1. Home
  2. Articles
  3. Viswajanani
  4. మాతృ ‘శ్రీమంతురాలు’ జిల్లెళ్ళమూడి అమ్మస్మృతిలో..

మాతృ ‘శ్రీమంతురాలు’ జిల్లెళ్ళమూడి అమ్మస్మృతిలో..

Jandhyala Sarath Babu
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 21
Month : October
Issue Number : 3
Year : 2021

మాత అంటే భాగ్యదాత లక్ష్మి యోగప్రదాయక పార్వతి. విద్యాబుద్ధుల సరస్వతి, భోజనదాయిని అన్నపూర్ణతో పాటు సనాతని, సర్వమంగళ అనీ వివిధ ‘అర్థాలున్నాయి. ‘శ్రీ’ పదానికి వృద్ధి, శోభ, కీర్తి, కాంతి, దీప్తి, ప్రతిభ, శుభ, ప్రసిద్ధి, వనితా రత్నమంటూ మరెన్నో తాత్పర్యాలు. వీటన్నింటినీ మించి శక్తి సంపన్నగా ‘మాతృశ్రీ’ నిత్య ఆరాధనీయ. ఆ మాతాతత్త్వమే జగతికి సత్యధర్మ శాంతి ప్రేమ ప్రబోధకమనేవారు జిల్లెళ్లమూడి అమ్మ. అనుదిన పఠనానికి వీలుగా మంత్రోపదేశం కోరిన ఒక వృద్ధురాలికి మంత్రం కాదు కానీ, ఓ సూత్రం చెబుతా. ఇంట్లోని వారినైనా, నీ ఇంటికి వచ్చిన వారితోనైనా సమానంగా వ్యవహరించు. చదవడం, చెప్పడం కాకుండా ఆచరించి మరీ చూపించు’ అని ముందడుగు వేయించారు. సరిగ్గా ఆ సమానత్వమే అమ్మ అందరింటిలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎవరు ఎప్పుడు వెళ్లినా, మొదట ఆదరించి అన్నం పెడతారు. వారూ వీరనే తేడాలుండవు. ఉన్నవారు, లేనివారన్న అంతరాలు మచ్చుకైనా కనిపించవు. అసలు ఆ ప్రాంతమే అన్నపూర్ణాలయం. సుమారు ఆరున్నర దశాబ్దాలుగా ప్రతిరోజూ భోజన వడ్డన, నిరంతర సమాదరణ. జీవనయానంలో ఏం చెప్పారో, ఆమె అదే చేశారు. చేసినంత మేరా కరుణామృత ధారలే. చల్లని చూపు, చక్కని నవ్వు ఎందరెందరి హృదయ మందిరాల్లోనో పండువెన్నెలలు కురిపించాయి. మూడున్నర దశాబ్దాల కిందట ఒకరోజున కడసారిగా ఆమె దర్శనం! తలచిన ప్రతి ఒక్కరికి కడసారిగా ఆమె దర్శనం! తలచిన ప్రతి ఒక్కరి గుండె బరువెక్కుతుంది. ‘అమ్మా, అమ్మా’ అంటూ పసిబిడ్డలా ఇప్పటికీ రోదిస్తూనే ఉంటుంది. ‘నిన్ను వీడి వెళ్లగలనా నేను? నీ మనసంతా నిండి ఉన్నది నేను కానూ?’ అన్నట్లనిపించి, కొత్త ధైర్యం గూడు కట్టుకుంటుంది. అమ్మ కాకుంటే ఇంకెవరు మనకు తోడూ నీడా!!

తెలుగునాట జిల్లెళ్లమూడి పేరు తెలియని వారుండరు. ఆ అమ్మ గుర్తుకొచ్చి రెండుచేతులూ జోడించని వ్యక్తి కనిపించరు. ఎందుకంటే, ఎవరి కళ్లు చెమ్మగిల్లినా ఊరడించింది మాతృశ్రీనే! నాలుగక్షరాల ‘అనసూయ’ తన అసలు పేరు. స్వస్థలం అదే గుంటూరు జిల్లాలోని మన్నవ. వివాహానంతర జీవితమంతా బాపట్లకు సమీపంలో ఉన్న జిల్లెళ్లమూడి గ్రామంలోనే, తనదైన దీవెనతో మొట్టమొదట విద్యాపరిషత్ రూపొందింది. ఆ రోజునే ఓరియంటల్ కళాశాల ఆరంభోత్సవం. సంస్కృత విద్యాసంస్థలూ విస్తరించాయి. వైద్య కేంద్రమూ అక్కడే ఏర్పాటైంది. పిల్లల్లో ఏ ఒక్కరికి కష్టమొచ్చినా అప్పటికప్పుడే పసిగట్టేది జనని కదా. ప్రతిచోటా తానే ఉండటం ఎలా అనుకున్నాడేమో భగవానుడు. అందుకే ఆ లోకం నుంచి ఈ లోకానికి అమ్మగా వచ్చాడు అనుకుంటూ ఉంటారు. ప్రసిద్ధు లనేకులు ఆ అన్నపూర్ణ కోసమే అప్పట్లో ఆ కుగ్రామానికి బారులు తీరారు. ప్రసిద్ధులు కానివారూ లక్షల సంఖ్యలో అన్నపూర్ణ నిలయం ముంగిట వరసకట్టారు. ఎంతెంత ఘనచరిత అయినా పూర్తి కాలం చిరునామా జనయిత్రే కాబట్టి సర్వులూ అట చేరాల్సిందే. ఆ జీవిత మహోదధి తరంగాల వారికి కాక మరెవరికి కనిపిస్తాయి చెప్పండి?

కేవలం వందలమంది ఉంటుండే పల్లెటూరు విశ్వఖ్యాతి గడించిందంటే అదంతా అమ్మమహిమే. వేదసారమంతా తనలోనే నిండి ఉందని ప్రతివారికీ అనిపించక మానదు.

తపస్వి, యశస్వి, సమదర్శి

‘శ్రీ’లో ‘శ’ కార, ‘ర’కార, ‘ఈ’కారాలున్నాయి. ఈ మూడూ పరమానంద, మహాజ్ఞాన, అపారశక్తి సూచికలు. అంతా నేనేనని ప్రవచించే మాతృశ్రీలో అమృతత్వం నిండిన కారణంగానే, అసూయాది భావనలకు ఎక్కడా. చోటన్నదే లేనందునే శ్రీ అనసూయ అయ్యారు. ఆ అమ్మనే సదా తలచినవారికి శక్తియుక్తులు వాటికి అవే సమకూరతాయి. తలపు అంటే నామస్మరణే. అఖండ నామస్మరణ కార్యక్రమ మది. అమ్మ స్మరణా ప్రక్రియ మొదలై ఇప్పటికే అర్ధశతాబ్ది దాటింది. నేను నేనైన నేను అంటూ ఆమె పలికింది మహావాక్యం. ధ్యానే ధ్యానం అనేది విశేష వచనం. ఈ అన్నిటినీ మించినటువంటిది ‘అనుకున్నది జరగదు – తనకున్నది తప్పదు’ అన్నది. అవి నా భావ సంబంధం అని ఇంకో సందర్భంలో ప్రకటించి అవి నా – భావ సంబంధమనే పదానికి సరికొత్త అర్థ తాత్పర్యమిచ్చారు. ఏది మాట్లాడినా సంపూర్ణ అర్ధవంతం, పరమభావ గాంభీర్యం. తృప్తి చెందటమే ముక్తి పొందడం అనే మాటల్లోనూ తత్వ రహస్యం పుష్కలం. 

‘ఎవరిని చూసినా బిడ్డగానే అనిపిస్తుంది’ అని తెలిపిన జిల్లెళ్లమూడి అమ్మ విశ్వజనని. ఆమె మూర్తీభవించిన ప్రేమదేవత. ఆత్మ స్వరూపాన్ని సమగ్రంగా అవగతం చేసుకున్నందునే ‘మీరు కానిది. నేను ఏదీ కాదు’ అని ఏనాడో ప్రకటించారు. విశ్వజననీ పరిషత్తు సంస్థను 1971 ప్రాంతంలో ఆరంభించారు. సకలజన హితకర ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ. ముందే ఉండేవారు. అందరూ కలిసి భోజనాలు చేసేలా, 1958 ఆగష్టు 15న శ్రీకారం చుట్టారు. ఏ పని చేపట్టినా అతిలోక మాతృత్వమే వ్యక్తమవుతుండేది. అన్నపూర్ణ మందిరంలో ఉన్న గాడి పొయ్యిని గుండె సమంగా పరిగణించేవారు. పిడికెడు బియ్యంతో ఎంతైనా చేయవచ్చని తన భావం, అనుభవం. ప్రతివారు నిత్యమూ వండుకునే గిన్నెనుంచి కొంత తీసి ఉంచాలి. ఎప్పుడూ పరిశ్రమించడమే తప్ప విశ్రాంతి అనేది తెలియదు. కష్ట సుఖాలను సమంగా చూడటమే మొదటినుంచీ అలవాటు. పాతికేళ్ల వయసైనా రాకుండానే తిరిగిరాని లోకాలకు మరలివెళ్లిన తనయురాలి పేరిట హైమాలయం నిర్మింప జేశారు. ‘ఇచ్చే అమ్మనే కానీ తీసుకునే అమ్మను కానని’ మరో సందర్భంలో ఒక చలనచిత్ర అభినేత్రికి బదులిచ్చారు.

అన్నపూర్ణా ! వందనమమ్మా!

భక్తికి, ప్రేమకు తేడాలంటూ ఉండవు. లీన మవడమే వీటి ప్రధాన ధర్మం. దైవం, భక్తి వశంకరుడైనట్లే, దైవ స్వాభావికత ప్రేమాభిమానాల వశం. ఆరాధనంటూ నెలకొంటే చాలు. ప్రత్యేకించి పూజా పునస్కారాలేవీ అక్కర్లేదు. ప్రతిభా సామర్థ్యాల ప్రదర్శనలూ అవసరం లేదు. భగవానుడు అన్ని రూపాలూ కలవాడు కాబట్టి రూపరహితుడని, అన్ని పేర్లూ ఆయనవే కనుక నామ రహితుడనీ విశదపరిచారు. దైవ రూపంగా భావించి తరించిన ఆరాధకుల్లో ఒకరి ప్రకారం – నన్ను గాలి వాటున పెట్టి, నీవు కొసను చేతను పట్టి /మబ్బు చాటున నుండి నవ్వుతుంటావు, గాలివాలున వచ్చి తాకుతుంటావు. / కనులు మూసుకుంటే ఎదుట నిలుచుంటావు, రెప్ప విచ్చుకుంటే శూన్యమై ఉంటావు /ఎంత కాలమమ్మా నాతో ఈ ఆటలు, ఎందుకమ్మా నీకీ దోబూచులు’. మీరంతా నేనే, మీదంతా నేనే అని తెలియజెప్పిన సర్వాత్మ భావుకురాలికి ఇదొక కైమోడ్పు, ఏది జరిగినా దైవం చేశాడనుకోవడమే సుఖానికి మార్గమని అంటుండే వారు.

తిథులకన్నా విధులు ప్రధానమని సందర్భాను సారంగా తేటతెల్లం చేస్తుండేవారు. జీవిత పరమార్ధ సాధనను ఆచరించి చూపిన జిల్లెళ్లమూడి అమ్మ… అందరికీ అన్నం పెట్టి సమాదరించిన అన్నపూర్ణగానే కాక మాతృత్వ మధురిమలను భక్త నిఖిలానికీ ప్రసాదించిన అమ్మపూర్ణగా అనుదిన వందనీయురాలు.

(12, జూలై 2021 జాగృతి పత్రిక సౌజన్యంతో)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!