శ్రీ విఠాల రామచంద్రమూర్తి గారు పొన్నూరులో శ్రీ భావనారాయణ స్వామి సంస్కృత కళాశాలలో కూడా కొద్దికాలం ప్రిన్సిపాల్ గా పని చేశారు. ఆ కొద్ది కాలంలోనే తమ విశిష్ట వ్యక్తిత్వంతో మా ఉపాధ్యాయులందరికీ ఆదర్శంగా నిలిచారు. నేను అదే కళాశాలలో అధ్యాపక వృత్తిని నిర్వహించిన కారణంగా వారి సద్గుణ సంపదనూ, సత్ప్రవర్తననూ ప్రత్యక్షంగా చూడగలిగాను,
నిజానికి వారు మా కళాశాలలో ప్రతికూల పరిస్థితుల్లో పనిచేశారు. కానీ, వారు స్థితప్రజ్ఞులు కనుక తమ ఉద్యోగాన్ని గురించి కాక, విద్యార్థుల శ్రేయస్సూ, అభివృద్ధి లక్ష్యంగా పని చేశారు. “కర్తవ్యమే భగవంతుడు” అని “అమ్మ” ప్రవచించిన సూక్తిని అక్షరాలా అనుసరించారు. చాలామంది విద్యార్థుల మనస్సులలో తనదైన ముద్రను బలంగా వేశారనడం అతిశయోక్తి కాదు,
ఆ రోజులలో మా కళాశాల విద్యార్థులకు హాస్టలులో ఉదయం గం. 9 కు, మళ్ళీ రాత్రి గం.7 కు భోజనం ఉండేది. మధ్యలో ఏమీ తినకుండా అంతసేపు ఆ పేద విద్యార్థులు ఆకలితో నకనకలాడుతూ ఉండటం మాస్టారి మనస్సుకు బాధ కలిగించింది. వారు మా ఆలయ కార్యనిర్వాహణాధికారికి ( మా కళాశాల కరస్పాండెంట్ ) నచ్చచెప్పి, వారిని ఒప్పించి విద్యార్థులకు మధ్యాహ్నం అల్పాహారం(మజ్జిగ అన్నం) ఏర్పాటు చేయించారు. ఇది వారిలోని “అమ్మ” తత్త్వానికి మచ్చుతునక.
మా కళాశాలకు సంబంధించిన ఏ వ్యవహారానికి అయినా, ఆర్థికంగా మాస్టారే ముందుకువచ్చి, ఆ పని సత్వరంగా జరిగేటందుకు బాధ్యత పడేవారు.
తాను క్రొత్తగా మా కళాశాలకు వచ్చినా, తన మాతృసంస్థతో సమానంగా మా కళాశాల అభివృద్ధికి పాటుపడ్డారనేది అక్షర సత్యం.
సాటివారికి సాయం చేయటం వారికి సహజ గుణమే. అయితే, “అమ్మ” సన్నిధిలో తమ వ్యక్తిత్వానికి మరిన్ని మెఱుగులు దిద్దుకున్న మాస్టారు, తమ మంచితనంతో, మానవతా దృక్పథంతో… మనందరి హృదయాలలో చిరంజీవిగా ఉన్నారు.
“అమ్మ” తత్త్వాన్ని పూర్తిగా ఒంటపట్టించుకున్న “అమ్మ” అనుంగుబిడ్డ శ్రీ విఠాల రామచంద్ర మూర్తిగారు. తాను ఆకళింపు చేసుకున్న అమ్మతత్త్వాన్ని జీవితాంతం అక్షరాలా ఆచరించిన ఈ మహనీయుడు నాకు దేవుడిచ్చిన అన్నయ్య అని నేను అనుకుంటాను. వారికి సుగతిని అనుగ్రహించింది. “అమ్మ”,
జయహో మాతా..