1. Home
  2. Articles
  3. Viswajanani
  4. [మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీ విద్యార్థుల కార్యక్రమాలు

[మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీ విద్యార్థుల కార్యక్రమాలు

V S R Moorty, Bhattiprolu Lakshmi Suguna, L. Mrudula
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 12
Month : October
Issue Number : 3
Year : 2012

విద్యార్ధులకు “పెన్నుల” బహూకరణం. 

ఆగష్టు 25వ తేదీన చెరుకూరు గ్రామానికి చెందిన శ్రీ నీలి నాగేంద్రంగారు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, సంస్కృత పాఠశాల విద్యార్థులకు 250 పెన్నులు బహూకరించారు. విద్యార్ధినీ విద్యార్థుల విద్యాభివృద్ధిని ప్రోత్సహిస్తూ, మంచి మనస్సుతో శ్రీ నాగేంద్రగారు చేసిన ఈ వితరణం ఎంతైనా ప్రశంసనీయం. వారిపై అమ్మ కరుణ అనంతంగా వర్షించాలని మాతృశ్రీ విద్యాపరిషత్ నిండు మనస్సుతో ఆకాంక్షిస్తోంది.

మాతృభాషా దినోత్సవం

ఆగష్టు 28వ తేదీన కళాశాలలో మాతృభాషా దినోత్సవం ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. సుబ్రహ్మణ్యేశ్వర శాస్త్రిగారి అధ్యక్షతలో జరిగింది. ఈ సభలో ఆంధ్రోపన్యాసకులు డాక్టర్ శ్రీ కె.వి. కోటయ్యగారు మాతృభాషా సారస్వతాల విశిష్టతను వివరిస్తూ, నన్నయ్య మంచి నేటి వరకు సాగుతున్న తెలుగు సాహిత్య ప్రస్థానాన్ని సమీక్షిస్తూ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకున్నది. సంస్కృతోపన్యాసకురాలు శ్రీమతి ఎల్. మృదులగాకు స్వాగత వచనాలు పలుకగా, సంస్కృత అధ్యాపకులు శ్రీ రవితేజగారు వందన సమర్పణ చేశారు.

శ్రీ టి.వి.సోమయాజులు గారి వీడ్కోలు సన్మాన మహోత్సవం

ఆగష్టు 31వ తేదీ ఉదయం 10 గంటలకు కళాశాల. సంస్కృత శాఖాధ్యక్షులు శ్రీ టి.వి. సోమయాజులు గారి పదవీ విరమణ సందర్భంగా వీడ్కోలు సన్మానసభ జరిగింది. సభాధ్యక్షులు, శ్రీ విశ్వజననీ పరిషత్ అధ్యక్షులు శ్రీ ఎం. దినకర్ గారు, మాతృశ్రీ విద్యాపరిషత్ అభివృద్ధి సంఘాధ్యక్షులు శ్రీ బి. రామబ్రహ్మంగారు, మాతృశ్రీ విద్యాపరిషత్ కరస్పాండెంట్ శ్రీ సి. యస్. ఆర్. ఆంజనేయ ప్రసాద్ గారు, ఎస్.వి.జె.పి. ప్యాట్రన్ శ్రీ బి. రవీంద్రరావు గారు, పరిషత్తు సభ్యులు, అధ్యాపకులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ప్రిన్సిపాల్ అందరూ శ్రీ సోమయాజులు గారి నిబద్ధతను, క్రమశిక్షణను, పాఠ్యప్రవచన నైపుణ్యాన్ని కీర్తించారు. శ్రీ సోమయాజుల దంపతులకు శ్రీ విశ్వజననీ పరిషత్ శేషవస్త్రాలను బహూకరించగా, కళాశాల, పాఠశాల, అధ్యాపక, అధ్యాపకేతర బృందం నూతన వస్త్రాలతో సత్కరించింది. విద్యార్థులు పూల దండలతో, నూతన వస్త్రాలతో, కానుకలతో సన్మానం చేశారు.

తమకు జరిగిన సత్కారానికి శ్రీ సోమయాజులు గారు. సముచిత రీతిలో కృతజ్ఞతలు తెలిపారు..

– డా||బి.యల్.సుగుణ

 

ఉపాధ్యాయ దినోత్సవం

సెప్టెంబరు 5వ తేది ఉం. 10 గంటలకు కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవం” వేడుకలు జరిగాయి. విద్యార్థిని విద్యార్థులు  కళాశాల, పాఠశాల అధ్యాపకులకు కానుకలు విద్యార్ధులు సమర్పించి, గురువందనం చేశారు. శ్రీ విశ్వజననీ పరిషత్  అధ్యక్షులు శ్రీ ఎం. దినకర్ గారు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. ఎస్. శాస్త్రిగారు, ఆంధ్రోపన్యాసకులు డాక్టర్ కె.వి. కోటయ్యగారు ఉపాధ్యాయ దినోత్సవ ప్రాశస్త్యాన్ని వివరించారు.

సంస్కృతపాఠశాల ప్రధానాచార్యులు శ్రీ కె. ప్రేమకుమార్ గారు సభను ఆసక్తికరంగా నిర్వహించారు.

 విద్యార్ధి గణపతి మహోత్సవాలు

సెప్టెంబర్ 19వ తేదీ వినాయక చవితినాడు ప్రారంభమై, విద్యార్ధి గణపతి త్రిరాత్రమహోత్సవాలు అమ్మ సన్నిధిలో ఆహ్లాదకరంగా జరిగాయి. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, పాఠశాల విద్యార్థులు ఈ మూడురోజులూ ఉదయసంధ్యల్లో గణపతిని శ్రద్ధాభక్తులతో అర్చించుకున్నారు.

19వ తేదీ సాయంత్రం 4 గంటలకు శ్రీ టి.వి. సోమయాజులుగారు “శ్యమంతకోపాఖ్యానం” ప్రవచనం చేశారు. వార్డెన్స్ శ్రీ మురళిగారిని, శ్రీమతి యస్.నాగమణిగారిని విద్యార్థులు సన్మానించారు.

20వ తేది ఉదయం 10 గంటలకు విజయవాడ వాస్తవ్యులు శ్రీ మెట్టా వెంకటేశ్వరరావుగారు “నాటక సాహిత్యం” పై సోదాహరణ ప్రసంగం చేశారు. నాటక ఆవిర్భావం, బలిజేపల్లివారి హరిశ్చంద్ర నాటక విశేషాలను శ్రీ మెట్టావారు ఎలుగెత్తి చాటారు.

21 వ తేదీ ఉదయం 10 గంటలకు “ఆది కవి నన్నయ రచనలో శకుంతల కథావృత్తాంతం” ఆధారంగా ఎన్నో వాఙ్మయ విశేషాలను డాక్టర్ యు. వరలక్ష్మి గారు హృద్యంగా వివరించారు.

ఈ మూడు రోజులూ సాయంత్రం వేళల్లో విద్యార్థులు భక్తిగీతాలతో, నాటికలతో గణపతికి వినోదం కల్పించారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు సమాధికోత్సాహంతో పాల్గొన్నారు.

21వ తేది రాత్రి గణపతి సన్నిధిలో సంకీర్తనం చేసి, 22వ తేదీ ఉదయం ఊరేగింపు నిర్వహించారు. 22వ తేదీ ఉదయం 11 గంటలకు గణపతిని ఓంకారనదిలో నిమజ్జనం చేశాడు.

కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, వార్డెన్స్, పూర్వ విద్యార్థి డాక్టర్ జయంతి చక్రవర్తి ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. కరస్పాండెంట్ శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయ ప్రసాద్ గారు విద్యార్థులకు చక్కని సూచనలు చేశారు. శ్రీ విశ్వజననీ పరిషత్ ఈ సందర్భంగా విద్యార్థి బృందానికి సంపూర్ణ సహకారం అందించింది.

 – శ్రీమతి ఎల్.మృదుల

 

జిల్లెళ్ళమూడిలో శ్రీ వి.యస్.ఆర్ మూర్తి

శ్రీ వి. యస్. ఆర్ మూర్తి గారు సుప్రసిద్ధ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, ఈ నెల 18, 19, 20 తేదీలలో జిల్లెళ్ళమూడిలో గడపటం ముదావహము. 18వ తేదీ మార్చకీ ఓరియంటల్ కళాశాలలో విద్యార్థులకు శ్రీ విఘ్నేశ్వర ప్రాశస్త్యమును గూర్చి, 19వ తేదీ శ్రీ విద్యానిలయములో అమ్మ దివ్య అవతార విశేషములను గూర్చి, 20 వ తేదీ శ్రీ త్రిపురా “రహస్యము” గూర్చి ప్రసంగించి అందరినీ ముగ్ధులను గావించారు. విద్యార్థులు, సోదరులు అడిగిన సందేహాలు తీర్చారు. “అమ్మ” చెప్పిన సూక్తులు నేటి ప్రపంచమునకు అత్యంత ఆవశ్యకమైనవనీ అమ్మ ప్రారంభించిన అన్నవితరణ మొదలగు విశేష కార్యక్రమాలు నేడు అంతటా వ్యాపిస్తున్నాయని శ్రీ సత్యసాయిబాబా వారు నుడివినట్లు శ్రీ. మూర్తిగారు తెలియచేశారు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!