అమ్మను దర్శించడానికి మార్చి 1985లో మద్రాసు నుంచి శ్రమలర్ మన్నన్ అనే తమిళ పత్రికా సంపాదకుడు వచ్చేరు. వీరు తమిళమాసపత్రిక “జ్ఞానభూమి” సంపాదకులు, తమిళపాఠకులకు అమ్మను పరిచయం చెయ్యాలని ఆయన అభిలాష. ఆయన అమ్మను గురించి విన్నారు. చదివేరు. ఇప్పుడు స్వయంగా అమ్మను చూడాలని వచ్చేరు.
అమ్మను ఎన్నో అడిగి తెలుసుకున్నారు. ఆయన శ్రద్ధ, ఆసక్తి చూసి అమ్మ చక్కని వివరణ యిచ్చేరు. అయితే అమ్మ అన్నారు : “నేనేమీ చదువుకోలేదు నాన్నా. తెలుసుకోవాలని నేనేమీ సాధన చెయ్యలేదు”.
అప్పుడాయన ఆశ్చర్యంతో : ‘అమ్మా! ఈ లోకంలో అందరినీ బిడ్డల్లాగ చూసే విధానం పూర్వం ఎక్కడా కనబడదు. ఏ గ్రంధాల్లోనూ ఉన్నట్లు లేదు. మరి మీరు ఏ సాధనా చెయ్యలేదంటున్నారు. మీకు యీ భావం ఎలాగ వచ్చింది ?”
అమ్మ మౌనం వహించారు. అమ్మ ఏమీ సమాధానం యివ్వలేదు. ఆయన ఊరుకోలేదు.
మళ్ళీ అడిగేరు.
చాలా చక్కటి ప్రశ్న అనుకున్నాను. యిదంతా హాల్లో వింటూ అమ్మా ఆయన, కుతూహలాన్ని మెచ్చుకునే ఉంటారు అనుకున్నాను.
అమ్మ : ఏమో నాన్నా! నాకేమీ తెలియదు. ఏ శాస్త్రం చదివీ యీ భావం పొందలేదు. ఏ సాధన చేసి యీ భావం సంపాదించలేదు” అన్నారు అమ్మ.
మన్నన్ : “ఎంత గొప్ప భావం అద్భుతమైన ఆలోచన మీకు మాత్రమే ఎట్లా కలిగింది ? మీకు యీ భావం ఎప్పటి నుంచి ఉంది ?”
అమ్మ : చిన్నప్పటినుంచీ సహజంగానే ఉంది. చిన్నప్పటి నుంచీ నాకు ఎవరిని చూచినా నాబిడ్డలనిపిస్తుంది. ఎక్కడో పుట్టారు. ఎవరో కన్నారు. ఇప్పుడు నన్ను చూడడానికి వచ్చారు – అని అనిపించేది. మిమ్మల్ని అందరినీ నేనే కన్నాను. మీ తల్లులకు పెంపుడిచ్చాను అనిపిస్తుంది”
ఇంత గొప్ప మాటలు వినగానే ఆ పత్రికా సంపాదకుని ఆనందానికి అవధుల్లేవు. అమ్మనోట స్వయంగా వినటానికి నోచుకున్న మన్నన్ అదృష్టవంతుడు.