1. Home
  2. Articles
  3. Viswajanani
  4. విశ్వజనని – నా జనని

విశ్వజనని – నా జనని

Polapragada RaajyaLakshmi
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 21
Month : May
Issue Number : 10
Year : 2021

మేము 1966లో బాపట్ల వచ్చాం. మావారు Arts College English Lecturer పనిచేశారు. జిల్లెళ్ళమూడి అమ్మను గురించి తెలిసి ఎప్పుడెప్పుడు వెళ్ళిచూద్దామా అని నాలో ఎంతో ఉత్సాహం కలిగేది. మావారు, నేను సాహిత్యపరంగా కథలు, నవలలు వ్రాసేవాళ్లం. దానితో జిల్లెళ్ళమూడి వెళ్ళటం కుదిరేదికాదు. ఒకరోజు ఆమె పుట్టినరోజు అని తెలిసింది. మా స్నేహితులు కూడా వస్తామన్నారు.అందరం కలిసి కారులో జిల్లెళ్ళమూడి వెళ్ళాము. వెడుతూ రెండు మూరల మల్లెమాల తీసుకువెళ్ళాము అమ్మకు సమర్పిద్దాం – అని.

అమ్మ కళకళలాడుతున్నది. జనం క్రిక్కిరిసి ఉన్నారు. గజమాలల నడుమ శ్రీమహాలక్ష్మిలా ఉన్నది, చూడగానే మనస్సు ఆనందప్రవుల్లమైంది. మేము దూరంనుంచే అమ్మకు నమస్కరించుకున్నాం. అందరూ ఆమెను స్తుతిస్తూ పాటలు పాడుతున్నారు. ఈ మాల తీసుకువెళ్ళి అమ్మ పాదాలచెంత ఉంచాలని ఉబలాటం. ఇందరిని తప్పించుకుని వెళ్ళటం సాధ్యమా? అనుకున్నా. అంతలో ఒక ముత్తైదువ వచ్చి “అమ్మా! ఆ దండ ఇలా ఇవ్వండి. అమ్మ పాదాలమీద పెడతాను అన్నది. ‘చాలా సంతోషం’ అని ఇచ్చాను. ఆమె ఆ మాలను తీసుకువెళ్ళి అమ్మ పాదాల చెంత పెట్టింది. దానితో నాకు .మహదానందం కలిగింది.

గంటన్నర తర్వాత ‘ఇక బయలుదేరి వెడదాం’ అనుకున్నాం. అంతలో ఇందాకటి ఆమెవచ్చి “మీరు భోజనం చేసి వెళ్ళండి. అమ్మ అందరినీ భోజనం చేసి వెళ్ళమని చెబుతుంది” అన్నది. ‘అమ్మ పాదాలకు నమస్కరించుకోవటం వీలుకాలేదు, భోజనం చేయటమా, మానాటము అంటే, ఆమె ‘రండి. నేను తీసుకు వెడతాను’ అని తీసుకువెళ్ళింది. భోజనం చేసి ‘బయలుదేరుదాం’ అని ఇవతలకి వచ్చేసరికి ఒక అమ్మాయి పళ్ళెంనిండా పువ్వులు పెట్టుకుని మాకు ఎదురువచ్చింది. ‘అమ్మా! ఇవి అమ్మకి పూజ చేసిన పూలు. మీరు తీసుకోండి’ అన్నది. వెంటనే కొంగుపట్టాను. ఆ పూలన్నీ నా కొంగులో పోసింది. ఇది శుభసూచకం, అమ్మ ఆశీస్సులు అందాయి అని ఆనందపడుతూ ఇంటికి వచ్చాం.

వాటిని ఏర్చికూర్చి మాలకట్టి తిరుపతి వెంకటరమణమూర్తి అలివేలుమంగమ్మ ఫొటోకి వేశాను. మావారు అన్నారు, “అదేమిటి? అమ్మకి పూజచేసినవి దేవుడికి వేస్తున్నావు?” అని.

“అమ్మకూడా దేవతే. అంతమంది వచ్చి నమస్కరించుకుని వెడుతున్నారు. ఆమెలో గొప్పతనమే ఇంతమంది రప్పించింది. ఆమెను దర్శించుకున్నవారంతా శుభాలుపొంది మళ్ళీ మళ్ళీ దర్శించుకుని నమస్కరించు కోవాలని వస్తున్నారు. ఆమె ఏమీ ఆశించటం లేదు. ఏదన్నా అడిగితే నవ్వుతూ సమాధానం ఇస్తుంది. అటువంటి ఆమెకు పూజచేసిన పూలు దైవానికి సమర్పించబడినవి అని దేవునికి వేశాను. నా మనస్సుకి తృప్తిగా ఉంది” అన్నాను.

మా ఇంటికి వచ్చే వారంతా అమ్మను. దర్శించుకుని అమ్మను గురించి చెప్పిన మాటలు నాకు ఎంతో తృప్తినిచ్చేవి. శ్రీ నేదునూరి కృష్ణమూర్తిగారు. సంగీత విద్వాంసులు. వారు మా అమ్మగారి మేనమామ కొడుకు. “నేను అమ్మను చూడటానికి వచ్చాను; మిమ్మల్ని కూడా చూసి వెడదామని ఇలా వచ్చాను” అన్నారు. వారు జిల్లెళ్ళమూడి వెళ్ళి ఒకరోజు అక్కడే ఉండి, తిరుగు ప్రయాణంలో మా ఇంటికి వచ్చి ఆ విశేషాలన్నీ చెప్పారు.

బాల్యంలో నా 12వ ఏట మా అమ్మ పోయింది. అమ్మను చూస్తూంటే మా అమ్మను చూసినట్లే కడుపునిండి పోయేది. ‘అమ్మా!’ అని ఆమెను పిలుచుకుంటూంటే ఆమెలో మా అమ్మను చూసుకునేదాన్ని. ‘అమ్మ’లో సరస్వతిని చూసేదాన్ని, లక్ష్మిని చూసేదాన్ని.

 శ్రీ లక్ష్మణయతీంద్రులు గొప్పకవి, గురుకులంలో ఉండేవారు, వారు మా వారికి చాలా ఆత్మీయులు. ఒకరోజు పదిమంది విద్యార్థుల్ని తీసుకుని సాయంకాలం 6 గం. లకు వచ్చారు మా ఇంటికి. వారి కుటుంబం అంతా విద్వాంసులే. శిష్యులతోసహా అమ్మను దర్శించుకుని తిరుగుప్రయాణంలో మా ఇంటికి వచ్చారు. అంటే అది వారిలోనూ, అమ్మలోనూ ఉన్న గొప్పతనం. వారికి అతిధి సత్కారాలు చేసుకున్నాం. ఆ రోజు రాత్రి 8 గం.లకు మా ఇంట్లో వేదపఠనం జరిగింది. తర్వాత యతీంద్రులవారు ‘అమ్మ’ను గురించి ఉపన్యసించారు.

అలా అమ్మను దర్శింప వచ్చేవారు మా ఇంటికి వచ్చిపోతూ ఉండేవారు. ‘అమ్మ’ని అమ్మగా మా అమ్మగా ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటాను.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!