1. Home
  2. Articles
  3. Viswajanani
  4. ఆగని జగన్నాధ రథం

ఆగని జగన్నాధ రథం

Prasad Varma Kamarushi
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 21
Month : January
Issue Number : 1
Year : 2021

దేహమే దేవాలయం అన్న విశ్వాసం ఆర్ష సంప్రదాయంలో కనిపిస్తుంది. ఈ దేహం దేవుణ్ణి చేరటానికి ఓ గొప్ప సాధనం. ఈ సాధనం సవ్యంగా పని చెయ్యాలంటే అన్నమే ఆధారం. అన్నాద్భవంతి భూతాని. అన్నము నుండియే జీవ దేహములు పుట్టుచున్నవి. అన్నముచేతనే జీవించుచున్నవి అని తైత్తిరీయోపనిషద్వాక్యం.

అన్నే శ్రితాని భూతాని అన్నంహి ప్రాణమితి శ్రుతిః | 

తస్మాదన్నం ప్రదాతవ్యం అన్నంహి పరమం హవిః |

ఆహారం జీవశక్తి అని, అంతర్గత శక్తి అని వేదవచనం. భౌతిక గుణాతీతమైనది అమూల్యమైనది, అన్నదానం. ఇదీ పరమాత్మోపాసనయే. మన ఆర్ష సంప్రదాయంలో ఆకలిగొన్న వారికి అన్నం పెట్టటమన్నది ఒక పవిత్ర సంప్రదాయం. సమాజ అరాధన. పరమాత్మ వలన సృష్టి అయిన వస్తువులు ఆయనకే సమర్పించి దానిని ప్రసాదముగా స్వీకరించుట ( షోడశ) ఉపచార మంత్రములలో ఇమిడి ఉండుట గమనార్హము.

పరమేశ్వరునికి నివేదన చేసిన పదార్థం ప్రసాదమవుతుంది. అమ్మ కంటి చూపుతో, హస్త స్పర్శతో అన్నమునకు అన్నత్వం, రసమునకు రసత్వం, ఆయా భోజన పదార్థములకు వాటి తత్త్వము గౌణమై సూక్ష్మ మైన మార్పులు చెంది చివరకు అన్న ప్రసాదముగా అమ్మ ప్రసాదముగా మనకందుతోంది అన్నది అనేక మందికి అనుభవమే. భారతీయ ధార్మిక జీవనంలో దానానికిఅత్యంత ప్రాధాన్యత ఉన్నది. దానాలలో అన్న దానానికున్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా 

చెప్ప పని లేదు. దానం ప్రియవాక్సహితం అని పెద్దల మాట. రామాయణం దాన ప్రశస్తిని గురించి విస్తారంగానే ప్రస్తావించింది. పేరు ప్రఖ్యాతులాసించి అహంకార ధిక్కారములతో దానం చెయ్యరాదంటుంది. దాన స్వీకర్త వలన లేక భోక్త వలన తాను ధన్యుడ నగుటకు అవకాశం కలిగినదని నిరాడంబర భావన కలిగి ఉండాలి. దాతవ్యమన్నం విధివత్ సత్కృత్య నతు లీలయా…….. విధి పూర్వకముగా అర్చించి భోజనం పెట్టాలి అని బాలకాండలో దశరథుని ఆజ్ఞ. గౌరవం చూపకుండా తోచిన రీతిలో అలవోకగా దానమీయరాదు. అన్నవస్త్రాలు సమర్పించండి అని దశరథుని మాట. సమర్పించండి అన్నాడు గాని దానం చెయ్యండి అనలేదు. అన్నం వితరణ చెయ్యవలసిన వస్తువే గాని అమ్ముకొనేది కాదు. అసలు అమ్మబడిన అన్నం తినరాదని శాస్త్ర వచనం. పంచయజ్ఞాలలో అన్నదానం కూడా ఉన్నది. కేవలం కర్తవ్య బుద్ధితోనే, ప్రతిఫలాపేక్షరహితంగా చెయ్యాలి. అందువలన సంపూర్ణ సాత్త్విక దానమిది.

 

అమ్మ ఈ ధార్మిక సిద్ధాంత రాద్ధాంతాల జోలికి పోక – అతి సహజంగా నిరాడంబరంగా నీకున్నది తృప్తిగా తిని యితరులకు “ఆదరంగా” పెట్టుకో అని ఒక్క ముక్కలో తేల్చి చెప్పింది. మాతృ సహజమైన ప్రేమతో లాలనతో అన్నం తిను నాన్నా అనేది. సందర్శకులకు ఆ మాటే ఆమె మొదటి పలకరింపు అయింది. తినేవాడు లేకపోతే ఎవరికి పెడతారు? మనం పెట్టి, వాళ్ళనుద్ధరించటం కాదు. వాళ్ళు తిని మనలను ఉద్ధరిస్తున్నారు అనేది.బిడ్డలందరికీ తృప్తి తీరా పెట్టుకోవాలనే ఆశించింది.  తనవద్దకు ఆకలితో రావచ్చు గాని ఆకలితో వెళ్ళరాదని అమ్మ అన్నయజ్ఞం అనవరతంగా చేసింది. అన్నపూర్ణాలయం ద్వారా చేస్తూనే ఉన్నది. ఆత్మారాముడు శాంతించిన తర్వాతనే కదా భక్తి ముక్తుల గురించి ఆలోచించేది. ఆ రెండు మార్గాలకు దారి చూపే ప్రేరణశక్తి చోదక శక్తి అమ్మ. లౌకికము ఆధ్యాత్మికము అని రెండు లేవు, ఉన్నదంతా ఒకటే అని గదా అమ్మ మాట. అన్న వితరణ చెయ్యటం వ్యక్తిత్వం లో ప్రధాన భాగంగా చేసుకో గలిగిన వారు ధన్యులు.

అమ్మ తాను స్వయంగా ఆచరించి ఆదర్శంగా నిలచి ఎందరిని ధన్యులను చేసిందో!

అన్నపూర్ణాలయ ప్రారంభం 1958 ఆగష్టు 15 అని మనకందరకు తెలుసు. ఈ ప్రారంభానికి గల నేపథ్యం కొందరికే తెలుసు. ఈ వ్యవస్థకు పునాది వేసిన వారు డా.పొట్లూరి సుబ్బారావు గారు. ఈ ఆసక్తికర విషయాలు మన్నవ దత్తాత్రేయశర్మగారు తమ లోకబాంధవి గ్రంథంలో ప్రస్తావించేరు. అమ్మ సందర్శనాని కొచ్చే బిడ్డలకు మొదట్లో అమ్మే స్వయంగా వంటచేసి పెట్టేది.

రానురాను సందర్శకుల సంఖ్య పెరగటంతో ఇది క్లిష్టంగా మారింది. అప్పుడు డాక్టర్ గారు అమ్మా ఏదోవిధంగా విడిగా మేం భోజనం యేర్పాటు చేసు కుంటాం, అంగీకరించు అని అర్థించి, చీరాల వెళ్ళారు. చీరాలలోని భక్తులను సమావేశపరచి, జిల్లెళ్ళమూడికి మనం తరచుగా వెళ్తున్నాం. ఇంకా అనేక చోట్ల నుంచీ జనం వస్తున్నారు. అందరి భోజన వసతికి అమ్మపై భారం వెయ్యకుండా మనం ఏదైనా యేర్పాటు చేసుకుంటే బాగుంటుంది, దాని నిర్వహణకు నిధి సేకరిద్దాం అని చెప్పేరు. సుమారొక వంద మంది తలా ఒక 50రూ. వేసుకొని వంట సామగ్రి కొని జిల్లెళ్ళమూడి చేరేరు. అమ్మ అన్నపూర్ణాలయం ప్రారంభించింది. గాడిపొయ్యలో నిప్పు వేస్తూ “జగన్నాథరథం కదిలింది, ఇది ఆగదు” అంది. తదాది అన్నపూర్ణాలయం అమ్మ గుండె అయింది. అమ్మ చిన్ననాటి సంకల్పం ఈ రీతిగా రూపు దిద్దుకున్నది. పొంగలి ఎలా తయారు చెయ్యాలో డాక్టరు గారికి చెప్పి వారితో చేయించింది. అన్నపూర్ణాలయంలో మొదటి వంటకం డాక్టరుగారు చేసిన పొంగలి అన్నమాట.

అన్నపూర్ణాలయంలో అయోగ్యత, అపాత్రత అన్న ప్రసక్తి లేనే లేదు. వారివారి ఆకలిగొన్న స్థితియే వారి ఏకైక యోగ్యత! అన్నదానం అనే మాట అమ్మ ఎన్నడూ అనలేదు, అంగీకరించలేదు. నా పిల్లలకు అన్నం పెట్టుకుంటే దానం ఎట్లా అవుతుంది? అని ప్రశ్నించింది. ఎవడి అన్నం వాడు తింటున్నాడు. మనం పెట్టేదేమిటి? అది ఇక్కడ లేకపోతే వాడు రాడు -వచ్చినా తినలేడు. అమ్మదంతా “నమమ” అనే అకర్తృత్వ స్థితి. “మీ అందరికీ బాగా పెట్టుకోవాలని ఆశ. పెట్టుకోలేక పోతున్నాననే అసంతృప్తి నాకు ఉన్నాయి” అందొక సందర్భంలో. అన్నపూర్ణాలయంలో ఆదరణగా ఆప్యాయంగా పెట్టే వాళ్ళు కావాలి నాన్నా అనేది.

“అమ్మ గుప్పెడన్నం చేతిలో పెట్టిందంటే తిన్నవాడికి తెలియకుండానే జీవుని ఆశ్రయించుకుని ఉన్న పూర్వజన్మ సంస్కారములు నాశన మవుతాయి. అన్నం కాదది ప్రసాదం. ఆది తిన్నవాళ్ళకు అనేక అనుభవాలు కలిగాయి” అంటారు లోకబంధువు అని అమ్మచే పిలవబడిన సద్గురు శివానందమూర్తి గారు.

ఎక్కడికెళ్ళినా అధోజగత్ సహోదరులను యధావిధిగా పలుకరించి ప్రసాద వితరణ చెయ్యటం అమ్మ అలవాటు. ఒకసారి జైలు సందర్శించినపుడు, అయ్యో ఏనేరం చేసి జైలుపాలయ్యేరు? అని జాలి పడలేదు. అన్నం సరిగ్గా పెడుతున్నారా అని అడిగింది.

విజయనగరం వారొకరు తమ పిల్లవానికి అమ్మ చేత అక్షరాభ్యాసం చేయించుకున్నారు. అమ్మ పిల్లవాడికి ఒక చాక్లెట్ యిచ్చి, దోసిట నిండా చాక్లెట్లు పోసి అందరికీ పంచు నాన్నా అంది. వాడు పంచటం చూసి ఇదే అసలు అక్షరాభ్యాసం, జీవితంలో నేర్చుకోవలసిన ప్రధమపాఠం, ప్రధానపాఠం అన్నది.

జగన్నాథరథం ఆగకుండా సాగటమే జగన్మాత మనోరథం. అందుకు నిరంతరం ఉద్యుక్తులమై ఉండటమే మన శపధం కావాలి.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!