(గతసంచిక తరువాయి భాగం)
జిల్లెళ్ళమూడి రాంగానే మొదటిసారి ఆరోజే నేను హైమాలయంలో ఉండగా భాస్కరన్నయ్య వచ్చి “అమ్మా! హైమాలయంలో చేస్తుండరాదూ ! ఇంక ఇక్కడే ఉంటావు. కాబట్టి” అన్నాడు. “సరే అన్నయ్యా” అన్నాను. ఆ తర్వాత అనుకోకుండా రమేష్ అన్నయ్య కూడా అడిగాడు. అభిషేకం అయిం తర్వాత అర్చనామూర్తిని మళ్ళీ పూజకు రెడీ చెయ్యటం, రాత్రి పవళింపు సేవ అదీ చేయటం. అలా ఆలయంలో కొద్దిపాటి సేవచేసే అవకాశం మహాద్భాగ్యంగా వచ్చింది.
నేను జిల్లెళ్ళమూడి వచ్చి హైమాలయంలో సేవచేస్తున్నపుడు ఈ మధ్య ఒక one year back జరిగిన అనుభవం. అమ్మ ఒకసారి “నిజంగా, హైమ ఆలయంలో ఉన్నది నిజం” అని “నిజమనే పదము రెండుసార్లు వాడింది. “అది నాకెట్లా తెలుస్తుంది ?” అనుకునేదాన్ని. అందరూ తీర్ధప్రసాదాలు తీసుకొని వెళ్ళిం తర్వాత, కిటికీ తలుపులు వేసి గుడిని శుభ్రపరిచేదాన్ని. ఆ తర్వాత పవళింపుసేవ. ఆ సమయంలో గుళ్ళో నేను తప్ప ఎవ్వరూ ఉండేవాళ్ళు కాదు సామాన్యంగా. సేవ అంతా అయిపోయిం తర్వాత హైమక్కకి పాదనమస్కారం చేసుకొని తాళం వేసేదాన్ని. ఆ టైములో హైమక్కకి పాదనమస్కారం చేసుకుందామని వంగేసరికి విగ్రహమంతా పై నించి క్రిందికి కదిలి పోయింది. నేను ఆ అనుభవాన్ని పొందాను. హైమక్క కదిలింది. ఊరికే కదలినట్లు కాదు ఆపాదమస్తకము ఒక్కసారి కదిలిపోయింది. అమ్మ నాకు హైమక్క అక్కడ ఉంది జాగ్రత్తగా చేయి’ అని చెప్పినట్లు అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ దూరం నుంచే నమస్కారం చేసుకోవటం అలవాటయింది.
అమ్మ, హైమక్క ఇద్దరూ ఆలయాల్లో మనకోసం . సుస్థిరంగా సుప్రతిష్ఠలై ఉన్నారు. అక్కడ సేవ చేసుకోవటం మన భాగ్యం.