శ్రీ ఎ.యస్.చక్రవర్తి, శ్రీమతి కుసుమాచక్రవర్తి వ్రాసిన ‘అమ్మతో క్షణక్షణం అనుక్షణం” గ్రంధాన్ని కుర్తాళం జగద్గురువులు శ్రీ సిద్ధేశ్వరానందభారతీస్వామివారు 24.8.11న విశాఖ లలితాపీఠంలో ఆవిష్కరించారు. స్వామి అమ్మతో తమ అనుభూతిని వివరించి, రచయితలు చిరకాలంగా అమ్మను ఆరాధిస్తూ అమ్మ ఉనికిని నిరంతరం అనుభవిస్తూ తరిస్తున్నారని ఆశీర్వదించారు.
సభాధ్యక్షులుగా ‘ప్రజాస్పందన’ సంస్థ స్థాపకులు శ్రీ సి.యస్. రావుగారు, ముఖ్య అతిథిగా ఆంధ్రాయూనివర్శిటీ రిటైర్డ్ రెక్టార్ ప్రొఫెసర్ శ్రీ ఎ.ప్రసన్నకుమార్ గారు, ఆత్మీయ అతిథి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీయన్. శ్రీనివాసరావుగారు అమ్మతో తమ అనుబంధాన్ని తలచారు. గ్రంథంలోని విశేషాలను ఆర్షవిద్యావిభూషణ శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తిగారు మనోహరంగా వివరించారు. మాతృశ్రీ ఓరియంటల్ కాలేజి పూర్వవిద్యార్థి ప్రస్తుత పాలకొండ కాలేజి సంస్కృత అధ్యాపకుడు శ్రీ బౌరోతు శంకరరావు అమ్మవద్ద తాను అనుభవించిన ప్రేమను వివరించారు. సుప్రసిద్ధ గాయకుడు శ్రీ బాటా రామారావు గారు స్వామివారి పద్యాలు మధురంగా పాడారు.
శ్రీ చక్రవర్తి, శ్రీమతి కుసుమాచక్రవర్తులను సముచితరీతిని జిల్లెళ్ళమూడి సంస్థవారు, శ్రీ లలితాపీఠం వారు సత్కరించారు. చక్రవర్తి దంపతులు తగు రీతిలో స్పందించారు. శ్రీ వాడరేవు సుబ్బారావు వందన సమర్పణ చేశారు. విశ్వజనని సంపాదకులు శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ సమర్థవంతంగా సబ నిర్వహణ చేశారు.