కరుణశ్రీ జయంతి మహోత్సవం : ఆగష్టు 4వ తేదీ జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రాంగణంలో కరుణశ్రీ జయంతి మహోత్సవం జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.యల్. సుగుణగారు అధ్యక్షత వహించారు. కళాశాల కరస్పాండెంట్ పురుషోత్తమ పుత్రభార్గవ శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్ గారు ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ప్రధానవక్త శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తిగారు కరుణశ్రీ పద్యాలలోని శబ్దార్థాల సౌందర్యాన్ని, మాధుర్యంతో నిండిన ప్రసాద గుణరీతులను దేశభక్తి, మానవీయ విలువలు, సుకుమారమైన భావపరంపరను వివరించారు. భాగవత పద్యాల కంఠస్థపు పోటీలలో గెలుపొందిన మనీషా (II P.D.C), వెంకటాచారి (II B.A.), నాగలక్ష్మి (II PDC) నందకిషోర్ (I B.A.)లకు బహుమతులు అందించి అభినందించారు. డాక్టర్.వి.పావని
క్విజ్ పోటీలు: 69వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రాంగణంలో ఆగష్టు 13వ తేదీన కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు క్విజ్ పోటీలు జరిగాయి. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.యల్.సుగుణగారి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ పెద్దలు శ్రీ ఎమ్. దినకర్ గారు ముఖ్యఅతిధిగా పాల్గొని తమ సందేశం అందంచారు. పోటీపరీక్షలు ఎదుర్కోవడానికి ఇలాంటి కార్యక్రమాలు తరచుగా జరగాలని ఆయన హితవు పలికారు.
అధ్యాపకులు ఈ పోటీకి సంబంధించిన వివిధ అంశాలు నిర్వహించారు. పదకొండు బృందాలు ఉన్న ఈ పోటీలో జి.వెంకటచారి బృందానికి ప్రథమస్థానం, ఎమ్. సతీష్ బృందానికి ద్వితీయస్థానం, సుబ్రహ్మణ్యం బృందానికి తృతీయస్థానం లభించాయి.
– డాక్టర్ అన్నదానం హనుమత్ప్రసాద్
విద్యార్థులతో ప్రత్యేక సమావేశం : ఉభయ పరిషత్తుల అధ్యక్షులు శ్రీ బొప్పూడి రామబ్రహ్మంగారు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు 5.8.2015 ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంస్కృతోపన్యాసకులు డాక్టర్ ఎ. సుధామవంశీ పర్యవేక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో రామబ్రహ్మం అన్నయ్య మాట్లాడుతూ విద్యార్థులు ఉజ్జ్వల భవిష్యత్తు కోసం ప్రణాళికాబద్ధంగా అధ్యయనం చేయాలని హితవు పలికారు.
వివిధ ఉద్యోగవకాశాలను, వాటికోసం జరిగే పోటీపరీక్షల వివరాలను ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు సత్ప్రవర్తన, క్రమశిక్షణలతో తమ విద్యాభ్యాసం కొనసాగిస్తూ కళాశాల, పాఠశాల కీర్తిప్రతిష్ఠలను ఇనుమడింప జేయాలని హితవు పలికారు. అమ్మ ప్రబోధించిన సందేశాన్ని మనస్సులో నిలుపుకొని మిగిలిన వారికి ఆదర్శం కావాలని, అమ్మ సిద్ధాంతాలను ఆచరించి మిగిలిన వారితో ఆచరింప జేయాలని వివరించారు.
– ఎల్. మృదుల