మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల సంస్కృ తోపన్యాసకులుగా, ప్రిన్సిపాల్గా, కొంతకాలం కరస్పాండెంట్గా తమ సేవలు అందించి, ఇటీవల ‘అమ్మలో ఐక్యమై’న శ్రీ వావిలాల మధుసూదనశర్మగారికి సంస్కృత పాఠశాల ఓరియంటల్ కళాశాలలో ఆశ్రునయనాలతో నివాళులర్పించాయి.
మాతృశ్రీ కళాశాల అధ్యాపకులను ఎం.ఏ. పరీక్షలకు ప్రోత్సహించి, పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీలకై సహకరించిన స్ఫూర్తిప్రదాత శ్రీ మధుసూదనశర్మగారు.
విద్యార్థులకు విద్యతో పాటు సాటిలేని ప్రేమను పంచి యిచ్చిన వాత్సల్యనిధి శ్రీశర్మగారు.
కళాశాలలో సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణలో విద్యార్థులకు చక్కని మార్గదర్శకత్వాన్ని అందించిన బాధ్యతాయుతమూర్తి శ్రీ వావిలావారు. చిరునవ్వుతో పలుకరిస్తూ, స్నేహానికి అంకితమైన మృదు హృదయంతో, సరళ స్వభావంతో అందరికీ ఆత్మీయతను పంచిన మంచి మనిషి శ్రీ మధుసూదనశర్మగారు.
రెండు సంవత్సరాల క్రితమే పదవీ విరమణ చేసినా, కన్నుమూసే రోజు వరకు ప్రతి నిత్యం కళాశాలలో విద్యార్థులకు విద్యాబోధన అందించిన విద్యాప్రియులు శ్రీ శర్మగారు.
ప్రభుత్వ నియమాల కారణంగా కళాశాలలో ఏర్పడిన అధ్యాపకుల కొరతను ఎదుర్కొనే ఉద్యమంలో స్వచ్ఛందసేవగా, పారితోషికం ఆశించకుండా, అటు కళాశాల పాలకవర్గానికి, ఇటు విద్యార్థి లోకానికి ‘సముచిత’ సేవలు అందించిన ఆదర్శ ఉపాధ్యాయులు శ్రీ వావిలాల వారు.
శ్రీ మధుసూదనశర్మగారు అర్థాంతరంగా కనుమరుగై పోవడం సహచరులైన అధ్యాపకులందరినీ కన్నీటి వరదలో ముంచెత్తినది.
భౌతికంగా శ్రీ శర్మగారు లేకపోయినా, వారి ఆదర్శం, మంచితనం,, పరోపకార స్వభావం, స్నేహపాత్రత మరువలేనివి అని – అధ్యాపకులు శ్రీ శర్మగారికి కన్నీటి వీడ్కోలు పలికారు.
శ్రీ మధుసూదనశర్మగారి దివ్యస్మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ- వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపాలను తెలియజేస్తూ, అశ్రుతర్పణం అందిస్తున్నామని అధ్యాపకులు గద్గద స్వరాలతో నివాళులు సమర్పించారు.