అమ్మ అనుగ్రహం, దయా,ప్రేమ ఏమని వర్ణించ గలము. మనం చాలా అదృష్టవంతులం. అమ్మని కొలవని వారు దురదృష్టవంతులే అని చెప్పటానికి వెనకాడకూడదు. విశాఖమందిరంలో అనేక అద్భుతాలు జరుగుతున్నాయి. ఏకా రాజేష్ ఎమ్. బి.ఎ. చదువుతూ, గిటారు క్లాసులు చెప్పుకుంటూ అమ్మకు ఎనలేని సేవ చేసుకుంటున్నాడు.
అలాగే అనేకమంది. చాలామంది హోమియోపతి మందుకి మందిరానికి వస్తారు. అమ్మ దర్శనం చేసుకొని మందు తీసుకుంటే నయమవుతుందని వారి నమ్మకం. లాసన్స్ బే కాలనీలో మారుతీ మామ్మగారు వున్నారు. ఆమె హనుమదుపాసకురాలు. ఆవిడకు 80 సంవత్సరాలు పైనే వుంటుంది. వాళ్ళ ఇంటిపేరు “మారుతీ నిలయం”. ఆవిడ అహర్నిశలు ఆంజనేయస్వామిని కొలుచుకునేది.
ఆవిడకు చూపు తగ్గితే వాళ్ళ పిల్లలు నా దగ్గరకు వచ్చి మందు తీసుకు వెళ్ళేవారు. క్రిందటి సంవత్సరం ఆవిడ స్నానాల గదిలో జారిపడటంతో కాలు విరిగింది. డాక్టర్ కట్టు వేశారు. కానీ ఆమె వేరే ఇంగ్లీషు మందులు ఏమీ వాడేది కాదు. అమ్మ మందిరంలో హోమియో మందు తీసుకునేది. ఆ తరువాత ఆమెపని ఆమె చేసుకుంటూ వుండేవారు. ఆ తరువాత నీరుడు ప్రాబ్లమ్ వచ్చింది. దానికి కూడా నా దగ్గరే మందు వాడేవారు. ఎంత బాధ వున్నా చూపు తగ్గినా, నీరుడు కాకపోయినా అమ్మ మందిరంలో తీసుకున్న మందే పనిచేసేది. అమ్మను ప్రార్థించే మందు ఇచ్చేవాడిని. అమ్మే చూచుకునేది. ఈ మధ్య ఆవిడ పిల్లలందర్నీ పిలిపించుకొని, వెళ్లిపోతున్నానని, చాప వేయించుకొని ఏ బాధపడకుండా రామనామం చేస్తూ స్వర్గస్తురాలయింది. అంతటి భక్తురాలికి సేవచేసుకున్న అదృష్టవంతుణ్ణి, అంతా అమ్మదయ,
అలాగే ఒక ఆర్.టి.సి. డ్రైవర్ కూతుళ్ళు ఇద్దరూ మందుకు వచ్చేవారు. పెద్దపిల్లకు మాటలు సరిగా రావు. చేతలు శూన్యం. ఆ పిల్ల చాలారోజులు మందులు తీసుకుంది. ఆశ్చర్యం ! ఆమెకు మాటలు రావటమే కాక హాయిగా వుంది. చిన్నపిల్ల ప్రసన్న. అమ్మగుడిలో చాలాకాలంగా ప్రదక్షిణాలు చేసుకుంటుంటే హైమక్క నామం కూడా చేసుకోమని సలహా ఇచ్చాను. హైమ అనుగ్రహించింది. ఆ అమ్మాయి ఎమ్.సి.ఎ. చేసింది. సాఫ్టువేర్ కంపెనీలో జాబ్ వచ్చింది. 8వేల రూపాయల జీతం. వాళ్ళ సంతోషానికి అవధులు లేవు. అమ్మ మందిరంలో ఎంత సాధన చేస్తే అమ్మ అంత అనుగ్రహిస్తుంది అని ఘంటాపథంగా చెప్పగలను. ఇలాంటి ఎన్నెనో అనుభవాలు. ఉదాహరణలు.
దసరా పండుగకు 10 రోజుల ముందు అమ్మకాళ్ళు పట్టుకొని కుసుమ ప్రార్థించింది. “అందరూ పండుగకు సున్నాలు, పెయింట్స్ వేసుకుంటారు. నీ మందిరానికి రంగులు వేయించుకోవాలమ్మా!” అని. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ కావటంతో మందిరం కారిపోతుంటే 8 వేలు పెట్టి బాగుచేయించాను. మా మందిరం గురించి ఎవరినీ డబ్బు అడగటం అలవాటు లేదు. ఫిబ్రవరి 17కు పెయింట్స్ వేయిస్తానని చెప్పాను.
ఈలోగా హైద్రాబాద్ నుంచీ వటమట నర్శింమూర్తిగారి అమ్మాయి రత్న ఫోను చేసి అక్కయ్యా ! “10 వేల రూపాయలు విశాఖ అమ్మ మందిరానికి పంపిస్తున్నా. నీకు తోచిన విధంగా ఖర్చుచేయమంది”. కుసుమ ఆనందానికి అవధులు లేవు. అమ్మ నా మొర ఆలకించింది అని సంబరపడింది. నరసింహమూర్తిగారి అల్లుడు వి.వి.యస్. రామారావుగారు 10 వేల రూపాయలు పంపించారు. డబ్బు రెడీ అయింది పండుగ ముందు పెయింట్ వేసేవాళ్ళు దొరకటం కష్టం.
ఇంకో విచిత్రం ఏమిటంటే మా పెద్దమ్మగారి మనమడి పేరు భుజంగరావు. నా దగ్గరికి మందుకు రావటం జరిగింది. అతను కాంట్రాక్టు చేస్తున్నాడుట. మందిరం గురించి చెపితే ఆ ఛాన్సు మాకివ్వండి. నేను చేయించి పెడ్తానని ముందుకు వచ్చాడు. మూడు రోజుల్లో అంతా కంప్లీటు చేశాడు. అమ్మ ఎవరిని ఏ విధంగా అనుగ్రహించి ప్రేరేపిస్తుందో అనూహ్యం. అంతా అయోమయం. ఆశ్చర్యం. అంతా ఒక మాయలా జరిగిపోయింది. మేము మాత్రం విస్తుపోయాము. అమ్మా! మందిరంలో నీవు వచ్చి కూర్చున్నావు, ఎంతమందిని ఉద్ధరించాలో నీకే తెలుసు. మేము ధన్యులం తల్లీ ! ఇలాగే మమ్మల్ని అనుగ్రహిస్తూ సదా నీ సేవచేసుకొని తరించనీ తల్లీ!