ఒకానొక సందర్భంలో అమ్మ “గడ్డిపోచను నిలబెట్టి పనిచేయించుకోగలను” అని గంభీరంగా ప్రకటించింది. మా వైజాగ్ మందిరంలో అనేక వింత అనుభూతులను నిత్యం చెప్తూనే వుంటారు. ఒకరూ రోజూకాసిని పూల పొట్లం కట్టిగేటుకు ముడివేసి వెళ్ళిపోతుంటారు. గత కొన్నిన నెలల నుంచీ అమరేష్ అనే విశ్రాంత బ్యాంకు ఆఫీసర్ ప్రతి సోమవారం అమ్మకు తప్పనిసరిగా పూలదండ సమర్పిస్తారు. ప్రతి గురువారం కామేశ్వరరావుగారు వారానికి సరిపడా పెద్దదండలు కదంబం, కనకాంబరాల దండ, విడిపూలు తప్పనిసరిగా ఆరునూరైన నూరు ఆరైనా తెచ్చి ఇవ్వవలసిందే. ఊరు చివర వున్న పెందుర్తి నుండి ఎండనకా, వాన అనకా తెచ్చి అమ్మసేవలో పాలుపంచు కుంటాడు. అమ్మ అనుగ్రహం పుక్కిటి ఒంటిగా అనుభవిస్తున్న వ్యక్తులలో ఒకడు.
హిందుస్తాన్ జింకులో శ్రీ చాగంటి శరభలింగం గార మేనేజరు. ఈయన సాధారణ సూపర్వైజర్. ఇద్దరికి స్నేహం ఎక్కువ. ఈయన చేత లలితాసహస్రం, త్రిశతి, ఖడ్గమాలా బలవంతంగా చదివించి 1980 సంవత్సరంలో అమ్మదర్శనాన్ని చేయించి ఒక సన్మార్గమున నడిపించిన వ్యక్తి శరభలింగంగారే.
కామేశ్వరరావుగారు కొంచెం మొరటు మనిషి ఇక కథ మొదలు. అందరిలాగానే పరివర్తనమొదలైంది. నిత్యం లలతా సహస్ర నామపారాయణ చేయటం మొదలు పెట్టారు. లలితపీఠంకు శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు విచ్చేస్తుండేవారు. ఆయన ఆదేశానుసారం మా అధ్యయన పరిషత్ మెంబర్స్ ప్రతి మంగళవారం అమ్మ పూజ అక్కడ జరిపేవాళ్ళం. అద్భుతంగా జరిగేది. లలిత పీఠం మేనేజర్ శ్రీ వాడరేవు సుబ్బారావుగారు, మధురవాణి గారు, అసిస్టెంటు మేనేజరు శ్రీ విస్సా రామచంద్రరావుగారు, సుందరిగారు పాలుపంచుకునేవారు.
2002 సంవత్సరంలో విశాఖ లలితాపీఠంలో మన అమ్మ ప్రవేశించింది. సాక్షాత్తు లలితాపరమేశ్వరి అయితేనే తన పీఠంలో ప్రవేశించే శక్తి వుంటుంది. ఈ విషయంలో అనుమానం లేదు. అమ్మ ప్రేమార్చనకు అమ్మ సూక్తులన్నింటినీ కట్టించాము. ఆ సూక్తులను చూచి కామేశ్వరరావుగారు అమ్మ ఫోటోకు “గజమాల వుంటే బాగుణ్ణని” అనుకున్నారు. 2002 నుంచి ఈ రోజు వరకూ ప్రతి గురువారం అమ్మకు పువ్వులు ఇస్తున్నారు.
కామేశ్వరరావుగారు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. మొండిమనిషి. ఆయుర్వేద వైద్యం నేర్చుకున్నాడు. మందులు ఇస్తుంటారు. జ్యోతిశ్శాస్త్రం కూడా నేర్చుకున్నారు. ఆ సంపాదన బాగానే వుంది. ఇవి అన్నీ ఎప్పుడు నేర్చుకున్నారని ప్రశ్నిస్తే ఇంటివద్దే స్వయంగా అమ్మప్రేరణతో చదువుకున్నాను. అమ్మ పలికిస్తోంది. ” పలుకుతున్నాను అంటాడు. అమ్మ చెప్పనే చెప్పిందిగా “చేతులు నీవికాని చేతలు నీవికాదని” చేతలన్నీ అమ్మవే కదా ! ఈ మధ్య ఆయన కారు కొనుక్కున్నారు. ప్రతి శుక్రవారం అమ్మ మెడలో కొత్త దండ వుండాలి అది ఆయన ధ్యేయం. ఆ కామేశ్వరరావుగారి ఇంటిపేరు ఏమిటో మా కెవ్వరికీ గుర్తుండదు. అమ్మకు పూలు, పూలదండలు సమకూర్చటంలో ఆయనకున్న దీక్ష ఎంతో గొప్పది. మేమందరం ఆయన్ను పూల కామేశ్వరరావుగారు అని పిలుస్తూ ఉంటాం. మాలో చాలా మంది వాళ్ళ ఇంటి పేరు “పూల” అనుకుంటూ ఉంటారు.
ఆయన 2011 సం|| సెప్టెంబర్ 12వ తారీఖున గరీబురధ్ బయలుదేరి హైద్రాబాద్ వెళ్ళారు. 14వ తారీఖు వాళ్ళ చిన్న అమ్మాయి పుట్టినరోజు అయిన పిమ్మట 15 కు వైజాగు బయలుదేరారు. శుక్రవారం అమ్మకు పూలు అందచేయాలన్న తపనతో. స్టేషన్కు వెళ్ళి రైలులో సామాను సర్దుకొని బెర్తులో ఇంకొకరు కూర్చుని వున్నారు. ఈయన 64, 65 మాకు బుక్ అయ్యాయని టికెట్లు చూపించారు. ఆమె టికెట్టు లోనూ 64 బర్త్ వుండటంతో ఇదేమిటి ? ఒకటే బర్తు ఇద్దరికి ఇచ్చారని అనుకుని చార్టులో చూద్దామని భోగీ ముందుకు వెళ్ళారు. అక్కడ 10వ తారీఖు వీరి పేరు లేదు. తీరా చూస్తే టికెట్ 16వ తారీఖు బుక్ అయ్యింది. టిక్కెట్టు కొన్నప్పుడు కాని, బయలుదేరేముందు కానీ కనీసం డేటు చూసుకోలేదు. అంతా మాయ. సరే చేసేదేమీ లేక రైలుల్లోనుంచీ సామాను క్రిందకు దించారు. అక్కడ టి.సి. కనిపిస్తే విషయం ఆయనకు వివరించారు.
టి.సి. జనరల్ టికెట్టు కొనుక్కొచ్చుకోండి. ఈ రోజు ఆర్.ఎ.సి. లేదు అని చెప్పారు. వెంటనే టికెట్లు కొనుక్కొని సామాను ఎక్కించేవరకు రైలు ఆగింది. ఆశ్చర్యం. 8-25 కి రైలు బయలుదేరింది. 9 గంటలకల్లా టి.సి. వచ్చి మాకు బెర్త్ లు ఇచ్చారు. జయహోమాతా అనుకున్నాడు. ఆయన ఆవిడ ఎటువంటి ఇబ్బంది లేకుండా వైజాగ్ వచ్చి శుక్రవారంకు పూలు అందజేయటం విచిత్రం కాక మరి ఏమిటి? అంతా ‘అమ్మదయే కారణమంటాడు. మన పాత జీవితాలు అమ్మ దగ్గరకు చేరినప్పటి నుంచీ వచ్చిన పరిణామాలు, చైతన్యం. అమ్మకే చెల్లింది. ఎంత అదృష్ట వంతులం అమ్మా ! సదా రక్షించు తల్లీ.