1980 లో నేను నా స్నేహితురాలు రాధ అమ్మ వద్దకు వెళ్ళాం. మొదటిసారి మా మేనమామ రామరాజు కృష్ణమూర్తి, మా రాధ మేనమామ డాక్టర్ శిష్ట్లా సుబ్బారావుగారు. మేము వెళ్ళినపుడు వాళ్ళిద్దరూ అమ్మదగ్గరే ఉన్నారు. అమ్మ గదిలోకి వెళ్ళి అమ్మ మంచం ఎదురుగా గోడకానుకొని కూర్చున్నాము. నీ పేరేంటి అని అమ్మ నన్నడిగింది. చెప్పాను ‘గిరిజ’ పెళ్ళయిందికదూ! అంది. అవునన్నాను. అమ్మ నా చెయ్యి పట్టుకుంది. నా చేతిని మెల్లగా నిమిరింది. అమ్మ దగ్గరకెళ్ళితే అందరూ ఏడుస్తారని విన్నాను. కానీ నాక్కూడా అకారణంగా ఆ అనుభవమయింది. కన్నీరు ఆగటం లేదు. దానికి వాళ్ళ నాన్న లేడని దిగులు’ అన్నది. ఆ ఆలోచన నాకుందనే తెలీదు అమ్మ అనేదాకా ? బొద్దుగా ఉండేది బాగా చిక్కింది అన్నది. నేనదే మొదటిసారి రావటం, నన్నెప్పుడు చూసిందో నాకు 5, 6 ఏళ్ళప్పుడు మా మేనత్త కొడుకు నడింపల్లి హరగోపాల్ పెళ్లిలో చూసిందేమో నర్సరావుపేటలో.
“నువ్వు ఇక్కడే ఉండిపో ‘అన్నది’ నాతో. నేను ఇక్కడే ఉంటే మా అమ్మ దిగులు పడుతుంది అన్నాను ఏడుస్తూనే. నేను మీ అమ్మను కానా? అన్నది అమ్మ. నిజానికి నిజంగా అందరికీ అమ్మే అమ్మ అని తెలుసుకోవటానికి చాలకాలమే పట్టింది.