నాన్నగారి ఆరాధన రోజున (17-2-2013)న విశాఖ ‘అమ్మ’ మందిరంలో వైభవంగా ధాన్యాభిషేకం జరిగింది. ఉదయం 10 గంటల నుండి అమ్మకు ఏకవార రుద్రాభిషేకము, అనంతరం ‘అమ్మ’ ‘నాన్న’ గార్లకు ధాన్యము తోను మరియు బియ్యముతోను వేరు వేరుగా మధ్యాహ్నం 12-30 వరకు అభిషేకం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 60 మంది ‘అమ్మ’ బిడ్డలు పాల్గొన్నారు. కార్యక్రమములో చివరిభాగమున అమ్మ నాన్నగార్లకు పులిహోర, దధ్యోదనం, రవ్వకేసరి నివేదించి అందరకూ ప్రసాదంగా ఇవ్వబడినది.
ఈ కార్యక్రమములో ‘అమ్మ’ చూపిన విశేషమేమి టంటే కరీంనగర్ జిల్లా కాటారం ఎస్.బి.హెచ్, మేనేజరు
శ్రీ ఎన్. విద్యాచరణ్ ప్రదీప్ శ్రీమతి నాగవల్లి పాల్గొనటం వీరు కాటారం నుండి విశాఖ రావటం జరిగింది. చి. నాగవల్లి అందరింటిలోని వారికి చిరపరిచితులైన గరుడాద్రి గోపాల్ కుమార్తె. కాని ఈ మధ్యనే శ్రీచక్రవర్తి గారి కుమారుడు రాధాకృష్ణ గారు ఏర్పాటు చేసిన Google Vizag Map లో అమ్మను గూర్చి తెలుసుకొని అందరికంటే ముందుగా అక్కడకు చేరుకొన్నారు. నాగవల్లి అమ్మే తనకు నామకరణం చేసిందని ‘అమ్మ’ ఒడిలో ఆడుకొన్నానని తన విశేషాలను సంతోషంగా అందరితో పంచుకొన్నది. ఈ కార్యక్రమానికి ‘అమ్మ’ బిడ్డలందరూ తమ తమ సహకారము నందించి జయప్రదం గావించారు.