1947 ఆగష్టు 15 దేశానికి స్వాతంత్య్రం వస్తే జిల్లెళ్ళమూడికి 1958 ఆగష్టు 15 అన్నపూర్ణాలయానికి స్వాతంత్య్రం వచ్చింది. అప్పటిదాకా నాన్నగారి ఇల్లే అన్నపూర్ణాలయం. పిల్లలు పెరిగి పెద్దవారై అమ్మ నాన్నల అనుమతితో ఆరోజు అన్నపూర్ణాలయం ఏర్పాటు చేసి అమ్మనాన్నల పరిమిత కుటుంబాన్ని విశ్వవ్యాప్త కుటుంబం చేసిన రోజు. జిల్లెళ్ళమూడిలో ఏర్పడ్డ మొదటి ఆలయమదే..
15-8-2015 ఉదయం గం.7-30 నిమిషాలకే అమ్మ పతాకాన్ని శ్రీ విశ్వజననీ పరిషత్ అధ్యక్షులు శ్రీ బొప్పూడి రామబ్రహ్మంగారు, జాతీయపతకాన్ని జనరల్ సెక్రటరీ శ్రీ యల్లాప్రగడ వెంకట శ్రీరామమూర్తి ఆవిష్కరించారు. వందేమాతరం గీతాన్ని కళాశాల విద్యార్థులు పాడారు. అధ్యక్ష కార్యదర్శులు అమ్మ పతాక విశిష్టత, జాతీయకేతన విశిష్టతలను గూర్చి ప్రసంగించి అన్నపూర్ణాలయ వార్షికోత్సవ ప్రత్యేకతను వివరించారు.
తదనంతరం జరిగిన సభలో ముందుగా క్రితం రోజు రాత్రి అందరింటి సోదరుడు శ్రీమతుకుమల్లి రాము అమ్మలో లీనమైన సందర్భంగా 3 నిమిషాలు మౌనం పాటించారు. ప్రత్యేక అతిథిగా వచ్చిన సుప్రసిద్ధ జర్నలిస్టు డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావుగారు, కాకినాడ నుండి వచ్చిన శ్రీ బులుసు లక్ష్మీప్రసన్న సత్యనారాయణ శాస్త్రి, మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.యల్. సుగుణ, శ్రీ లక్కరాజు సత్యనారాయణ, శ్రీ మరకాని దినకర్ ప్రభృతులు ప్రసంగించారు.
కళాశాల విద్యార్థినీ విద్యార్థులు, పాఠశాల విద్యార్థి స్వాతంత్య్రదినోత్సవ వైభవాన్ని గూర్చి, ప్రసంగించి పాటలు పాడారు. విద్యార్థులకు వార్షికంగా ఇచ్చే దాతల ఉపకార వేతనాలు, ప్రతిభాపురస్కారాలను వేదిక పైనున్న అతిథులు ప్రదానం చేశారు. సభా కార్యక్రమాన్ని విశ్వజనని పత్రిక సంపాదకులు శ్రీ పి.యస్.ఆర్. నిర్వహించగా ప్రధానోపాధ్యాయులు శ్రీ కొండముది ప్రేమకుమార్ వందన సమర్పణ చేశారు.
9.30 గంటలకు అనసూయేశ్వరాలయంలో అన్నపూర్ణాలయ సిబ్బంది పూజలు చేసుకున్నారు. వారందరికి పరిషత్ అధ్యక్ష కార్యదర్శులు వస్త్రప్రదానం చేశారు. శ్రీ పి. రవికిశోర్ (అబుదబి) వారి సోదరుని ద్వారా పంపిన రెండు వేలగులాబీపూలతో హైమాలయంలో అనసూయేశ్వరాలయంలో సిబ్బంది పూజలు చేసుకొన్నారు.
11.00లకు జరిగిన ‘అమ్మతత్త్వవైభవం’ సాహిత్యరూపకం ప్రదర్శింపబడింది. డాక్టర్ సుగుణ, డా.యు. వరలక్ష్మి, శ్రీ యం. శ్రీమన్నారాయణమూర్తి, శ్రీ రావూరి ప్రసాద్, శ్రీమతి యం.బి.డి. శ్యామల కార్యక్రమంలో పాల్గొని రక్తి కట్టించారు. శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ నిర్వహించారు. వచ్చిన సోదరీ సోదరులు ఆనందించారు. పరిషత్ పాల్గొన్న వారందరినీ సత్కరించింది.