సృష్టికి ముందు నిర్వికల్పమైన దివ్యశక్తి ఉన్నదని పెద్దలన్నారు. ఆ దివ్యశక్తి కదిలింది. అనంతమైన సృష్టి జరిగింది. చిత్రవిచిత్రమైన ప్రకృతి ఆవిర్భవించింది. ఆ సృష్టిలో పర్వతాలు, నదీనదాలు, సముద్రాలు అనేకమైన జీవజాలం సృష్టించబడ్డాయి. జీవ సముదాయం యొక్క అవసరాలు తీర్చటానికి, ఆహారం సమకూర్చటానికి, అనేకమైన వస్తుసముదాయం సృష్టించింది.
జీవరాసులన్నింటిలో త్రిగుణాలు ఉంచింది. అన్ని జీవుల కంటె మిన్నగా మనిషిలో మేథాశక్తి నిచ్చింది. ఆ మేధని వినియోగించి, ఏఏ గుణాలు చేస్తే సుఖశాంతులతో జీనయానం సాగించవచ్చో, మన పూర్వీకులు, మహర్షులు ఏకాగ్రదృష్టితో తపస్సు చేసి, గ్రహించి, మనకు ప్రసాదంగా ఇచ్చారు. అన్ని గుణాలు దివ్యశక్తి సృష్టి అయినా, కొన్ని గుణాలు వినియోగించటం వల్ల కష్టాలు కలుగును. కష్టాలు కలిగించే గుణాలను తీసివేయటానికి ప్రయత్నం చెయ్యాలి. అదే సాధన. సాధనతో ఎంత కష్టమైనదైనా సాధించవచ్చు.
సంసారంలో ఉంటూనే, మంచిపనులు చేస్తూ, పెద్దలమాటలను వింటూ, దైవాన్ని స్మరిస్తూ సాధించవచ్చు. కామ, క్రోధ, మద, మాత్సర్యాలను తీసివేయటం అంత సులభం కాదు. కానీ కష్టమూకాదు. నెమ్మది నెమ్మదిగా వీటిని అంటకుండా ఉండటానికి ప్రయత్నం చెయ్యాలి. పట్టువిడవకుండా ప్రయత్నం చేస్తే అన్ని పటాపంచలయి పోతాయి. అరిటికాయ పచ్చిగా ఉన్నపుడు తొక్క అంటుకొనే ఉంటుంది. పండిన తరువాత తొక్క సులభంగా విడివడుతుంది. అట్లాగే సాధనతో కామ, క్రోధ, మద, మాత్సర్యాలు జీవాత్మకు అంటకుండా వెలువలే ఉండిపోతాయి. కనుక మానవుడు సజ్జన సాంగత్యంతో, సద్గంధ పఠనంతో, సద్గురుసహాయంతో మహనీయుడు కాగలడు. అమ్మ, మన అమ్మ, అనసూయమ్మ నీడలో ఎందరో మహనీయులైనారు. ముందుముందు అమ్మని మనసా వాచా నమ్మి ఆమె నీడలో ఇంకెందరు మహనీయులౌతారో గదా! వేచిచూద్దాం.