అమ్మ లీలలను గురించి ఎంత చెప్పినా తక్కువే. అందులో ఒకటి వైజాగ్ అమ్మ మందిరంలో జరిగిన ఒక సంఘటన. 2010 వ సంవత్సరంలో వీరయ్య అనే ఒకతను తెలంగాణ నుండి వైజాగ్ అశోకహౌస్లో వాచ్మెన్గా పనిచేయడానికి వచ్చారు. మన మందరం కూడా ప్రక్కనే ఉండటం వలన అతణ్ణి చక్రవర్తి అన్నయ్య గారు మందిరంలో కూడా పనిచేస్తావా అని అడిగారు. దానికి అతను సరే సార్ పని చేస్తాను అన్నాడు. అప్పటి నుండి అతను ఉదయాన్నే గేట్లు తీయడం. ఎవరైనా కొత్తవారు వస్తే వాళ్ళ వివరాలు తెలుసుకొని మధ్యాహ్నం అమ్మకు మహా నివేదన కోసం నేను, కుసుమక్కయ్య వచ్చినప్పుడు వాళ్ళ వివరాలు చెప్పేవాడు. అలాగే సాయంత్రం చక్రవర్తి అన్నయ్యగారు వచ్చేటప్పటికి లైట్లు వేయడం, కుర్చీలు బయట సర్దడం అతని దినచర్య.
కుసుమక్కయ్య అతనికి ప్రతి సంవత్సరం దసరా పండక్కి కొత్త బట్టలు పెట్టేవారు. ఒకసారి అతను గుంటూరులో ఉన్నవాళ్ళ అబ్బాయి దగ్గరకు వెళ్ళడానికి ఛార్జీలకు డబ్బులు లేక బయట గేటు దగ్గర కూర్చొని ఉన్నాడు. మేము మహానివేదన కోసం మందిరానికి వచ్చే సమయం అది. తనను చూసిన కుసుమక్కయ్య ‘ఎక్కడికి తాత బయలుదేరావు?’ అని అడిగారు. ‘మా అబ్బాయి దగ్గరకు వెళదామని’ చెప్పి ఆగాడు. ఒకవేళ చార్జీలకు డబ్బులు లేక అడగడానికి సందేహపడుతున్నాడు అని గ్రహించి వెంటనే తన పర్స్లో నుండి 500 రూపాయిలు తీసి ఇచ్చారు అక్కయ్య.
అమ్మకు పూజాకార్యక్రమాలు, మహానివేదన పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణంలో కుసుమక్కయ్య గారు నాతో చెప్పారు. నిన్న పర్స్లో డబ్బులు అన్నీ తీసి సరుకులు తెచ్చావు కదా! పర్స్ లో డబ్బులు పెట్టుకుందామనుకొని మరచిపోయాను. కానీ ఈ 500 రూపాయలు ఎలా వచ్చాయని ఆలోచిస్తుండగా నేను వెంటనే “అమ్మే” అతనికి ఇవ్వమని పెట్టుంటుదని అన్నాను. అవును అది నిజమే అయి ఉంటుందని కుసుమక్కయ్య అన్నారు.
మొదట్లో కొన్ని రోజులు మందిరం లోనికి రావడం గానీ, అమ్మకు దణ్ణం పెట్టుకోవడం గానీ చేసేవాడు. కాదు వీరయ్య. లైట్లు వేయడం కోసం, కుర్చీలు బయటకు తీసుకురావడం కోసం మాత్రమే మందిరంలోనికి వచ్చేవాడు. తర్వాత అమ్మ అతనిలో ఎంతో మార్పు తెచ్చింది. తనంతట తానే మందిరం వెనకాలే ఉన్న పువ్వులు, మొక్కలు నుండి పూలు తీసుకు రావడం, మందిరంలో జరిగే అమ్మ పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం తనకు అలవాటుగా మారింది.
తనకు మద్యం సేవించే అలవాటు ఉండటం వలన మందిరంలోనికి వచ్చేవాడు కాదని తర్వాత తానే చెప్పాడు. అమ్మ దగ్గర అలాంటివి ఏమీ ఉండవని నీకు అలాంటివి భావం ఉంటే తీసేయమని చక్రవర్తి అన్నయ్య గారు అన్నారు కానీ అప్పటి నుండి ఎప్పుడైనా మద్యం సేవించినప్పుడు మాత్రం మందిరంలోనికి వచ్చేవాడు కాదు.
ప్రతిరోజు సాయంత్రం చక్రవర్తి అన్నయ్య గారు, నేను మందిరానికి రావడం, అమ్మకు పాలు నివేదన పెట్టి ఇంటికి బయలుదేరే సమయానికి కారు దగ్గరకు వచ్చేవాడు. అన్నయ్య గారు అతనికి వారానికి 200 రూపాయిలు ఇచ్చేవారు. ఇచ్చిన తర్వాత ‘జాగ్రత్త తాతా! ఎక్కడికీ వెళ్ళకు’ అనేవారు. ‘నేనెక్కడికి వెళ్తాను సార్? మీరందరూ ఇంటికి వెళ్ళిపోతారు. కానీ నాకు ‘అమ్మ’ తోడు. ‘అమ్మ’కు నేను తోడుగానే ఉంటాం’ అనేవాడు. ఒకరోజు అలాగే ఎవరో మందిరానికి వచ్చినవాళ్ళు ‘ఏం తాతా! నీకు ఎవరూ లేరా? ఎప్పుడు ఒక్కడే కనిపిస్తావు’ అని అడిగారు. అప్పుడు తాత ‘నాకు ఎవ్వరూ లేకపోవడం ఏమిటి? నాకు అమ్మ ఉందని’ చెప్పేవాడు. విధంగానే అమ్మ కూడా అతని నమ్మకాన్ని వమ్ము చేయలేదు.
2020 నవంబరు నెలలో అతనికి ఆరోగ్యం బాగోలేక కన్నుమూసాడు. గుంటూరులో ఉన్న తన కొడుక్కి ఈ సమాచారం ఎలా చేరవేయాలా అని అశోకస్ మొదటి అంతస్తులో ఉంటున్న రామకృష్ణగారు నన్ను అడిగారు. నేను అతని ఫోన్ నెంబరు తెలుసుకొని ఇచ్చాను. వాళ్ళ అబ్బాయికి సమాచారం చేరింది. కానీ అతను రాలేదు, ఇంక సమయం లేదు. – అని రామకృష్ణగారే పూనుకొని కొందరిని పంపి దహన సంస్కారాలు పూర్తి గావించారు. అంతేకాదు. పదకొండవ రోజున భోజనాలు పెట్టించారు. కాగా, కన్నకొడుకుకు చివరి చూపు కూడా అందలేదు.
విశేషమేమంటే – తాత జీవన మహాప్రస్థానంలో చివరి ఘట్టాన్ని అమ్మ కృపతో రామకృష్ణగారు ఘనంగా నిర్వహించారు.
అమ్మ దయ అంటే – ఇదే కదా!!