శ్రీ యమ్. చంద్రశేఖరరావు గారు మచిలీపట్టణం వాస్తవ్యులు. Block Development Officer (B.D.O)గా LD.O)గా పనిచేశారు. సో॥ శ్రీ O.V.G. సుబ్రహ్మణ్యంగారి బావ మరిది ఆజన్మ బ్రహ్మచారి అంటే సర్వకాల సర్వావస్థలలో తన ఉచ్ఛ్వాస నిశ్వాసలలో బ్రహ్మ అయిన అమ్మనే నిలుపుకున్న ఆరాధనా రూపం. అమ్మ వాక్యాల్ని శ్రుతిసారాలుగా గుర్తెరిగి ఆచరణలో పెట్టిన అనుష్ఠాన వేదాంతి.
నేను మచిలీ పట్టణంలో హిందూ కాలేజీలో పి.డి. గా పనిచేస్తున్న రోజులలో చంద్రశేఖరరావు అన్నయ్య గారింట్లో అమ్మ పూజలు నిర్వహించే వాళ్ళం. ఇటీవల కాలంలో శ్రీ భట్టిప్రోలు రాము అన్నయ్య మచిలీపట్టణంలో నివసిస్తూండటం వలన చంద్రశేఖర రావు గారితో సన్నిహిత సంబంధాలు పెరిగాయి.
అమ్మ అవ్యాజకరుణకి అలౌకికశక్తికి దర్పణం పట్టే ఎన్నో అనుభవాలు చంద్రశేఖరరావు అన్నయ్య గారికి ఉన్నాయి. ఉదా: ఒకసారి వాత్సల్య యాత్రలో అమ్మ మచిలీపట్టణం వచ్చింది. అన్నయ్య అమ్మ దివ్య శ్రీ చరణ సన్నిధిలో ఆసీనులై “అమ్మా! నాకు జీర్ణాశయంలో అల్సర్ వచ్చింది. డాక్టర్లు పరీక్షలు చేసి ఆపరేషన్ చేయాలన్నారు తేదీ కూడా నిర్ణయించారు” అని విన్నవించుకున్నారు.
అమ్మ ఆప్యాయంగా వారి బొజ్జ నిమిరి “నాన్నా అల్సర్ ఉంది, ఆపరేషన్ చేయాలని డాక్టర్లు అంటే చేయించుకో, కానీ, అక్కడ ఏమీ లేదురా అన్నది. అంతే. దరిములా ఏ కారణం చేతనయినా కానీ వారు డాక్టర్వద్దకు వెళ్ళలేదు, శస్త్రచికిత్స చేయించుకోలేదు. 40/50 ఏళ్ళుగా ఆ రుగ్మత ఏమీ లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు..
అమ్మ “ఏమీ లేదు”అని అంటే అది లేకుండా పోయిందా? ఇది అమ్మ మహిమ కాదని అనగలమా?
అమ్మ అమృత కరస్పర్శ ప్రభావం వైభవానికి ఈ సంఘటన ఉదాహరణ కాదా? విధాత రాతను అమ్మ తిరగరాసింది అని అన్నయ్య వక్క్యాపిస్తే ఆ పలుకులు నిజంకావా? అమ్మ సంకల్పాలు, లీలలు, చర్యలు అంచనా వేయగలిగిన శక్తి ఒక మానమాత్రునికి ఉంటుందా?
శ్రీ చంద్రశేఖరరావు అన్నయ్య గారింట్లో అడుగు పెట్టగానే ఎవరికైనా ముందుగా దర్శనం ఇచ్చేది. చిరునవ్వులు చిందించే అమ్మ రమణీయ చిత్రపటం. అది కేవలం వర్ణచిత్రం కాదు. కరచరణాద్యవయవాలతో.. పలకరించే సజీవశిల్పం, ప్రేమైక స్వరూపం.
భక్తిని విశ్వాసాన్నీ ధనంతో కొలువలేము. శ్రీకృష్ణుని తులతూచింది ఒక తులసీదళం మాత్రమే. కాగా, పరాత్పరి అమ్మ మనకోసం దివి నుండి భువికి దిగివచ్చి ఎన్నో సేవా సంస్థల్ని ప్రతిష్ఠించింది. వాటి నిర్వహణకి పురోభివృద్ధికి యథాశక్తి సేవ/ధన రూపేణా సహకరించడం అమ్మ శ్రీ చరణాలను దేవపారిజాతాలతో ఆర్చించినట్లే కదా!
చంద్రశేఖరరావు అన్నయ్య తన Bank Account లో 10 వేలు / 50 వేలు ఎంత చేరితే అంతా తక్షణం అమ్మకు పంపాల్సిందే. అలా వారు పంపిన విరాళం, నాకు తెలిసి, 20 లక్షల పై మాటే. అన్నయ్య అంతటి ఆస్తిపరుడు కాదు, అనన్యసామాన్య ఆస్తిక సంపద కలవాడు. తన జీవిత లక్ష్యం ఏమంటే సమస్త ప్రపంచానికే ఆధారం, కేంద్రకం (NUCLEUS) అయిన అమ్మ సంస్థ పదిష్టంగా ఉంటా సకల విశ్వానికి జ్ఞాన శక్తి ఐశ్వర్య తరంగాల్ని ప్రసృతం చేయాలి – అని.
ఐదు దశాబ్దాలుగా అమ్మ సేవలో చరితార్థతను సంతరించుకున్న సో॥ చంద్రశేఖరరావు గారు 24-01-2022 న మచిలీపట్టణంలో అమ్మలో ఐక్యమైనారు.
‘స్వసుఖ నిరభిలాషః ఖిద్యతే లోక హేతో’ అని మహాకవి కాళిదాను అభివర్ణిస్తారు మహాత్ముల త్యాగగుణాన్ని అది అమ్మలో ప్రస్ఫుటమౌతుంది. అన్నయ్య గార్లవంటి కొన్ని వ్యక్తిత్వాల్లో ఆ తేజస్సు ప్రతిఫలిస్తుంది. కులమత విచక్షణ పాటించకుండా ప్రభుత్వ ఆస్పత్రి, మిషనరీ ఆస్పత్రులలోని రోగులకు చీరెలు, దుప్పట్లు ఆహార పదార్థాలు ప్రేమగా వంచేవారు. సమాజసేవా అమ్మనేవేనని విశ్వసించారు. మనిషి నిరాడంబరులు, హృదయం విశాలం; మాటలు పొదుపు, చేతలు ఉన్నతం, స్వార్థ రహితం. అమ్మ సందేశాన్ని ఆచరణలో చూపిన కొద్దిమందిలో అన్నయ్య ఒకరు.
అ చంద్రశేఖరరావు అన్నయ్య ఆదర్శప్రాయులు, చిరస్మరణీయులు.