ఒకరోజు మా అమ్మగారితో కబుర్లు చెప్పుకుంటుండగా అమ్మ సంగతులు, మధురస్మృతులు గుర్తు చేసుకుంటుండగా మా అమ్మ మా నాన్నగారి అనుభవాలు వివరిస్తూ (మానాన్న గారు వల్లూరు జగన్నాధరావుగారు, గుంటూరు వాస్తవ్యులు) మాతో అమ్మ ఒకసారి “నాన్నా ! మీరు ఇచ్చే వందరూపాయల కన్నా పేదవాడు ఇచ్చే ఒక రూపాయి నాకు చాలా విలువయినది” అని అన్నదని చెప్పారు. ఆ సంగతిని విన్నాక నాకు మనసులో ఒక ఆలోచన స్ఫురించింది. కాదు, అమ్మ అనుగ్రహం ఆ రూపంగా చి॥దమయంతి మీద పడిందనిపించింది. ఆ రోజు నేను మా పనమ్మాయిని పిలిచి, నువ్వు కొంత డబ్బు, నేను కొంత డబ్బు కలిపి నీ పేరు మీద అమ్మకు, నాన్నగారి ధ్యానాభిషేకానికి కడదామా అని అడిగాను. అది మంచి పని అన్నావు కదా తప్పకుండా నేనే మొత్తం 800 రూపాయలు కడతానన్నది. సరే అని జనవరిలో మా అన్నయ్య చి॥ వల్లూరి బసవరాజుకి ఇచ్చి కట్టించాను.
ఆ తరువాత నెల ఫిబ్రవరిలో మా ఎదురింట్లో వుండే మా పిన్నిగారికి కాలికి దెబ్బతగిలి బెడ్ రెస్ట్ తీసుకోమంటే ఆవిడ తనకు తోడుగా మాపనమ్మాయిని నెలకు రూ. 1000/- కు కుదుర్చుకొని రాత్రిపూట భోజనం కూడా పెట్టేటట్లుగా మాట్లాడుకుంది. అప్పటి నుంచి ఆ పని మొదలు పెట్టి చేస్తోంది. అప్పుడు నేను మా పనమ్మాయితో చూసావా “షిర్డీ సాయిబాబా అన్నట్లు నాకు ఒక రూపాయి ఇస్తే నీకు 10 రూపాయిలు వస్తాయి” అన్నట్లు అమ్మ నీకు నెలకు 1000/- ఒక పూట భోజనం పెట్టించింది అన్నాను. అప్పటి నుంచి మా పనమ్మాయి ప్రతి ఏడూ జనవరిలో అమ్మకు జిల్లెళ్ళమూడికి పంపించు అని అడిగి మరీ ఇస్తోంది. అలాగే అమ్మ దగ్గరకు వెళ్ళిన ఎందరికో ఇహ పరాలకు ఎన్నో రెట్లుగా ప్రసాదించింది. అమ్మ అన్నట్లు మన కందరికీ ఇవ్వవలసిన దానికంటే ఎక్కువే ఇచ్చింది. అది అక్షరాలు నిజం. అది తలచుకుంటే మనసు అమ్మపై కృతజ్ఞతతో నిండి పోతుంది.