(శ్రీ చీర్ల సింహాద్రి)
శ్రీ సింహాద్రిగారు అమ్మను మొదటిసారి 1969లో చూశారు. 1968లోనే సింహాద్రిగారి పెద్దన్నయ్య, అక్కగారు జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మను దర్శించారు. 1969లో వచ్చిన సింహాద్రిగారు 1971 నుండి మాత్రమే తరచుగా జిల్లెళ్ళమూడి రావటం మొదలుపెట్టారు.
అసలు అమ్మను గూర్చి తెలుసుకోవటం విచిత్రంగానే జరిగింది. సింహాద్రిగారు రాష్ట్రీయ స్వయంసేవక సంఘానికి వెళ్ళుతుండేవారు. వారు సంఘంలో కలిసినప్పుడు మాటల సందర్భంలో జిల్లెళ్ళమూడి అమ్మ ప్రసక్తి వచ్చింది. అంగర సూర్యనారాయణగారు అమ్మను గూర్చి అమ్మ వాత్సల్యము, అమ్మలోని మహిమాన్విత వ్యక్తిత్వము, తరతమ భేదం లేకుండా అందరినీ దగ్గరకు తీసే మాతృత్వ లక్షణము, తన బిడ్డలుగా అందరినీ ప్రేమించే గుణము సింహాద్రి గారికి చెప్పారు. ఎవరో ఒక ఆధ్యాత్మిక గురువులే అనుకున్నారు సింహాద్రిగారు. తమ అన్నగారు అమ్మ అక్కగారు వెళ్ళి వచ్చి చెప్పి తర్వాత పోనీ చూద్దాం ఒకసారి వెళ్ళి అనుకున్నారు. కాని వారు చెప్పిన తర్వాత కూడా ఒక సంవత్సరానికిగాని అమ్మను దర్శించలేకపోయారు. అమ్మ చెప్పినట్లు “నేను కనిపిస్తేనే మీరు చూస్తారు. మీరు చూడాలనుకున్నా నేను కనిపించంది చూడలేరు ” అన్నట్లే అమ్మ ఆనాటికి కనిపించింది. అంటే దగ్గరకు తీసుకొన్నది, అదృష్టవంతుడు.
సింహాద్రిగారిది నెల్లూరు. సింహాద్రిగారి తండ్రి సి.ఐ.డి. డిపార్టుమెంట్లో డి.యస్.పి.గా చేశారు. వారికి తొమ్మిది మంది పిల్లలు. ఆరుగురు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. సింహాద్రి అన్నదమ్ములలో మూడవవాడు. 11.9. 1934లో జన్మించారు. తల్లి కృష్ణవేణి, తండ్రి వెంకయ్యనాయుడు. తండ్రికి తరచు బదలీలు జరుగుతుండటం వల్ల సింహాద్రి చదువు మద్రాసు, గూడూరు, నెల్లూరులో పాఠశాల, కాలేజి విద్యలు సాగాయి. సింహాద్రి బి.ఎ. మూడవ సంవత్సరం చదువుతుండగానే తండ్రి చనిపోయారు.
తండ్రి చనిపోతే యిచ్చే సానుభూతి ఉద్యోగం ప్రభుత్వం వారు సింహాద్రికి సి.ఐ.డి. డిపార్టుమెంటులో ఇవ్వగా స్పెషల్ బ్రాంచి అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరాడు. 1957లో ఉద్యోగంలో చేరిన దగ్గర నుండి పదవీ విరమణ చేసే నాటికి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరుగా పదోన్నతిని పొందారు.
1965లో సావిత్రిని వివాహం చేసుకున్నారు. ఆమె కూడా ఉపాధ్యాయినిగా పనిచేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. సింహాద్రిగారికి ఒక కుమార్తె కృష్ణప్రియ, కుమారుడు రాజేశ్ ఇద్దరూ గృహస్థ జీవనం గడుపుతున్నారు. మంచి ఉద్యోగాలలో ఉన్నారు.
సింహాద్రిగారి అన్నదమ్ములంతా విద్యావంతులై లెక్చరర్లుగా, ప్రొఫెసర్లుగా, బాంక్ ఆఫీసర్లుగా పనిచేశారు. నాలుగవ అన్న రామమోహన్ గారు వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో కామర్స్ లెక్చరర్గా పనిచేస్తూ వైరాగ్యంతో రామకృష్ణామిషన్లో చేరాడు. ఆ తర్వాత యత్యాశ్రమం స్వీకరించి చిదానందయోగిగా నామం పొంది హృషీకేశ్లో కొంతకాలం, అన్నారెడ్డిపాలెంలోని రామయోగి ఆశ్రమంలో కొంతకాలం ఉంటూ ఉంటారు. సింహాద్రి కుటుంబంలో ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్నదనటానికి ఇది ఒక నిదర్శనం.
సింహాద్రి జిల్లెళ్ళమూడి వచ్చినా అమ్మతో మాట్లాడటం తప్ప మిగతా సమయం ఎవరైనా పలకరిస్తే తప్ప ఎవరితో పూసుకొని కాలక్షేపం మాటలు మాట్లాడేవాడు కాదు. అమ్మనామం చేస్తూ ఉండటమో, నాదయోగి రాధాకృష్ణరెడ్డి సేవలో ఉండటమో చేసేవాడు. ఎవరైనా అమ్మతో తమ అనుభవాలు చెపితే వింటుండేవాడు ఆసక్తిగా.
హైదరాబాదులో శ్రీ రాజగోపాలాచార్యులగారితో స్నేహం పెరిగిన తర్వాత వారితోనే ఎక్కువ కాలం గడిపేవాడు. అమ్మ జీవితచరిత్రను చారిగారితో కలిసి ఎన్నోసార్లు పారాయణ చేశాడు. అమ్మ జీవితమహోదధిని డి.టి.పి. చేయించటంలోనూ, అమ్మ ఫిలిములు భద్రపరచడంలోనూ చాలా శ్రద్ధ తీసుకున్నాడు. ఏ పనినైనా చాలా శాంతంగా, క్రమశిక్షణతో చేసేవాడు. రాజగోపాలాచార్యులవారికి చాలా అండగా నిలచేవాడు.
ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే తనకు 77 సంవత్సరాలు నిండిన సందర్భంగా అమ్మ వద్దకు వచ్చి అమ్మకు పూజ చేసుకొని హైదరాబాదు వెళ్ళిన 15 రోజులు గడవకుండానే అమ్మలో లీనమైనాడు.
నిరంతరం అమ్మ నామం చేస్తూ, అమ్మ ధ్యాసలో గడిపిన సింహాద్రిగారు ధన్యజీవి. తేది 18.9.2011న అమ్మలో ఐక్యమైనారు.