ఆధ్యాత్మికతలోని మాధుర్యాన్ని బిడ్డల ఆకలి తీర్చే తల్లిగా, సులువైన తేలికపాటి మాటలతో తత్వబోధ చేసే విశ్వజనని జిల్లెళ్ళమూడి అమ్మ స్త్రీమూర్తిగా భువిపై అవతరించిన బ్రహ్మజ్ఞాని అని ప్రముఖ తాత్వికులు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీత గెంటేల వెంకటరమణ అన్నారు. విశ్వజనని జిల్లెళ్ళమూడి అమ్మవారి (బ్రహ్మాండం అనసూయాదేవి) శతజయంత్యుత్సవాలు బాపట్ల జిల్లా జిల్లెళ్ళమూడిలో మంగళవారం శ్రీవిశ్వజననీ పరిషత్ ట్రస్టు ఆధ్వర్యంలో.. వైభవంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో విశిష్ట అతిధిగా తత్వదర్శి, ధర్మప్రచారకులు గెంటేల వెంకటరమణ – వసంతలక్ష్మి శ్రీ గురు దంపతులు పాల్గొన్నారు. స్త్రీమూర్తిగా భువిపై అవతరించిన విశ్వజనని జిల్లెళ్ళమూడి నాటి కాలంలో సమాజంలో వేళ్ళూనుకున్న మూఢాచారాలను, చాదస్తాలను వ్యతిరేకిస్తూ ప్రేమ మూర్తిగా అందరి హృదయాలలో అమ్మగా నిలిచిపోయారన్నారు. విశ్వమంతటా వ్యాపించిన మహా చైతన్యమే ప్రతి ఒక్కరిని నడిపిస్తుందని, అన్ని నేనులు నేనైన నేను అంటూ నేను అనే పరమతత్వాన్ని భక్తులకు అందించారన్నారు.
విధి వర్షం లాంటిది అంటూ అది కొందరికి సంతోషాన్ని, మరికొందరికి దుఃఖాన్ని ఇస్తుందని, పొంగు క్రుంగు అనే వాటిని ఏవిధంగా స్వీకరించాలో విశదపర్చిన బ్రహ్మజ్ఞానిగా అమ్మ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందించిన జ్ఞానంతో తరించిన వారు అసంఖ్యాకులుగా ఉన్నారని శ్లాఘించారు. తిధులు, నక్షత్రాలు విధిని మార్చలేవని, పెట్టింది. ముహూర్తం కాదని, జరిగింది ముహూర్తమని అమ్మచేసిన బోధ ఎప్పటికీ చిరస్మరణీయమని అన్నారు.
(28-3-23 ‘వార్త’ పత్రిక సౌజన్యంతో)