జిల్లెళ్ళమూడిలో శ్రీ హైమవతీదేవి 70వ జయంతి ఉత్సవాలు డిసెంబరు 5వ తేదీ బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ‘అందరింటి ఆవరణ’లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు శ్రీ లలితాకోటి నామపారాయణ జరిగింది. ఈ పారాయణలో స్థానికులు విద్యార్థినీ విద్యార్థులతో పాటు చుట్టుపక్కల గ్రామాలనుంచి విశేషంగా భక్తులు విచ్చేశారు. ముఖ్యంగా గుంటూరు నగరం నుంచి 180 మంది ప్రత్యేకంగా బస్సులలో రావటం విశేషం. శ్రీ కట్టమూరి వెంకటేశ్వరరావుగారు గుంటూరు బృందానికి సారధ్యం వహించారు. లలితాకోటినామపారాయణ దిగ్విజయంగా సకాలంలో పూర్తికావటానికి శ్రీయుత హనుమబాబు గారు, శ్రీ టి.టి. అప్పారావుగారు, శ్రీధర్మసూరి గారు, శ్రీ చక్కా శ్రీమన్నారాయణగారు. అలాగే కళాశాల పాఠవాల అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు ఎంతో కృషి చేసారు.
హైమవతీదేవి 70వ జయంతి సందర్భంగా శ్రీ హైమాలయంలో ఉదయం మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిగింది. దీనితో పాటు ఈ సంవత్సరం శ్రీ జోన్నాభట్ల వారి కుటుంబం లక్షగాజుల పూజ హైమవతీదేవి ఆలయంలో ఎంతో విశేషంగా జరుపబడింది. గ్రామంలోని వారు ఎంతోమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా శ్రీ అమ్మనామాన్ని మండలం రోజుల పాటు సంకీర్తన చేసిన బృంద సభ్యులందరికీ శ్రీ విశ్వజననీపరిషత్వారు నూతన వస్త్రాలతో సత్కరించారు. సుమారు రెండువేల మంది ఈ జయంతి ఉత్సవాలలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.