్లవారి 4 గంటలదాకా పట్టేది భక్తుల సందడి వారి పూజలందుకుంటూ, వారు కొత్త పుస్తకాల మీద అమ్మ చేవ్రాలును వ్రాయించుకుంటూ, కాలం గడిచేది. 4 గంటలకు పైకి వాత్సల్యాలయానికి వచ్చినా, కిటకిటలాడుతూ ఆ రోజంతా సంరంభమే.
1980వ సంవత్సరంలో అమ్మ టైంకి దర్శనానికి రాలేదు. టైమయినా అమ్మ ఇంకా రాలేదేంటని ఆతృతతో అమ్మను దర్శించుటకై నిరీక్షిస్తున్న అమ్మ సంతానం మనస్సులో పరిపరి ఆలోచనలు.
అమ్మ 2 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది దర్శనానికి. మర్నాడు ఆంధ్రప్రభలో కొత్త సంవత్సరం .లేటుగా వచ్చిందన్న వార్త పడింది. ఆ పేపరు చూసిన రామకృష్ణ అన్నయ్య అమ్మకు చదివి వినిపించాడు. వివిధ నభో మూర్తుల ప్రభావం వలన భూభ్రమణం స్వల్పంగా మందగించిందనీ, అందువల్ల కొత్త సంవత్సరం లేటుగా వచ్చిందనీ, జాతీయ భౌతిక పరిశోధనాగారం తెలియచేసిందనీ, చదివి అందుకే రాత్రి నువ్వు ఆలస్యం చేసి ఉంటావు అన్నాడు. అమ్మ చిరునవ్వుతో –
“అదంతా మీ నమ్మకంరా” అని తేల్చేసింది.
ఆ రోజు కాలం మందగిస్తే – అమ్మను ఈ నాటికీ అర్థం చేసుకోలేని మందబుద్ధులం మనం.
మన మాంద్యం తొలగించి తనను గుర్తింప చేయాలన్నా అమ్మదే కదా బాధ్యత పరిమితమైన అమ్మ అపరిమితమైన సంవత్సరం.
1985 చివర సంవత్సరం. ఆ రోజు కరెంటు లేదు. అమ్మకు స్నానానికి నీళ్ళులేవు.
ఆ రోజుల్లో (ఆశ్రమానికి అందరింటికి జనం రాక పోకల వసతికి ఒక వాన్ వుండేది. ఆ వాన్ లైట్లలో అమ్మదర్శనం జరిగింది. ఈ సంవత్సరం యిలా జరిగిందే ఇది దేనికి సంకేతమో అనిపించింది. ఆ సంవత్సరమే మన కోసం దివినుండి భువికి దిగివచ్చి మనవలె మన మధ్య మెలిగిన అమ్మ అనంతాకాశంలో విలీనమయింది. మనకు కనిపించని తీరాలకు మనను దాటివెళ్ళినా మనను వెన్నంటి కనిపెట్టేవుంటున్నది.
సుబ్బారావన్నయ్యతో ప్రారంభింపచేసిన ఈ న్యూ ఇయర్ ఫంక్షన్ ఆసారి కాసారి వైభవంగా నూత్న వినూత్నంగా జరుపుకుంటోంది.
ఈ ఉత్సవం 2013 50 సంవత్సరాలు నిండి 51వ సంవత్సరంలో అడుగుపెట్టబోతోంది. చిద్విలాసంతో కనిపించే ఆ కరుణామయిని దర్శించి అమ్మ ఆశీస్సులందుకుందాం.