అక్టోబర్ మాసంలో నాన్నగారి శతజయంతి ఉత్సవాలు జరిగినాయి అన్న విషయం మనందరకు -తెలిసిందే. ఎంతో వైభవంగా జరగాలని నిర్వాహకులు సంకల్పించారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. ‘అమ్మ’ ను గురించి ఎన్నో గ్రంథాలు ఆవిష్కరించాలని సంకల్పించి, ఎంతో మంది ప్రముఖులను ఆహ్వానించారు. అతిథులు ఎంతోమంది వచ్చారు. అయితే ఒక సోదరుడు అన్నట్లు అనుకోని అతిథిగా ఓంకారనది కట్టలు తెంచుకుని ఉత్సాహంగా నాన్నగారి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనటానికి ‘అమ్మఒడి’ అయిన ‘అందరింటి’ కి వచ్చింది. అమ్మ బిడ్డలు ఆనందంగా ఆ అతిథిని ఆహ్వానించక పోయినా ‘అమ్మ’ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరపించారు. అంతటి అంతరాయం వచ్చినా కార్యక్రమాలు సక్రమంగా నిర్వహింపచేసినందుకు ‘అమ్మ’ కు కృతజ్ఞతలు చెప్పారు నిర్వాహకులు. ఇదంతా ఒక కోణం అయితే ఆ కార్యక్రమానికి, మరో కోణాన్ని దర్శించారు కొందరు సోదరులు. ఈ వరదల నెపంగా జిల్లెళ్ళమూడిలో తాము అనుకున్నకాలంకంటె ఎక్కువకాలం ఉన్నారట. ఆ రకంగా అమ్మ సన్నిధిలో అమ్మ ప్రేమలో ఓలలాడారట. ఆ రకంగా ‘అమ్మ’ వాళ్ళని దగ్గర ఉంచుకుందట.
నిజమే! అక్షరాల ఇది నిజమే! ఇది అమ్మ నైజమ్, అలా అని ఒక సందర్భంలో ‘అమ్మ’ స్వయంగా ప్రకటించింది.
రామకృష్ణ అన్నయ్య డైరీ ఆధారంగా ఒక సందర్భం వివరిస్తాను.
ఒకసారి అన్నయ్యకు విపరీతమైన నడుమునొప్పి వచ్చింది. ఎటూ కదలలేని తీవ్రమైన నొప్పి. కూర్చోలేక అలాగే అమ్మ మంచం ప్రక్కనే పడుకొంటున్నాడు. అమ్మ అన్నయ్యకు స్థానిక వైద్యం చేయిస్తున్నది. నొప్పి తీవ్రత పై ఎలాంటి ప్రభావం ఉండటంలేదు ఈ వైద్యం వలన. ఇది గమనించిన ‘కాత్యాయని అక్కయ్య’, ‘శాయమ్మగారు’ అమ్మతో “అమ్మా! అన్నయ్య నొప్పి చాలా తీవ్రంగా ఉంటున్నది. ఈ స్థానిక వైద్యం వలన ఎలాంటి లాభం ఉండటం లేదు. బాపట్ల అన్నయ్యను పంపించి కాని లేదా బాపట్లనుండి ఎవరైనా వైద్యుని పిలిపించి కాని అన్నయ్యకు వైద్యం చేయించమ్మా” అని చెప్పారు. దానికి సమాధానంగా అమ్మ.
“నేను కావాలనే వైద్యం ఆలస్యం చేస్తున్నాను. ఈ రకంగానైనా వాడు ఇంటిపట్టున నా కళ్ళెదుటే ఉంటున్నాడు. కాని తగ్గితే మరల సంచి తగిలించుకొని ఊళ్ళమీద పడ్డాడు” అని ప్రకటించింది. ఆ సమాధానం విన్న అక్కయ్యలు విస్తుపోయి ప్రేమకు మన ప్రమాణాలు వేరు. అమ్మ ప్రమాణాలు వేరు – అనుకున్నారు.