2.6.2013 ఆదివారం డాక్టర్ దయాకర్ అనాధ శరణాలయంలో ఉంటున్న వివిధ తరగతులు చదువుతున్న విద్యార్థులకు నాన్నగారి శతజయంతి సందర్భంగా అన్నవితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మన కళాశాల పూర్వవిద్యార్థి, ప్రస్తుతం గుంటూరులో కళాశాల అధ్యాపకుడు వారి మిత్రులు కలసి ‘మాతృశ్రీ అధ్యయనపరిషత్ పక్షాన సభ్యులుగా పాల్గొని ఆ కార్యక్రమానికి కావలసిన ఖర్చు భరించి విజయవంతం చేశారు. మాతృశ్రీ ఓరియంటల్ కాలేజి పూర్వవిద్యార్థులంతా అమ్మ సంస్థ సైనికులుగా పనిచేయటం ఆనందించదగిన అంశం.
*****
19.6.2013 బుధవారం అన్నదాన సమాజం వద్ద ఉన్న దయాహృదయంలోని పేద విద్యార్థులందరికీ పాఠశాలకు కావలసిన యూనిఫారం దుస్తులను పంపిణీ చేయటం జరిగింది. నాన్నగారిని గూర్చి వారి దయాగుణాన్ని గూర్చి విద్యార్థుల పట్ల వారి వితరణ భావాన్ని గూర్చి వారి ప్రేమను గూర్చి విద్యార్థులకు శ్రీ భాస్కరశర్మ, శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయులు గారు వివరించగా శ్రీ రావూరి ప్రసాద్ కమ్మగా అమ్మపాటలు పాడారు. ప్రసిద్ధి వ్యాపారస్థులు ఆధ్యాత్మిక హృదయులు కంచి కామకోటి పీఠ గుంటూరు ప్రతినిధి అయిన శ్రీ కంభంపాటి నాగేశ్వరావు, ప్రసిద్ధి కాటన్ వ్యాపారులు శ్రీ కె.రాముగారు యీ కార్యక్రమంలో పాల్గొని సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను మెచ్చుకున్నారు. శ్రీ ధూళిపాళ భాస్కరశర్మ వారి మిత్రులు ఉత్సాహంగా కార్యక్రమాని కయిన ఖర్చులు భరించారు.
*****
18.7.2013 గురువారం గుంటూరు శారదాకాలనీలో శివారెడ్డిపాలెంలోని శ్రీ రాజేంద్ర సూరి జైన్ సేవాసమితి (మానవతాసేవా సమితి) వారి వయోవృద్ధుల ఆశ్రమంలో ఉన్నవారందరూ అమ్మ నామం చేసి అయిదేళ్ళక్రితం జిల్లెళ్ళమూడిలోని అన్నపూర్ణాలయ స్వర్ణోత్సవాలలో అధ్యయనపరిషత్వారు వచ్చి అన్నదానం చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.
శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్ అమ్మలోని మానవతావాదాన్ని, కరుణ, ఆప్యాయత, ప్రేమ, అన్నవితరణను గూర్చి ప్రసంగించి శ్రీ విశ్వజననీపరిషత్ వారు ఈ సంవత్సరం నాన్నగారి శతజయంతి సంధర్భంగా 100 చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనీ ఆ కార్యక్రమాలలో భాగంగానే గుంటూరు శ్రీ మాతృశ్రీ అధ్యయన పరిషత్వారు ఈనాడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని చెప్పారు. అధ్యయనపరిషత్ అధ్యక్షుడు శ్రీ అన్నంరాజు మురళీకృష్ణ, ఉపాధ్యక్షుడు శ్రీపి. వెంకయ్య, కార్యదర్శి శ్రీ కట్టమూరి వెంకటేశ్వరరావు కృషితో యీ కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయి. శ్రీ అన్నంరాజు మురళీకృష్ణ యీ అన్నవితరణ ఖర్చును భరించారు. శ్రీ కవిరెడ్డి సీతారామిరెడ్డి మహాలక్ష్మీ వైన్స్వారు సకుటుంబంగా వచ్చి యీ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.