ఈ సృష్టిలో ప్రతి జీవి బ్రతకటానికి ఏదో ఒకటి ఆహారముగా తీసుకోవలసిన అవసరము ఉంది. అయితే ఆకలి అయిన సమయానికి, ఏదో దొరికినది తిని, లేదంటే పస్తులతో గడిపే జీవితాలు ఈ ప్రపంచంలో కోటాను కోట్లమంది ఉన్నారు. పట్టెడన్నము కరువై, కష్టాల కడలిలో దోగాడు జీవులకు, శ్రీరస్తు అని శుభమస్తని దీవించేతల్లి, ఆదరణతో కడుపు నిండా భోజనము పెట్టే తల్లి, మాతా అనసూయాదేవిగా ఆ జగజ్జనని ఈ ధరిత్రిపై అవతరించి ఆ పన్నులను కన్నబిడ్డలవలె ఆదరించింది. విశ్వజననిగా వేనోళ్ళ కొనియాడబడుచున్నది. నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు “ఆదరణ”తో పెట్టుకో – అమ్మ సందేశం.
ఈ సృష్టిలో ఏ బాధనైనా భరించవచ్చు గానీ ఆకలి ఏ బాధను భరించడం చాలా కష్టం నాన్నా అని అమ్మే చెప్పింది. ధనవంతుడైనా, బీదవాడైనా ఈ కలిలో ఏదో ఒకసారి ఆ బాధను అనుభవించే ఉంటారు. తన కిష్టమైనది దొరకలేదనో లేక రుచికరముగా లేదనో ఏదో ఒక కారణంతో భోజనం మాని వేస్తుంటారు సహజంగా. ఒక్కోసారి పనిమీద దూరప్రాంతానికి వెళ్ళినప్పుడు, వేరే దేశం వెళ్ళినప్పుడు మనకు కావలసిన ఆహారం దొరక్కపోవచ్చు. అప్పుడు గుర్తుకొస్తుంది, అమ్మ చేతివంటలోని మాధుర్యము, అమృతత్వము అవగాహనకు వస్తుంది. ఆ సందర్భంలో ఆ అసంతృప్తిని ఎలా పంచుకోవాలో, ఎవరితో పంచుకోవాలో అర్థంకాక మనసు మూగవేదనను అనుభవిస్తుంది. అటువంటి అసంతృప్త జీవులకు “అమ్మ” జిల్లెళ్ళమూడిలో అందించే ప్రసాదం వారికున్న వెలితిని పోగొట్టి పరిపూర్ణమైన కృపా కటాక్షములను అందిస్తుంది. అమ్మ ప్రసాదాన్ని ఆరగించి అంతులేని ఆనందాన్ని పొందుతున్నారు.
నేను మీ అమ్మను మీరు నా బిడ్డలు ఈ సృష్టిలో తల్లి లేని వారంటూ లేరు. ఎవ్వరూ అనాధలు కారు అని అమ్మ ప్రవచించింది. ఆ విశ్వ విధాత మళ్ళీ తన బాధ్యతను గుర్తుచేసుకొని, తన కర్తవ్య ధర్మాన్ని పాటించడానికి, అమ్మగా, అన్నపూర్ణేశ్వరిగా, నిత్యాన్నదానేశ్వరిగా, కారుణ్యమూర్తిగా, అర్కపురిలో అవతరించింది. ఒకప్పుడు ఎందరో అభాగ్యులు నిర్భాగ్యుల ఇప్పుడు అందరూ సంపన్నులే. అందరికి అమ్మయై అందరిల్లును, ఆకలిగొన్నవారికి అన్నపూర్ణాలయాన్ని స్థాపించింది.. అందరూ అమ్మ కన్నబిడ్డలే.