1985 ఫిభ్రవరి నెలలో అమ్మ ఆవరణలోని అందరి ఇళ్ళకు, విద్యార్థుల గదులకూ వచ్చింది. అప్పటి నుండి అమ్మ ఆగమనోత్సవాన్ని విద్యార్థులు నిర్వహిస్తూ ఉన్నారు. 20-2-2014 గురువారం విద్యార్థినుల వసతి గృహంలో అమ్మ ‘ఆగమనోత్సవం’ వైభవంగా జరిగింది.
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రాంగణంలోని బాలుర వసతి గృహమందు 21-2-2014 శుక్రవారము శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు అన్నయ్యగారి చేతుల మీదుగా అమ్మ ఆగమనోత్సవ కార్యక్రమము ప్రారంభమై కన్నుల పండుగగా జరిగింది. అమ్మ చిత్రపటానికి పరిషత్ పెద్దలు పూలమాలలు వేశారు. బాలురు లలితా సహస్రనామ స్తోత్రపారాయణ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన “బహుమతి ప్రదానోత్సవ సభ”లో ముఖ్య అతిథులుగా సోదరులు శ్రీ యమ్. దినకర్గారు, శ్రీ యస్. మోహనకృష్ణ గారు, శ్రీ వై.వి. శ్రీరామ్మూర్తిగారు, శ్రీ యన్, లక్ష్మణరావు గారు, కళాశాల ప్రిన్సిపల్ డా. బి.యల్. సుగుణగారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కె. ప్రేమకుమార్ గారు పాల్గొన్నారు. అధ్యాపకులు, ఉపాధ్యాయులు ఈ సభలో పాల్గొన్నారు.
ముందుగా శ్రీ దినకర్ గారు మాట్లాడుతూ విద్యార్థులు ఉత్తమ వ్యక్తిత్వం పెంపొందించుకోవటం వల్ల ఉత్తమ పౌరులు అవుతారనీ, సంస్కార సౌరభం ద్వారా రాణించగలుగుతారనీ మార్గదర్శక సూత్రాలను తెలియజేశారు. సుప్రభాతం, సంధ్యావందనం మొదలైన కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా క్రమశిక్షణ, మంచివిద్య అలవడతాయని విద్యార్థులకు శ్రీమోహనకృష్ణగారు సూచించారు. శ్రీశ్రీరామ్మూర్తిగారు మాట్లాడుతూ అమ్మ సంస్థలో విద్యను అభ్యసించటం అదృష్టమన్నారు. “అమ్మ ఆగమనోత్సవ” కార్యక్రమాలు ప్రణాళికాబద్ధంగా ఉన్నాయని లక్ష్మణరావుగారు అభినందించారు. కళాశాల ప్రిన్సిపల్ డా॥ బి.యల్. సుగుణగారు మాట్లాడుతూ మాతృశ్రీ విద్యాసంస్థలలో పని చేయడం అదృష్టమైతే ఇక్కడ చదువుకోవడం ఇంకా గొప్ప అదృష్టం అని అమ్మ మాటలను గుర్తు చేశారు. శ్రీ ప్రేమకుమార్ గారు మాట్లాడుతూ నేను కూడా ఇక్కడ విద్యార్థినైతే బాగుండేదని తమ భావాలను పంచుకున్నారు.
మాతృశ్రీ విద్యాసంస్థలలో చదివి తాత్కాలిక అధ్యాపకునిగా పని చేస్తూ అమ్మ అనుగ్రహంతో గ్రేడ్ 1 పండిట్గా ప్రభుత్వ ఉద్యోగం సాధించిన శ్రీ ఎ. రవితేజను సభలోని పెద్దలు అభినందించారు.
ఈ సభలో ఫైనల్ బి.ఎ తెలుగు విద్యార్థులు టి. జగదీష్, హరితలు అమ్మ సాన్నిధ్యంలో చదువుకునే భాగ్యం కలగడం తమ అదృష్టమనీ మాతృశ్రీ విద్యాపరిషత్, శ్రీ విశ్వజననీ పరిషత్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతర కార్యక్రమంగా నాన్నగారి ఆరాధనోత్సవ సందర్భంగా జరిగిన ఆటలు పోటీలలోని విజేతలకు బహుమతి ప్రధానం జరిగింది. ఈ బహుమతులు శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు గారి సౌజన్యంతో ఇవ్వడం జరిగింది. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమాన్ని శ్రీ టి. మురళీధరరావు గారు నిర్వహించారు. సభాకార్యక్రమాన్ని శ్రీ కె. ఫణిశర్మగారు, వందన సమర్పణ శ్రీ ఎ. రవితేజగారు నిర్వహించగా, విద్యార్థినీ విద్యార్థుల హర్షధ్వానాల మధ్య సభ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. శాంతిమంత్రం తో సభ ముగిసింది.