1. Home
  2. Articles
  3. Viswajanani
  4. మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీ ప్రారంభోత్సవం

మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీ ప్రారంభోత్సవం

Editorial Board - Viswajanani
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 21
Month : December
Issue Number : 5
Year : 2021

ఆగస్టు 6వ తేది ఉదయం ఉదయం 7 గం. 36 ని.లకు జగన్మాత అయిన అమ్మ జిల్లెళ్ళమూడిలో “మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీ” కి తన దివ్యహస్తములతో ప్రారంభోత్సవం జరిపారు. జిల్లెళ్ళమూడి చరిత్రలో ఇదొక విశిష్ఠ సంఘటన. కళాశాల ప్రారంభోత్సవం తర్వాత మాతృశ్రీ విద్యాపరిషత్ కార్యదర్శి శ్రీ బొడ్డుపల్లి సీతారామశాస్త్రి, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ పన్నాల రాధాకృష్ణశర్మ సకలవిద్యాస్వరూపిణియగు అమ్మకు సరస్వతీపూజ చేసుకున్నారు. విభిన్న ప్రాంతాల నుండి వచ్చిన అనేక సోదరులు ఈ కార్యక్రమాలలో పాల్గొని ఆనందించారు. అమ్మ నూతనంగా నియమితులైన అధ్యాపకులకు నూతన వస్త్రాలను ప్రసాదించి ఆశీర్వదించారు.

ఆనాటి సభలో చీరాల V.R.S.& YRN అర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్, మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయం సిండికేటు సభ్యులునూ అయిన శ్రీ పి. జగదీశ్వరరావు గారు ప్రసంగిస్తూ ఈ ఓరియంటల్ కాలేజీ స్థాపన, తదాశయాలు అపూర్వములూ విశిష్టములూ అయినవనీ, అమ్మ యొక్క అనుగ్రహబలం చేత ఈ కళాశాల అచిరకాలంలో సర్వతోముఖాభివృద్ధి సాధించి సోదర కళాశాలలకు ఆదర్శప్రాయం కాగలదని ఆకాంక్షించారు. ఈ సంస్థయొక్క స్థాపనలో ఎనలేని మనోబలంతో కృషి చేసిన స్వర్గీయ శ్రీ అధరాపురపు శేషగిరిరావుగారి సేవలను కొనియాడారు. తమ అమూల్యమైన సహకారమును అందిస్తూ, అధ్యాపకు లనూ, కళాశాల స్థాపకులనూ అభినందించారు.

ప్రత్యేక సంచికావిష్కరణ

మాతృశ్రీ ప్రాచ్య కళాశాల ప్రారంభ సందర్భమును పురస్కరించుకొని హైదరాబాద్ – సోదరులు శ్రీ ఉపద్రష్ట మధుసూదనరావు, శ్రీ జె.వెంకటరత్నం, శ్రీ టి. యస్. శాస్త్రి, శ్రీ .జి. కె. రావు, డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి,

శ్రీ వి. యమ్. ప్రసాదరావు, శ్రీ సి. వెంకటకృష్ణ, శ్రీ ఎ. మురళీకృష్ణ మొదలగు వారిచే ప్రకటితమైన ప్రత్యేక సంచికను మాననీయులు ఆంధ్ర ప్రభుత్వ పౌరసంబంధ సమాచార శాఖామాత్యులైన శ్రీ అక్కిరాజు వాసుదేవరావు గారు ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం సుమారు 12 గం. 30ని.లకు ఆవిష్కరించారు.

ఆనాటి మహాసభకు వక్తలుగా ఆహూతులయిన పెద్దలకూ, ఇతర సోదరులకూ సంస్కృత భాషలో స్వాగత వచనాలు పల్కుతూ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ రాధాకృష్ణశర్మ గారు విద్యాభ్యాసం ఉదరపోషణ కోసమే పరిమితం కారాదనీ, అది ఐహికాముష్మిక శ్రేయస్సాధనమని గుర్తించాలనీ వివరించారు. జిల్లెళ్ళమూడిలో ఉన్న అమ్మ విశ్వజనని అయినట్లే భారత దేశంలో ప్రభవించి, ప్రవర్థమానమైన అమరభాష భారతీయ సంస్కృతికి మాత్రమేకాక విశ్వ సంస్కృతికే కాణాచి. అమ్మ చెప్పే మాటల్ని దాటి భౌతికాధ్యాత్మికాలకు భేదం లేదు. అవి రెండూ పరస్పరాశ్రయములై ప్రవర్తిల్లేవే. అలాగే వేదంలోగూడ భౌతికాధ్యాత్మికాది విశ్వవిజ్ఞానరాశి అంతా నిగూఢంగా నిక్షిప్తమయి ఉంది. అమ్మ యొక్క దివ్యతత్త్వాన్ని అర్థం చేసుకోవటానికి వేదాలు ఒక సాధనాలు. సర్వసృష్టిలోను ఆ పరాశక్తి స్వరూప సాక్షాత్కారమే సకల విద్యలయొక్క పరమ ప్రయోజనం. ఇటువంటి మధురసంస్కారాన్ని అనుభవంలోనికి తేగలిగిన విద్యావిధానం నేటి విద్యార్థులకు కావాలి. ఇచ్చట సుశిక్షితులైన విద్యార్థులు విద్యాధిదేవతయగు జగజ్జననియొక్క విశ్వవిరాట్స్వరూప సౌందర్యాన్ని వివిధ కోణాలనుండి పరిశీలించి అమ్మ యొక్క దివ్య సందేశాన్ని దిగంతాలకు వ్యాపింపజేయాలి. ఈ విద్యాసంస్థ విశ్వవిజ్ఞాన పరిశోధన కేంద్రమై మాతృశ్రీ విశ్వకళా పరిషత్తుగా రూపొందాలి” అని మాతృశ్రీ విద్యాపరిషత్తు వారి యాశయాలను ఉగ్గడించారు.

మంత్రి శ్రీ వాసుదేవరావుగారు సావనీర్ను ఆవిష్కరిస్తూ, ప్రాచీన సంస్కృతి, ఆధ్యాత్మిక సంపదలను మన సమాజంలో విస్తరింప జేయటంలో ప్రాచ్య కళాశాలలు ప్రముఖ పాత్ర వహించవలసి ఉన్నదనీ, సంస్కృతమును ప్రోత్సహించి విస్త రింప జేయవలసిన బాధ్యత ప్రధానంగా ప్రజలపై ఉన్నదనీ వివరించారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంధ్ర శాఖాధ్యక్షులైన ఆచార్య శ్రీ దివాకర్ల వేంకటావధాని గారు ప్రసంగిస్తూ – సర్వభాషలకూ తల్లి అయిన సంస్కృతం జాతీయభాష కావాలనీ, సంస్కృత భాషా మాధుర్యం దేశంలోని అన్ని కళాశాలలకూ లభ్యం కావలెననీ, మన విద్యార్థులు భారతదేశ ప్రాచీన సంస్కృతినీ, ఔన్నత్యాన్ని తెలిసికోవాలనీ, సంస్కృతం తెలియని విద్యార్థులను విదేశాలకు పంపరాదనీ, విద్యార్థులు విదేశాలలో మన సంస్కృతికి ప్రతినిధులుగా వ్యవహరించవలెనంటే సంస్కృతం అవసరమనీ, భారతీయ సాంస్కృతికాభివృద్ధి దృష్ట్యా తెలుగు, సంస్కృతాలను సమానంగా అభివృద్ధి పరచాలనీ వక్కాణించారు.

“కళాప్రపూర్ణ” శ్రీ తుమ్మల సీతారామమూర్తి చౌదరిగారు ప్రసంగిస్తూ ప్రాచ్య కళాశాలలలో పరిశోధనలు జరపాలనీ, విద్యార్థులలో క్రమశిక్షణ, దేశభక్తి పెంపొందించటం కోసం ఇంకా ఎక్కువగా ఓరియంటల్ కాలేజీలు నెలకొల్ప వలెనని సూచించారు.

పొన్నూరు సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ శ్రీకృష్ణభగవాన్ గారు, విద్యార్థులు ఆదర్శ ప్రవర్తనులు గావలెననీ, భారతీయ సంస్కృతి పరిరక్షణకు బద్ద కంకణులు కావలెననీ, ఇక్కడి అధ్యాపకులు అందులకు కృషి సల్పాలనీ ఉద్బోధించారు. శ్రీ బృందావనం రంగాచార్యులుగారు తమ మధుర కంఠంతో అమ్మ పై తాము వ్రాసిన పద్యాలను చదువుతూ సంస్కృత భాష వైశిష్ట్యాన్ని స్పష్టపఱిచారు.

శ్రీ వీరమాచనేని ప్రసాదరావుగారు ప్రసంగిస్తూ విజ్ఞానంలో అడ్డుగోడలు లేవనీ, తత్సాధనకు సమాజంలో తారతమ్యం ఉండరాదనీ, భౌతికాధ్యాత్మిక విజ్ఞాన నిధులయిన వేదశాస్త్రాల అవగాహన అందరికీ లభ్యం కావలెననీ, సంస్కృతభాష యొక్క అధ్యయనం లోను అధ్యాపనలోను మారుతున్న సమాజావసరాల కనుగుణంగా విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావలె ననీ ఆకాంక్షించారు.

ఉపన్యాసాల అనంతరం శ్రీ “నదీరా”గారు “బుఱ్ఱకథ”గా రచించిన అమ్మ చరిత్రను హైద్రాబాదు సోదరులు సాంబశివరావు అండ్ పార్టీ మధురంగా గానంచేసి శ్రోతలను ఉూతలూగించారు.

మధుర గంభీర మందస్మిత సుందర వదనార విందమైన అమ్మ ఆద్యంతమూ వేదికపై ఆసీనయైయుండి ప్రసన్న వీక్షణాలతో తిలకిస్తుండగా ఆంధ్రభూమి న్యూస్ ఎడిటర్ శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావుగారు సభా కార్యక్రమాలను నిర్వహించారు.

భారత రాష్ట్రపతి శ్రీ వి. వి. గిరి, రాష్ట్ర గవర్నరు శ్రీ ఖండూభాయ్ దేశాయ్, మాజీ రాష్ట్రపతి డా.ఎస్. రాధాకృష్ణన్, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మనంద రెడ్డి, స్వామీ ప్రజ్ఞానానంద, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సంస్కృత శాఖాధ్యక్షులు శ్రీ వేలూరి సుబ్బారావుగారు, ఆంధ్రశాఖలో లింగ్విస్టిక్స్ రీడర్ డా. తూమాటి దొణప్ప, కవిశేఖర గురుజాడ రాఘవశర్మ మొదలగు వారు శుభాకాంక్షలందజేస్తూ సందేశాలు పంపారు. .

సభాప్రారంభంలో మంత్రి శ్రీ వాసుదేవరావుగారు, శ్రీ పర్సా దుర్గాప్రసాదరావుగారు, శ్రీ కంచినేపల్లి చిన వెంకటరామారావుగారు సకుటుంబముగా “అమ్మ”కు పూజ చేసుకున్నారు.

ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఇండియన్ ఎక్స్ ప్రెస్, హిందూ, దక్కన్ క్రానికల్ మొదలగు ప్రఖ్యాత పత్రికా ప్రతినిధులు విచ్చేశారు. మాతృశ్రీ విద్యా పరిషత్ పక్షాన చేయబడిన వందన సమర్పణతో కార్యక్రమం విజయవంతంగా సమాప్తమైంది.

– (1971, ఆగష్టు మాతృశ్రీ సంచిక నుండి)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!