1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అందరూ బిడ్డలే

అందరూ బిడ్డలే

Kondamudi Subba Rao
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : December
Issue Number : 5
Year : 2022

ఒకసారి ఒక సోదరుడు అమ్మతో “అమ్మా! మేము నిన్ను దైవం అని నమ్ముతున్నాము. మా జీవనానికి జీవితానికి నీవే మూలం అనీ అనుకుంటున్నాము. అయినా మాకు నీ నుండి ఎన్నో దాపరికాలు. ఎన్నో రహస్యాలు. మా ఉద్యోగాలు వ్యాపారాలే మాకు సర్వస్వం. మా బ్రతుకే మాకు ముఖ్యం. కనీసం మా బ్యాంకు అకౌంట్లను మా కుటుంబానికే గాని నీకు సరెండర్ చేయలేక పోతున్నాము. వట్టి స్వార్థజీవనులం.” అన్నాడు. అమ్మ “నాన్నా నువ్వు చాలా పొరబడు తున్నావు. నువ్వు బ్రతుకుతున్నది నా కోసమే. ఉద్యోగం చేస్తున్నది నా కోసమే. నువ్వు ఏం చేసినా నా కోసమే. అది నాకే చెందుతుంది. ఈ విషయంలో నువ్వు దిగులు పడకు. ఈ కనుపించేవన్నీ నా బిడ్డలే. నీ కుటుంబం కూడా నా బిడ్డలే.. నా బిడ్డ కాని ప్రాణి, వస్తువు…. ఏమీ లేదు. నువ్వు నా బిడ్డవే. నీ కుటుంబ సభ్యులూ నా బిడ్డలే.. ఈ సృష్టి లో ఏ ప్రాణికీ కాకుండా నీ శక్తి, సేవలూ ఎక్కడకి పోతున్నాయి?.

ఇందులో ఎవరికి చెందినా అది నా బిడ్డలకి చెందినట్లే. అంటే నాకు చెందినట్లే. కనుక స్వార్ధం అన్న ప్రసక్తే లేదు. అంతా పరమార్థమే. కనుక చేసే ఏ పని అయినా నాకోసమే అని భావించి శ్రద్ధగా ప్రేమగా చేయి” అని హితోపదేశం చేసి అతనిలో కొడిగట్టిన జీవితేచ్ఛను ఉజ్వలం చేసింది. ఔను. అమ్మ ప్రతి సందర్భంలో తన జగన్మాతృత్వాన్ని ప్రకటించింది. నక్సలైట్లు బిడ్డలే

అమ్మ దగ్గర “జరుగుతున్న నిరంతర అన్న దానాన్ని”, వైభవోపేతంగా జరుగుతున్న మహోత్సవా లను, మరీ ముఖ్యంగా అమ్మ స్వర్ణోత్సవం నాడు లక్ష మంది ఒకే పంక్తిన భోజనం చేయటం చూసి నక్సలైట్లు జిల్లెళ్ళమూడిలో అపరిమిత ధనరాసులు మూలుగు తున్నాయని భ్రమపడి వాటిని దోచుకోవాలని సుదీర్ఘ కాలం పథక రచనచేసి దినం 30-12-1975 అర్ధరాత్రి జిల్లెళ్ళమూడి అందరింటి మీద దాడి చేశారు. కాని వారు ఆశించిన ధనరాసులు లభ్యం కాలేదు. అవి చేతుల్తో పట్టుకుని వెళ్ళే ధనరాసులు అయితేగా,అవి అమ్మ లోకానికి పంచిన మాతృత్వపు వాత్సల్య రాసులని వారు తెలుసుకునే సరికి వాళ్ళ దోపిడీ కాలపరిమితి ముగిసింది. ఎలా వచ్చారో అలాగే వెనుదిరిగారు. సరే యధావిధిగా పోలీసులు పరిశోధన చేసి ఆ నక్సలైట్ల నాయకులను నిర్బంధించి గుర్తింపు కోసం జిల్లెళ్ళమూడి తీసుకుని వచ్చారు. అమ్మ ఎదుట నిలిపారు. అమ్మ సమక్షంలో వారికి ఎలాంటి ట్రీట్ మెంట్ లభిస్తుందోనని ఆ నక్సలైట్ల నాయకులు భీతిచెందారు. కాని అమ్మ వాళ్ళను ఎంతో వాత్సల్యంగా చూసి ముందు వీరికి అన్నం పెట్టించండి. తర్వాత మాట్లాడుకోవచ్చు అన్నది. ముందు పోలీసులు అందుకు సమ్మతించలేదు. కాని అమ్మ “ఇక్కడకు ఎవరైన ఆకలితో రావచ్చు. కాని ఎవరూ ఆకలితో వెళ్లకూడదు. వారి గుణగణాలతో పనిలేదు. అయినా వీరు మాత్రం ఎవరూ? వీళ్లు నా బిడ్డలే. కొంతమంది అడిగి తీసుకుంటారు. కొంతమంది అఘాయిత్యం చేసి తీసుకుంటారు. వీరు రెండో రకం.” ఈ మాటలు విన్న తర్వాత నక్సలైట్ల నాయకులతోపాటు పోలీసులు కూడా విస్తుపోయారు. ఆ నాయకులు కూడా తమ అపార్థాన్ని తెలుసుకుని అమ్మ సమక్షంలో ఆ విషయం విన్నవించుకున్నారు ఔను. అమ్మకు నక్సలైట్లూ బిడ్డలే.

దేవుడూ బిడ్డే

అమ్మ ఒకసారి నెల్లూరులోని శ్రీ రంగనాధస్వామి ఆలయానికి వెళ్ళింది. ఆలయంలోకి వెళుతుండగానే గర్భగుడిలో తల్పశాయి అయిన రంగనాధుడు అమ్మకు కనిపించాడు. అమ్మ ఇక, చకచకా గర్భగుడి ప్రవేశించింది. రంగనాధుని సమీపించింది. ఆ హృద యంలో వాత్సల్యం పొంగులువారటం ఆ ముఖంలో కన్నులలో ద్యోతితమవుతూనే ఉన్నది. అమ్మ విగ్రహాన్ని ప్రేమగా నిమరటం ప్రారంభించింది. ఆది రాయిగా కఠినంగా తగలలేదేమో ఆ ప్రేమాన్విత స్పర్శలో అమ్మ పులకించిపోవటం ప్రక్కనున్నవారికి విదిత మవుతూనే ఉన్నది. అమ్మ హృదయోద్భూత ఆనంద తరంగాలు అందర్నీ సోకుతూనే ఉన్నాయి. అర్చకస్వామి పోసిన జలాన్ని అమ్మ ప్రేమతో రంగనాధునిపై చిలకరించింది. భక్తితో తనను అలకరించిన సుమ మాలను తన మెడ నుండి తీసి అనురాగపూర్వకంగా రంగనాధునికి యిచ్చింది. అమ్మ మామూలుగా ఏ బిడ్డ యింటికి వెళ్లినప్పడు ప్రేమను ఎట్లా అభివ్యక్తం చేస్తుందో, ఆ దేవాలయంలోను అలాగే చేసింది. అమ్మ దృష్టిలో నరుడూ నారాయణుడు ఒక్కటే. బిడ్డలూ దేవుళ్లే. దేవుడూ బిడ్డే.

 వరదకూడా బిడ్డే

1969 మే 19వతేది ఉదయం. అప్పుడే తెల్లవారుతోంది. వరద వెల్లువ రావడమే మత్తగజం వలే మహెూధృతంగాను, కోడెత్రాచువలె బుసలు కక్కుతూనూ వస్తున్నది. జనత భయవిహ్వలమై పోయింది. అందరూ ఇళ్ళు ఖాళీ చేస్తున్నారు.

అమ్మ గదిలో నుండి బయటకు వచ్చింది. మేడ మీద నుండే నాలుగు దిక్కుల కలయచూసింది. అమ్మ పెదవులపైనా, కనుగొలకుల్లోనూ దరహాసదీప్తులు భాసించాయి. ఎవరికీ ఏమీ అర్ధంకాలేదు. రోగిని చావుబ్రతుకుల మధ్య ఆపరేషన్ బల్లపై పడుకోబెట్టి డాక్టర్ పకపకా నవ్వుతున్నట్లుగా ఉన్నది ఆ సన్నివేశం. వెంటనే చీర, రవిక, పసుపు కుంకుమలూ, కొబ్బరి చిప్పలు గంగాభవానికి యిస్తూ, ఆడపిల్లను ఊరికే పంపటమెందుకూ! అని అమ్మ అందరి వంకచూసింది. వరదాయినికి వరద కూడా బిడ్డే

పత్రిక కూడా బిడ్డే

మాతృశ్రీ పత్రిక ప్రారంభోత్సవ సమయంలో నిర్వాహకులు ఎన్నిసార్లు పత్రిక అన్నా అమ్మ, “పుత్రిక” అని సరిచేసింది. జడం, చైతన్యం అని భేదం లేకుండా సమస్త సృష్టిని తన బిడ్డగానే భావించింది.

మరొక సందర్భంలో సోదరులు డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణ మూర్తి గారు, వీరమాచనేని ప్రసాదరావు గారు అమ్మ సమక్షంలో అమ్మ డైరీ లు ప్రక్కన పెట్టుకొని అమ్మ వాక్యాలు సమీక్షించారు. ఆ సందర్భంగా కొన్ని అమ్మ వాక్యాలను అమ్మదృష్టికి తెచ్చి అమ్మా! ఈ వాక్యాలు నీ ప్రతిష్ఠకు భంగకరంగా ఉన్నాయి, వీటిని తీసి వేద్దాము అని విన్నవించారట. అమ్మ వెంటనే “నాన్న ఒక తల్లికి నలుగురు సంతానం ఉన్నారనుకో. వారిలో ఒకరు అప్రదిష్టకరంగా ఉన్నాడని, వాడిని తన సంతానం కాదని అనుకుంటుందా?” అని ప్రశ్నించింది. అమ్మ సర్వమాతృత్వానికి విస్తుపోవటం వారి వంతు అయింది.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!