ఆగష్టు 12వ తేది సోమవారం సాయంత్రం 6-30 ని.లకు గుంటూరు బృందావన్ గార్డెన్సు శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల పూర్వవిద్యార్థులు కొందరు ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత పాఠశాలల తెలుగు వాచకాలలోని పద్య, గేయ, వచన కవితలను “తెలుగు వెలుగులు” అనే పేరుతో ఆడియో సి.డి.గా రూపొందించి, విడుదల చేశారు.
కళాశాల పూర్వవిద్యార్థులు శ్రీ శేషాద్రి, శ్రీ డి. గణపతిరావు, శ్రీమతి డాక్టర్ ఎం.బి.డి. శ్యామల ఈ సి.డి.లో పాటలు, పద్యాలు, గేయాలు, కవితలు శ్రావ్యంగా ఆలపించి, విద్యార్థుల సౌకర్యం కోసం భద్రపరిచి అందించారు.
శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి అధ్యక్షతలో జరిగిన ఈ ఆవిష్కరణ మహోత్సంలో శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ సభాప్రారంభకులుగా పాల్గొని, విద్యార్థులను ఆశీర్వదించారు. ఉన్నతపాఠశాలల ప్రాంతీయ సంయుక్త సంచాలకులు శ్రీమతి పార్వతి, జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ డి.ఆంజనేయులు, పండిత పరిషత్ అధ్యక్షులు శ్రీ రావెల బుర్రియ్య ప్రభృతులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.
శ్రీమతి పార్వతి (స్కూల్స్ RJD) సి.డి.ని ఆవిష్కరించి, అందరిలో మాతృభాషాధ్యయనం పట్ల ఆసక్తిని కలిగించే సి.డి.ని రూపొందించిన విద్యార్థులను ప్రశంసించారు.
ఎందరో తెలుగు అధ్యాపకులు, అధికార, అనధికార ప్రముఖులు, సాహితీవేత్తలు పాల్గొన్న ఈ సభలో విద్యార్థులు ఈ సి.డి.ని. ‘అమ్మ’కు అంకితం చేశారు. విద్యతో పాటు వివేకాన్ని, సంస్కారాన్ని, వివిధ కళారంగాలలో ప్రావీణ్యాన్ని అమ్మ తమకు ప్రసాదించిందని, ఈ సి.డి.ని రూపొందించాలన్న ఆలోచన, రూపొందించే శక్తియుక్తులు అమ్మ కరుణవల్లనే తమకు లభించాయని సవినయంగా ప్రకటించారు. కృతజ్ఞతా పూర్వకంగా అమ్మకు నమస్కరిస్తూ ఈ సి.డి.ని అమ్మకే అంకితం చేస్తున్నామని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.
ఆదర్శప్రాయమైన తీరులో తమ విద్యను సార్థకం చేసుకున్న మాతృశ్రీ కళాశాల పూర్వవిద్యార్థులను ‘విశ్వజనని’
అభినందిస్తోంది.