అర్కపురము అంటే జిల్లెళ్ళమూడి. అర్కము అంటే జిల్లేడు. అర్కుడు అంటే సూర్యుడు. అర్కుని యొక్క పురము కనుక జిల్లెళ్ళమూడి అని అంటున్నారు తెలుగులో. అర్కుడే దేవుడు కదా! ప్రత్యక్షదైవంగా లోకం కొలుస్తుంటుంది కదా! మరి ఇంకా అర్కపురంలో దేవాలయాలేంటండి ? అనుకోవచ్చు. యుద్ధాలలో చనిపోయిన వాళ్ళంతా సూర్యమండలంలోంచే పై లోకాలకు వెళ్ళుతారట. ఒకప్పుడు జిల్లెళ్ళమూడిలో దారి పొడుగునా జిల్లేడు చెట్లే కనిపించేవి. ఇప్పుడంతగా కనిపించటం లేదులెండి.
ఆ సూర్యచంద్రులే అమ్మకు రెండు కళ్ళు. ఎక్కడైనా చంద్రవంకలు చూడవచ్చు. ఇక్కడ పూర్ణచంద్రుని దర్శిస్తారు. ఇక్కడ మాతృసూర్యుని గుండా వెళ్ళేవాళ్ళకు ఆ విజ్ఞానకాంతి చైతన్యంలో లీనం కావటం తేలిక.
సూర్యుడు లోకానికి ఆహారాన్నిచ్చి పోషిస్తున్నాడు. ఆయన వెలుగు లేకపోతే ఏ పంటలు పండవు. ఒక చెట్టులోనే కాదు జీవులలో సైతం చైతన్యం ఉండదు. మనం సామాన్యంగా అనుకొనే అచేతనాలు అంటే కొండలు, గుట్టలు, చెట్లు, పుట్టలు, నదులు అన్నీ చేతనమైనవే అనుకొండి. అయితే మనం అంతగా గుర్తించలేం – సరే అది అలా ఉంచుదాం.
సూర్యుడు లోకానికి ఆహారాన్ని యిచ్చి పోషిస్తున్నాడు. మన అమ్మ కూడా సృష్టిని చరాచర జీవరాశిని తన బిడ్డలు గానే భావించి ఆహారాన్నిచ్చి పోషించటానికే తగిన ఏర్పాటు చేసింది. పైగా దానిని అన్నపూర్ణాలయం అన్నది. అది జగన్నాధరథమన్నది, దానిని మాతృయజ్ఞం అన్నది. ఆ ఆలయంలో ఆదరంగా సేవించటం, భోజనం చేయటం కూడా పూజే నన్నది. మీకు పూజ చేసుకొని ఆ తర్వాత భోంచేస్తామమ్మా! అంటే ముందు అక్కడ చేసి రండి ఆ తర్వాత ఇక్కడ చేసుకోవచ్చు అనేది. మాకు ఆకలిగా లేదమ్మా! అంటే ఆకలి ఉన్నంతవరకే ఆ ప్రసాదం తినిరండి అనేది. అంటే నీవు దేనికోసం పూజ చేస్తున్నావో దాని ఫలితం ముందే ప్రసాదిస్తున్నదన్నమాట. జిల్లెళ్ళమూడి రావటం వృధా కాదు. ఇక్కడకు రావటమే పొందటం అన్నది.
అన్నపూర్ణాలయమే కాక ఇంకా విద్యాలయము, వైద్యాలయము, ఆదరణాలయము, హైమాలయము, అనసూయేశ్వరాలయము వంటివి ఏర్పాటు చేసింది. విద్యాలయం అంటే మామూలు చదువు మాత్రమే చెప్పేది కాదు. లౌకికమైన ఆ చదువుతో పాటు జీవితానికి కావలసిన వివిధ విద్యలూ నేర్పి ఒక పరిపూర్ణ మానవునిగా తగిన తర్ఫీదు నిచ్చి లోకంలోకి ఒక ఆదర్శ పౌరునిగా పంపటం ధ్యేయం. ప్రహ్లాదుడు తండ్రితో చెపుతూ
“చదివించిరి నను గురువులు,
చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నే
చదివినవి కలవు పెక్కులు
చదువులలో సారమెల్ల చదివితి తండ్రీ!” అంటాడు. అంటే అసలు చదువవలసిన సారం నేర్పటం గురువుల కర్తవ్యం. అమ్మ జగద్గురువు. అలా చేయటం జిల్లెళ్ళమూడిలో నేర్పాలనే ధ్యేయంతో జిల్లెళ్ళమూడిలో సంస్కృత విద్యాలయాలను అమ్మ ఏర్పాటు చేసింది. తరువాతి కాలంలో వేదవిద్యాలయం కూడా ఏర్పాటు చేయబడ్డది.
అలాగే ఆదరణాలయం. ఏదైనా ఆదరణగా చేయాలనేది అమ్మ ఆశయం. దిక్కూ మొక్కూలేని అనాథలు, బాగా బ్రతికి చితికిపోయినవారు, ధనమున్నా ఆదరించేవారు లేని తల్లిదండ్రులు, కుంటివారు, గ్రుడ్డివారు వారికి సేవచేస్తూ వారికి అండగా ఉండాలనేది అమ్మ భావన. అమ్మ అలాంటి వారినందరిని ప్రేమగా లాలించింది పాలించింది. అందువల్లే ఆ ఆలయాల అధిదేవతై వెలసింది.
అయితే అమ్మ ఆలయంలో చేరినతర్వాత జరగవలసినంత సువ్యవస్థితంగా జరగటానికి కావలసిన వనరులు, సేవకులు లభించినందువల్ల కొంతవరకు మాత్రమే జరుగుతున్నది. దేనికైనా దాని సమయం దానికి వస్తుంది. అమ్మ ఏర్పాటు చేసినవి మూడు పూలూ ఆరు కాయలుగా వర్థిల్ల గలవనే విశ్వాసం.
ఇక వైద్యాలయం. ఒక్క అందరింటి వారికే కాక, గ్రామస్థులకు, యాతాయాత యాత్రికులకు జనానికి కావలసిన ఆరోగ్య భాగ్యాన్ని అందించటం ధ్యేయం. దాదాపు యాభై సంవత్సరాలుగా నడుస్తున్న యీ ఆలయం కూడా స్వయంసమృద్ధిగా, సర్వాంగ సుందరంగా, సర్వకాల సర్వావస్థలలోనూ సేవలందించే సువ్యవస్థితంగా ఉన్నదని గట్టిగా చెప్పలేం గాని చాలావరకు గ్రామస్తుల అవసరాలు తీరుస్తూ అవసరమైన సమయాలలో తగిన వైద్యసహాయానికి సంస్థ (వ్యాన్) వాహనంలో తాలూకా జిల్లా కేంద్రాలకు తీసుకొని వెళ్ళుతూ ఉన్నది. ఇది కూడా ఇంకా ముందు ముందు పరిపూర్ణత సాధించవలసి ఉన్నది.
ఇక దేవాలయాల వద్దకు వద్దాం. దేవతలకు, దేవుళ్ళకు స్థానం అని అర్థం. అమ్మను నీవు దేవతవు నీకు మాకు పోలికేమిటమ్మా అంటే, మీరు కానిది నేనేదీ కాదు. మీరంతా దేవతలే – మీరు నా అవయవాలు అని అన్నది. నిజమే కాని ఆ విషయం అమ్మకు తెలుసు మనకు తెలియదు. తెలియదు అంటే అనుభవంలో లేదు. అందుకే మన కన్నా భిన్నంగా దేవుడు లేడని చెపుతూ దేవులాడినా దొరకని వాడు అన్నది. ఎలా దొరుకుతాడు మనల్ని మనం చూచుకోగలగాలి కదా! అందుకే అమ్మ నాతో నేనే ఆడుకుంటున్నాను అన్నది.
మనం ప్రస్తుతానికి వద్దాం. మనసు లయమయ్యే చోటు ఆలయం అన్నది. సర్వత్రా ప్రవహించే కాలవలో నీరు త్రాగాలంటే రేవు కావాలి కదా! సర్వత్రా ఉన్నదేవుని గుర్తించటానికి మనకు మనం ఏర్పాటు చేసుకొన్న ఆలయమే దేవాలయం. అక్కడ ఏర్పాటు చేసుకొన్న ఒక గుర్తుకు (నామ, రూప, గుణరహితమైన చైతన్యానికి) మనకిష్టమైన రూపం ఇచ్చి పెట్టుకుంటున్నాం. అమ్మ చరిత్ర చదువుతుంటే కొన్నివందల మందికి వారి వారి ఇష్టదైవాలుగా కనిపించే తృప్తిపరిచింది.
మనది భిన్నమైన విశిష్టమైన అదృష్టం. అమ్మలోని అతిమానుషశక్తిని దైవం అనుకున్నాం. అమ్మను ఆలయంలో ఆ రూపం ఏర్పాటు చేసుకొన్నాం మనకు చేతనైన రీతిలో. భౌతికంగా ఉన్న రోజులలో మనల్ని కరుణించినదానికన్నా మీదు మిక్కిలిగా “ఈ శరీరం లేనప్పుడే ఇంకా ఎక్కువగా ఉపయోగపడతానని” కాపాడుతున్నది, మనల్ని నడిపిస్తున్నది. దాదాపు ఇప్పటికి 60 ఏళ్ళ క్రితమే తన అర్థపురుషేశ్వరీ తత్వానికి ఏర్పాటు చేసుకొన్న ఆలయంలో నాన్నగార్ని ముందు చేర్చి, తనూ చేరింది. మనం ప్రతిష్ఠించే దేముంది “ఆశక్తి అక్కడ ఉండాలని భావిస్తే అక్కడ వచ్చి ఉంటుంది” అన్నది. అలా ఆ ఆలయంలో చేరింది. ఆలయ ప్రతిష్ఠ జరిగి కూడా మూడున్నర దశాబ్దాలయింది.
ఆ ఏర్పాటుకు ముందరే హైమాలయాన్ని ఏర్పాటు చేసింది అమ్మ. అందరూ తన అవయవాలే అన్నప్పుడు, తను సర్వబ్రహ్మాండ సృష్టికారిణిని అన్నపుడు, మీ సాధన, తపస్సులతో ప్రమేయంలేదు. నా అనుగ్రహమే అన్నపుడు హైమను దేవతను చేయటంలో ఆశ్చర్యమేమున్నది? నేనే కన్నాను, నేనే పెంచాను, నేనే లయం చేశాను, నేనే దేవతను చేశాను అన్నపుడు సృష్టి, స్థితి, లయాలు చేసే దేవుళ్ళు చేసే పనులు తానే చేశానన్నప్పుడు హైమను దేవతను చేయడంలో ఆశ్చర్యం ఏమున్నది? ఏ ఊరివారో వచ్చి మా వూళ్ళో విగ్రహప్రతిష్ఠ చేయాలని ఉందమ్మా. చాలా కష్టంగా ఉన్నది అంటే నీ గుండెలోనే గుడి కట్టుకో నాన్నా! అక్కడ కట్టలేకపోతేయేం? అన్న అమ్మ ఇన్ని ఆలయాలు నిర్మింప చేసింది. దేవుని కటాక్షం లభించాలంటే, మనస్సు ఆ దేవతపై నిలవాలంటే దేవాలయం అవసరం కదా! రూపం లేని చైతన్యాన్ని ఆరాధించటం అందరికీ చేతకాదు కదా! తను, మన, ధనాలతో ఈ రూపారాధన అలవాటయితే, మనస్సును, ధ్యాసను భగవంతునిలో లగ్నం చేసి సర్వాంతర్యామిని ఎఱిగి నీవు కూడా అదే స్థితికి వెళ్ళగలుగుతావు.
ఆ మధ్య జరిగే ప్రక్రియకు దేవాలయాలు అవసరం. అందుకే దేవాలయాలకు పంపి అమ్మ మనకు ఆరాధన విధానాన్ని, మనస్సు లగ్నమయ్యే నామ సంకీర్తనను, అఖండజ్యోతిలో రూపరహితమైన ఒక కాంతిని చూచే ఏర్పాటు చేసింది.
కృతయుగంలో తపస్సే ప్రధానం. త్రేతాయుగంలో కూడా వాల్మీకంలో కూడా ఎక్కడా దేవాలయాల ప్రసక్తి లేదు. కాకపోతే తపస్సుతో పాటు యాగాలు, జపాల ప్రసక్తి కనిపిస్తున్నది. ఇంద్రజిత్తు నికుంభిలాయాగం, రాముని పట్టాభిషేకం రేపు జరుగబోతుందనగా రాత్రి సీతారాములు నారాయణ మంత్ర జపం చేసినట్లున్నది. కాకపోతే తర్వాత వచ్చిన పద్మపురాణంలో శ్రీరాముడు రామేశ్వరంలో శివుని ప్రతిష్ఠించినట్లు చెప్పబడింది. ద్వాపరయుగం వచ్చేటప్పటికి రుక్మిణీదేవిని పెళ్ళికి ముందు కులదేవత దర్శనానికి, ఆరాధనకు అమ్మవారి ఆలయానికి పంపినట్లున్నది. శ్రీకృష్ణుడు అక్కడకు వచ్చి రుక్మిణీదేవిని రథంమీద తీసుకెళ్ళాడు. ఎటొచ్చీ కలియుగంలోనే ఈ దేవాలయాలు కనిపిస్తున్నవి. శ్రీకృష్ణుని మనమడు ప్రజనాభుడు బృందావనంలో నాలుగు దేవాలయాలు కట్టించాడని చూపిస్తుంటారు.
అమ్మ ఏ సంప్రదాయాన్నీ కాదనలేదు. దానిలోని లోపాలను సరిదిద్దింది. అవసరమైన చోట సరియైన అర్థం చెప్పి మనల్ని నడిపించింది. పండితులు, తలలు పట్టుకొని వాదించుకునే శాస్త్రాన్ని తేలికమాటలతో చదువుకోని వారికీ, అర్హతలేదనే స్త్రీలకు కూడా చెప్పి వేదాంతం ఇంత తేలికా అనిపించే రీతిలో అవగాహన కలిగించింది. ఆలయాలు జీవికి అంతిమ లక్ష్యాన్ని చేరుకోవటానికి ప్రాథమిక మైన సోపానాలే అయినా సామాన్యులకు, అసామాన్యులకు కూడా అవసరమే. అమ్మ ఆ పనే చేసి చూపించింది. ఆ బాటలో నడవ మన్నది. మానవసేవ లోనే, భాగవతసేవ చూపించి తరింప చేస్తున్నది.