శ్రీమూర్తి పేరుతో విశ్వజనని పత్రికకకు శ్రీ ఆర్.వి.కె. మూర్తిగారు చిరపరిచితులు. 50 సంవత్సరాల బట్టి జిల్లెళ్ళమూడి అమ్మని దర్శించుకుంటున్న శ్రీ ఆర్.వి.కె. మూర్తిగారు రాచర్ల లక్ష్మీనారాయణ గారి అన్నగారు. ఆర్.వి.కె.మూర్తిగారు చాలా సహనశీలి. శాంత స్వభావులు వారు కోపంతో వుండగా చూసినవారు దాదాపు లేరు.
అమ్మకు ఆర్.వి.కె. మూర్తిగారి విరాళమంటే చాలా ఇష్టం. ఆయన ప్రతి నెల రూ. 116/- లు అమ్మకు విరాళంగా పంపించేవారు. ఒక నెల పంపటం మరిచిపోతే అమ్మ కలలో కనపడి “డబ్బు పంపలేదేం నాన్నా!” అందిట. ఆది పరాశక్తి అయిన అమ్మ అడిగి ఆయన నుండి విరాళం స్వీకరించిందంటే అమ్మకు ఆయన మీద ఎంత ప్రేమ!
మద్రాసు గెస్ట్ హౌస్ భవన నిర్మాణంలో మొదటి అంతస్తు వేద్దామనుకున్నప్పుడు “ఎవరు శంకుస్థాపన చేస్తే బావుంటుంద”ని ఆలోచించి, ఆలోచించి, శ్రీ ఆర్.వి.కె. మూర్తిగారిని అడిగాము. ఆయన వెంటనే అంగీకరించారు. ఆ భవన నిర్మాణం చాలా చక్కగా ఆఘమేఘాల మీద పూర్తి అయింది. ఈ రోజుకి కూడా అమ్మబిడ్డలు ఆ గెస్ట్ హౌస్ మొదటి అంతస్తులో వుండటానికి చాలా ఇష్టపడతారు. మూర్తిగారి కుటుంబసభ్యులు భవన నిర్మాణానికి రూ. 25,000/- విరాళంగా ఆ రోజుల్లో సమర్పించారు. మూర్తిగారి అల్లుడు శ్రీ చంగవల్లి వెంకట్ గారు EMRI కి Chief Executive Officer గా పనిచేసి, దేశ విదేశాల్లో ఖ్యాతి గడించిన వారు. తమాషా ఏమిటంటే మూర్తిగారు శంకుస్థాపన చేసిన గెస్ట్ హౌస్ మొదటి అంతస్తు ప్రారంభోత్సవం చేసింది వారి అల్లుడు శ్రీ వెంకట్గారు. శ్రీమూర్తిగారు విశ్వజననిలోనే కాక రాజమండ్రి నుండి వెలువడే శ్రీరామభక్తిసుధలో కూడా అమ్మ గురించి వ్యాసాలు రాసేవారు.
మూర్తిగారు 5.1.2012నాడు అమ్మలో లీనమయ్యారు. అయితే వారి సేవాకార్యక్రమాలు అంతటితో అంతం కాలేదు. జిల్లెళ్ళమూడిలో సోలార్ జనరేటర్ ని పెడుతున్నారని తెలిసి వారి కుమారుడు బద్రి, కుమార్తె శ్రీమతి పద్మ వారి తల్లిదండ్రుల స్మృత్యర్థం చెరొక రూ. 25,000/- విరాళాన్ని సమర్పించారు. మరొక రూ.25,000/- విరాళాన్ని పంపిస్తామని తెలియచేశారు. దానితో పాటు మూర్తిగారి తిధినాడు అన్నపూర్ణాలయ మహానివేదన ఏర్పాటు చేశారు. మూర్తిగారు పిల్లల కిచ్చిన అసలు సిసలైన ఆస్తి అమ్మ భక్తి = సేవాభావం. అమ్మ మూర్తిగారికి పరిపూర్ణమైన ఆత్మశాంతిని, వారి కుటుంబ సభ్యులకు మనశ్శాంతిని ప్రసాదించాలని అమ్మని మనసారా ప్రార్థిస్తున్నాము.